రాజస్థాన్లో రైతులు ఆందోళనకు దిగారు. సవరించిన భూ సేకరణ చట్టం కింద తమ భూమలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జైపూర్ శివారు గ్రామాలకు చెందిన రైతులు రెండు రోజులుగా జమీన్ సమాధి పేరుతో చాతి లోతు గోతిలో పూడ్చుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే ఐదుగురు రైతుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించింది. అయినా నిరసనను విరమించేందుకు నిరాకరిస్తున్నారు.
2011 జనవరిలో రాజస్థాన్ ప్రభుత్వం హౌసింగ్ ప్రాజెక్టు కింద 10 వేల ఇళ్ళను నిర్మించి ఇస్తామని ప్రకటించింది. దీని కోసం భూ సేకరణను ప్రారంభించింది. అయితే బ్రిటిషు కాలం నాటి భూ సేకరణ చట్టం కింద కాకుండా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సవరించిన భూ సేకరణ చట్టం కింద తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హౌసింగ్ ప్రాజెక్టు కోసం జైపూర్ డెవలప్మెంట్ అధార్టీ (JDA) భూములను సేకరించింది.