ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చినా తగ్గని ట్రాఫిక్​ 

ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చినా తగ్గని ట్రాఫిక్​ 
  • గంటకు 20 కి.మీ మించని వెహికల్ స్పీడ్​ 
  • రద్దీతో వాహనదారులకు ఇబ్బందులు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ​తిప్పలు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్​లో ఐటీ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫీసు​లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు ట్రాఫిక్​లో నరకం చూస్తున్నారు. ఐటీ కారిడార్​లో​ఉదయం, సాయంత్రం వేళల్లో కార్లు, బైక్​ల వేగం 10 నుంచి 30 స్పీడ్ ​దాటడం లేదు. 10 కిలోమీటర్ల దూరానికి గంటకు పైనే టైమ్ పడుతోంది. దీంతో ఈ ట్రాఫిక్​లో ఆఫీసుకు వెళ్లడం కంటే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవడమే బెస్ట్​అని చాలా మంది భావిస్తున్నారు. ట్రాఫిక్​రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్లు, అండర్​ పాస్​లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య ​ఎక్కువవుతోందే తప్ప తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం నరకం మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో, ఇతర జాబ్ లు చేసేవారు సిటీ నలుమూలల నుంచి క్యాబ్​లు, బైక్​లు, సొంత కార్లు, పబ్లిక్ సర్వీసులలో ఐటీ కారిడార్​కు చేరుకుంటారు.

దీంతో ఈ రూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతంలోని ​రోడ్లు మొత్తం వెహికల్స్​తో నిండిపోయి ఉంటాయి. బంపర్ ​టూ బంపర్​అన్న విధంగా వెహికల్స్ ​మూవ్​అవుతూ ఉంటాయి. ఇంతటి తీవ్ర ట్రాఫిక్​ కారణంగా ఐటీ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. హైటెక్​సిటీ నుంచి జేఎన్టీయూ మీదుగా ప్రగతినగర్​కు 12 కిలోమీటర్ల దూరం ఉండగా.. రద్దీ టైమ్​లో ఈ రూట్లో ప్రయాణానికి దాదాపు గంట సమయం పడుతోంది. గచ్చిబౌలి నుంచి షేక్​పేట​కు 6.2 కి.మీ. దూరం ఉండగా.. ఈ రూట్లో ఉదయం, సాయంత్రం ప్రయాణానికి అరగంట పడుతోంది. వెహికల్స్ మొత్తం బారులు తీరుతున్నాయి. గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్​చౌరస్తాకు 11 కిలోమీటర్ల దూరం ఉండగా.. మామూలుగా అయితే 20 నిమిషాలు పట్టే ఈ ప్రయాణానికి రద్దీ కారణంగా ముప్పావుగంట పడుతోంది. భారీ ట్రాఫిక్​తో టైంకు ఆఫీసులకు చేరుకోలేకపోతున్నామని ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్​ను తట్టుకోలేక వర్క్​ ఫ్రమ్​ హోం చేస్తున్నా

మా ఇంటి నుంచి మైండ్​స్పేస్​లోని ఆఫీస్​కు 30 కి.మీలు. ప్రతిరోజు ఉదయం ఆఫీస్​​కు వెళ్లడానికి గంట 45 నిమిషాలు, సాయంత్రం అఫీస్​ నుంచి ఇంటికి రావడానికి రెండున్నర గంటల టైమ్ పడుతోంది. ట్రాఫిక్​లో ​బైక్ ​స్పీడ్ 10 నుండి 20కి మించి వెళ్లడం లేదు. ట్రాఫిక్​లో ఎక్కువసేపు​ బైక్ డ్రైవింగ్​తో బ్యాక్ పెయిన్​వస్తోంది. దీంతో ఆఫీస్​కు వెళ్లే బదులు ఇంట్లో ఉండి వర్క్​ఫ్రం హోం చేస్తున్నా.
– విజయ్​ ఐటీ ఎంప్లాయ్, బోడుప్పల్

ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు కట్టినా ట్రాఫిక్ ​తగ్గలే 

ఐటీ కారిడార్​లో ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​ల నిర్మాణం వల్ల రద్దీ తగ్గిందని నేతలు చెబుతున్నారు. కానీ ఎక్కడా ట్రాఫిక్​ తగ్గలేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. హైటెక్​సిటీ నుంచి కూకట్​పల్లి వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్​లో గంటల తరబడి ఉండాల్సి వస్తోంది.
– లక్ష్మణ్, ప్రైవేటు ఎంప్లాయ్, కూకట్​పల్లి