
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు, మరో 15 మంది సస్పెండ్
- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంక్వైరీ
- నిర్లక్ష్యం వహించిన 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు
- ఫేక్ అటెండెన్స్పై మంత్రి సీతక్క సీరియస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న.. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను డీఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. వెంటనే ఆ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సెక్రటరీల అటెండెన్స్పై పంచాయతీరాజ్శాఖ ఫోకస్పెట్టింది. ఎక్కడెక్కడ ఫేక్ అటెండెన్స్ వేశారనేదానిపై ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12,760 పంచాయతీలు ఉండగా.. వందల సంఖ్యలో కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
సెక్రటరీల ఫేక్ అటెండెన్స్పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదిలేదని అధికారులను హెచ్చరించారు. ఫేక్ అటెండెన్స్ వేసిన సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని పీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఫేక్ అటెండెన్స్పై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 553 మంది పంచాయతీ సెక్రటరీలు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు. భారీ సంఖ్యలో ఫేక్ హాజరు నమోదవుతుండటంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు హాజరు నమోదు చేస్తున్నవారిపై మంత్రి ఆదేశాలతో చర్యలు చేపడుతున్నారు. శనివారం ఒక ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుంచి తొలగించారు. మరో 15 మందిని సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు
ప్రతిరోజూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లి డెయిలీ శానిటేషన్ రిపోర్టు యాప్లో ఫేస్ రికగ్నైజ్డ్ మాడ్యూల్లో హాజరు వేసుకోవాలి. పనిచేసే దగ్గర నేరుగా ఫొటో దిగి అప్ లోడ్ చేయాలి. యాప్లో అప్ లోడ్ చేస్తున్న ఫొటో (సెక్రటరీ) వ్యక్తిదేనా? కాదా? నేరుగా దిగి అప్ లోడ్ చేశారా? ఫొటోను తీసి అప్ లోడ్ చేశారా? అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీఓలు, డీపీఓలపై ఉంది. అయితే, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఫేక్ అటెండెన్స్కు దారితీసిందని పీఆర్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెక్రటరీలతోపాటు వారి అటెండెన్స్ను పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు నిర్లక్ష్యంగా వ్యవరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు విధుల్లో అలసత్వం ప్రదర్శించిన 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.