- ఆర్ఈబీఆర్ సర్వేలో వెల్లడి
ఇండియాలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా ఆన్లైన్ కంపెనీ అమెజాన్ ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో మైక్రోసాఫ్ట్ ఇండియా, సోనీ ఇండియా నిలిచాయని తాజా సర్వే వెల్లడించింది. సోమవారం విడుదలైన రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్(ఆర్ఈబీఆర్) 2019లో ఫైనాన్సియల్ హెల్త్, లేటెస్ట్ టెక్నాలజీల వాడకం, మంచి కీర్తి ప్రతిష్టలున్న కంపెనీగా అమెజాన్ అత్యధిక స్కోర్ను సంపాదించుకుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ రీసెర్చ్లో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత సోని ఇండియా ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ 4వ స్థానం, ఐబీఎం 5వ స్థానం, ఎల్ అండ్ టీ 6వ స్థానం, నెస్లే 7వ స్థానం, ఇన్ఫోసిస్ 8వ స్థానం, శాంసంగ్ 9వ స్థానం, డెల్ 10వ స్థానంలో నిలిచాయి. రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ గ్లోబల్ ఎకానమీలో 75 శాతాన్ని కవర్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా రెస్పాండెంట్లతో 32 దేశాలు దీని రీసెర్చ్లో పాల్గొంటున్నాయి. ఇండియన్ ఉద్యోగులు ఎంప్లాయర్ను ఎంపిక చేసుకునే ముందు శాలరీని, ఉద్యోగి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటున్నారని, ఆ తర్వాత వర్క్–లైఫ్ బ్యాలెన్స్ను, జాబ్ సెక్యురిటీని చూస్తున్నారని సర్వే పేర్కొంది. మెజార్టీ ఇండియన్లు(అంటే 55 శాతం మంది) బహుళ జాతీయ కంపెనీల్లో పనిచేయడానికే మొగ్గుచూపుతున్నారని కూడా సర్వే తెలిపింది. కేవలం 9 శాతం మంది మాత్రమే స్టార్టప్ల వైపుకి వెళ్తున్నారని చెప్పింది. ఎంఎన్సీలు తమ సంస్థల్లో జాబ్ సెక్యురిటీని, ఫైనాన్సియల్ హెల్త్ను, కెరీర్ను పెంచుకునే అవకాశాలను ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్నాయని వివరించింది.