
ఈ మధ్యకాలంలో తెలంగాణ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరున జరుగుతున్న విధ్వంసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ ఆగడాలు మరి ఎక్కువగా సాగుతున్నాయని చెప్పడానికి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో గత కొన్ని నెలల కిందట నుంచి వీడీసీలపైన నమోదైన కేసులనే నిదర్శనంగా చెప్పవచ్చు.
తెలంగాణ ప్రాంతంలో ఏ పల్లెల్లో చూసిన రాజ్యాంగబద్ధసంస్థలైన గ్రామపంచాయతీ వ్యవస్థ కన్నా వీడీసీలే బలమైన శక్తిగా పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న వీడీసీల విధ్వంసాలను చూసి ఉన్నత విద్యావంతులైన మేధావి వర్గం, సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడీసీలు ఏమైనా రాజ్యాంగబద్ధ సంస్థలా అనే చర్చ తెలంగాణ పల్లెల్లో జోరుగా సాగుతోంది. సర్పంచ్, గ్రామ పంచాయతీ వ్యవస్థకన్నా బలీయమైన శక్తిగా పనిచేస్తూ, రాజ్యాంగేతర, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.
రాజ్యాంగేతర శక్తిగా వీడీసీ73వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్నవిధంగా ఆర్టికల్ 40 ఆధారంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 243 ప్రకారం గ్రామ పంచాయతీకి 29 విధులను నిర్వర్తించాలని సూచించడం జరిగింది.
ఇది సమర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడానికి, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, కార్యనిర్వాహక అధికారి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ నియమాలకు అనుకూలంగా పని చేస్తారు. వీటిని కాదని తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లెల్లో రాజ్యాంగేతర శక్తిగా గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీ)లు అవతరించి, అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పడానికి, ఈ మధ్య కాలంలో జరిగిన అనేక సంఘటనలను ఉదాహరణగా చూపవచ్చు.
బెల్ట్ షాపులతో యువత చిత్తు
మన రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో అక్రమంగా వెలిసిన బెల్ట్ షాపులు దర్శనమిస్తాయి. ఈ బెల్ట్ షాపులను గ్రామాభివృద్ధి కమిటీలు వేలంపాట ద్వారా ఎవరైతే ఎక్కువ వేలం పాడతారో వారికి కట్టబెట్టి, ప్రభుత్వానికి రావలసిన లక్షల, కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పవచ్చు.
ప్రతి గ్రామంలో అక్రమ బెల్ట్ షాపులు తెరవడం వలన గ్రామంలోని యువత ఎక్కువగా మద్యానికి బానిసై వారి భావి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పడంలో సందేహం లేదు. వీటికి తోడు గ్రామాలలో కల్లుబట్టీలను, శీతల పానీయాలను కూడా వేలం వేసి లక్షల రూపాయలను సమకూర్చుకుంటున్నారు.
ఇలాంటి అక్రమ వ్యాపారాల వలన గ్రామాలలోని నిమ్నవర్గాలకు సంబంధించిన ప్రజలు మద్యానికి బానిసై వారి జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారని మనం అనేక కథనాలను వింటున్నాం. ల్యాండ్, సాండ్, మైనింగ్ మాఫియాలలో కూడా గ్రామాభివృద్ధి కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పడం జగమెరిగిన సత్యం.
చిల్లర మల్లర పంచాయితీలే ఎక్కువ..
గ్రామాలలో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలను పరిష్కరించి పబ్బం గడుపుకోవడం గ్రామాభివృద్ధి కమిటీలకు నిత్యకృత్యమే. భూ తగాదాలకు సంబంధించిన పంచాయితీలు, కుల వివాదాలకు సంబంధించిన పంచాయితీలు, భార్యాభర్తలు వివాదాలకు సంబంధించిన పంచాయితీలు, ఇతర వివాదాలను పరిష్కరించి, జరిమానాలు విధించడం వీడీసీలకు పరిపాటిగా మారింది.
చట్టాన్ని, న్యాయాన్ని పాటించకుండా, పరిగణనలోకి తీసుకోకుండా తీర్పులు ఇవ్వడం శోచనీయం. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీల మాట వింటేనే సరి, లేదంటే వారికి కుల బహిష్కరణనో, సాంఘిక బహిష్కరణనో విధించడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనల వల్ల అనేక గ్రామాలలో నిమ్న కులాలవారు, వర్గాలవారు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం ఎన్నో చూశాం.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థను పక్కనపెట్టి, తెలంగాణ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీలే రాజ్యాంగేతరశక్తిగా క్రియాశీలక పాత్ర పోషించడం గమనార్హం. ఇప్పటికైనా తెలంగాణ పల్లెల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ విధ్వంసాన్ని స్పృష్టిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీల వ్యవస్థను రద్దుచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- దర్శనం దేవేందర్,సోషల్ ఎనలిస్ట్ -