
- ఆయిల్ పామ్, మునగ సాగుకు అవకాశం
- ఉమ్మడి మెదక్ జిల్లా లక్ష్యం 2,800 ఎకరాలు
- జాబ్ కార్డు ఉన్న రైతులకు సాయం
- మూడేళ్లపాటు మెయింటనెన్స్ ఛార్జీలు
మెదక్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ ఈజీఎస్) కింద చెరువు, కుంటల్లో పూడిక తీత, పంట కాల్వల తవ్వకం, చేపల చెరువుల నిర్మాణం వంటి పనులు మాత్రమే కాకుండా రైతులకు ప్రయోజనం చేకూరేలా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాబ్ కార్డు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రాయితీలు ఇస్తున్నారు. ఈ సీజన్ లో పండ్ల తోటల పెంపకానికి సంబంధించి జిల్లాల వారీగా లక్ష్యాలు కేటాయించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది 2,800 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయించాలని టార్గెట్ గా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 1,300 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 800 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 700 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయించాలని భావిస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు ఎకరాల్లో తోటల పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు.
పండ్లు, ఆయిల్పామ్తోటలు
మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, సపోటా, అల్లనేరేడు, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్లతో పాటు కొబ్బర, ఆయిల్ పామ్, మునగ తోటలు కూడా సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి సొంత పొలం, బోరు, కరెంట్ కనెక్షన్ ఉన్న రైతులు పండ్ల తోటల పెంపకానికి అర్హులుగా గుర్తిస్తారు. ఈ స్కీమ్ కింద అర ఎకరం నుంచి 5 ఎకరాల విస్తీర్ణం వరకు పండ్ల తోటలు సాగు చేసుకునే వీలుంది. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ మాత్రం అర ఎకరం విస్తీర్ణంలో మాత్రమే సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. కొబ్బరి చెట్లు పొలం గట్ల మీదనే కాకుండా తోటలా పెంచేందుకు కూడా అవకాశం ఉంది.
మూడేళ్ల వరకు సాయం
ఆసక్తి, అర్హత ఉన్న రైతులు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవో కు దరఖాస్తు చేసుకోవాలి. పొలానికి సంబంధించిన పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఉపాధి హామీ జాబ్ కార్డు దరఖాస్తుతో జత చేయాలి. మంజూరైన రైతుల పొలాల్లో పండ్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీల ద్వారా గుంతలు తీయిస్తారు. రైతులు మొక్కలు కొనుక్కొచుకుంటే వాటి డబ్బులతో పాటు, రవాణా ఛార్జీలను సైతం చెల్లిస్తారు. వాచ్ అండ్ వార్డ్ కింద మొక్కల సంరక్షణ కోసం ఒక మొక్కకు రూ.12.53 చొప్పున మూడేళ్ల వరకు మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లిస్తారు.