సాంకేతిక ప్రపంచంలోనే డిసెంబర్ 3 ఓ ముఖ్యమైన రోజు. సరిగ్గా 30ఏళ్ల క్రితం, ఇదే రోజున మొదటిసారిగా మొబైల్ ఫోన్ నుండి (ఎస్ఎంఎస్) టెక్స్ట్ మెసేజ్ ను పంపించారు. అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ ప్రారంభమై అప్పుడే 30ఏళ్లు గడిచిపోయిందన్నమాట. అయితే దీన్ని యునైటెడ్ కింగ్డమ్లోని బెర్క్షైర్లోని వోడాఫోన్ ఇంజనీర్ నీల్ పాప్ వర్త్ తొలిసారిగా ఓ ఎంస్ఎస్ చేశారట.
ఇప్పుడంటే వాట్సాప్, టెలిగ్రామ్, మెస్సేంజర్ లాంటి యాప్స్ వచ్చాయి గానీ... అప్పట్లో ఏ అవసరం వచ్చినా టెక్స్ట్ మెసేజ్ లపై ఆధారపడాల్సిందే. ఈ రోజుల్లో ఎక్స్ ప్రెషన్స్ కు సింబల్స్ గా ఎమోజీలను ఉపయోగిస్తున్నాం గానీ.. అప్పట్లో అలాంటివేం లేవు. ఏం చెప్పాలన్నా రాసి పంపించాల్సిందే. అయితే ఇప్పుడున్న మోడ్రన్ టెక్నాలజీకి పునాది పడింది మాత్రం ఎస్ఎంఎస్ ల వల్లనే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దానికి కర్త, కర్మ, క్రియ వోడాఫోన్ ఇంజినీర్ నీల్ పాప్వర్త్. 1992 డిసెంబర్ 3న తొలిసారిగా రిచర్డ్ జార్విస్కు 'మేరీ క్రిస్ట్మస్' అని ఓ మెసేజ్ పంపాడు. టెక్స్టింగ్ టెక్నాలజీ పనిచేస్తోందా? లేదా? అని చెక్ చేయాలని భావించిన నీల్... అదే సమయంలో పార్టీలో ఉన్న తన బాస్కు ఈ మెసేజ్ను పంపించాడు. అయితే తన బాస్ జార్విస్ వద్ద ఆర్బిటెల్ 901 ఫోన్ ఉండేదట. దాని బరువు 2.1 కేజీలని సమాచారం.
అయితే టెక్స్టింగ్ అనేది ఇంత ఫేమస్ అవుతుందని.. 1992లో తనకు తెలియదని నీల్ చెప్పారు. ఇప్పుడు మిలియన్ల మంది వాడుతున్న యాప్స్లో ఎమోజీలు కూడా వచ్చేశాయని... ప్రపంచంలోనే తొలి మెసేజ్ తానే పంపించానని.. ఇటీవలే తన పిల్లలకు చెప్పానన్నారు. తాను పంపించిన ఆ మెసేజ్.. మొబైల్ ఫోన్ చరిత్రలోనే అత్యంత కీలకంగా మారిందని ఇప్పుడు అనిపిస్తోందంటూ హర్షం వ్యక్తం చేశారు. మామూలుగా అయితే 1980లోనే ఈ మెసేజింగ్ ఐడియా వచ్చిందట. కానీ అది కార్యరూపం దాల్చేసరికి 10ఏళ్లు పట్టిందంటే అతిశయోక్తి కాదు. తొలినాళ్లల్లోఈ మెసేజ్ ద్వారా కేవలం 160 క్యారెక్టర్లను పంపడానికి మాత్రమే వీలయ్యేది. ప్రస్తుతం సోషల్ మీడియా రాకతో ఇప్పుడు వివిధ యాప్స్ అందుబాటులోకి వచ్చి టెక్స్టింగ్ రూపం ఇంకా విస్తరిస్తూ వచ్చింది. ఇంకో విషయమేమిటంటే పబ్లిక్ ఈ మెసేజింగ్ సర్వీసులను అధికంగా వినియోగించడంతో టెలికం సంస్థలు కూడా ప్రత్యేక ప్లాన్లు ప్రకటించేవి. ఇక 2010లో టెక్స్టింగ్ అనే పదాన్ని డిక్షనరీలో జోడించారు. ఇప్పటికీ ఈ టెక్ట్సింగ్ సర్వీసెస్ ఉన్నా కూడా చాలా మంది వాట్సాప్, టెలిగ్రామ్ లనే ఎక్కువగా వాడుతున్నారు.