
స్విఫ్ట్, శాంట్రో జింగ్కే ఎక్కువ మొగ్గు
కార్స్24 సర్వే రిపోర్టు
న్యూఢిల్లీ: లాక్డౌన్ ముగుస్తున్న తరుణంలో సెకెండ్ హ్యాండ్ కార్లకు మంచి డిమాండ్ వస్తోందని యూజ్డ్ కార్లను అమ్మే ప్లాట్ఫామ్ కార్స్ 24 పేర్కొంది. లాక్డౌన్ ముందుతో పోలిస్తే వీటి ధరలు తగ్గడం కూడా దీనికొక కారణమని తెలిపింది. మారుతీ స్విఫ్ట్, హ్యుండయ్ శాంట్రో జింగ్, హ్యుండయ్ గ్రాండ్ ఐ 10, హోండా సిటీ, మారుతీ స్విఫ్ట్ డిజైర్ వంటి ఐదు మోడళ్లకు కస్టమర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పింది. సొంత కారు ఉండడంపై కార్స్24 ఓ కస్టమర్ సర్వే చేసింది. లాక్డౌన్ ముగిశాక సొంతంగా కారు కొనుక్కోవాలని 40–45 శాతం కస్టమర్లు చెప్పారని పేర్కొంది. కరోనా నేపథ్యంలో సేఫ్టీ కోసం సొంత వెహికల్ ఉండడం మంచిదని కస్టమర్లు భావిస్తున్నారని కార్స్24 ఫౌండర్ గజేంద్ర జంగిడ్ అన్నారు. లాక్డౌన్కి ముందు కారు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనలోనూ మార్పులొస్తున్నాయని అన్నారు. వీరిలో 23 శాతం మంది కొత్త కారుకి బదులు సెకెండ్ హ్యాండ్ కారు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. లాక్డౌన్తో కస్టమర్ల ఆదాయం పడిపోవడం కూడా ఇందుకు కారణమని అన్నారు. కార్స్24 వెబ్సైట్లో సెల్లర్ సైడ్ కంటే బయ్యర్ సైడ్ నుంచే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని గజేంద్ర చెప్పారు. సెకెండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరుగుతోందని, ఇది లాక్డౌన్ ముందు స్థాయికి చేరుకుంటోందని అన్నారు. వెబ్సైట్లో బయ్యర్ సైడ్ నుంచి నెలకు 20 లక్షల నుంచి 25 లక్షల విజిట్స్ వస్తున్నాయని అన్నారు. సెకెండ్ హ్యాండ్ కార్ల ధరలు తగ్గడం కూడా వీటి డిమాండ్ పెరగడానికి కారణంగా ఉందని చెప్పారు. గతంలో సగటున రూ. 2.6 లక్షలున్న కారు, ప్రస్తుతం రూ.2.25 లక్షలకు తగ్గిందన్నారు. కరోనా దెబ్బతో ప్రస్తుతం సొంత వెహికల్ ఉండడం ఒక అవసరంగా మారిందని అభిప్రాయపడ్డారు.
For More News..