మున్సిపాలిటీల్లో ఫండ్స్ ​ఫుల్.. డెవలప్ మెంట్ నిల్​

మున్సిపాలిటీల్లో ఫండ్స్ ​ఫుల్.. డెవలప్ మెంట్ నిల్​
  • గ్రేటర్ శివారు మున్సిపాలిటీల్లో ఇదీ పరిస్థితి 

హైదరాబాద్, వెలుగు: నగర శివారు మున్సిపల్​కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫండ్స్​ఫుల్ గా​ఉన్నప్పటికీ డెవలప్ మెంట్​మాత్రం జరగడంలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో వీలినం అయినప్పటికీ.. నాటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు అధ్వానంగా మారాయి. గతంలో సమస్యలుంటే స్థానికంగా ఉండే సర్పంచ్ ని అడిగితే ఎంతో కొంత పనులు జరిగేవి. ఇప్పుడు మేయర్లు, చైర్మెన్​లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అడగలేని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో నేటికీ నల్లా కనెక్షన్లు లేవు. వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు పడే ప్రాంతాల్లోనూ కనీస చర్యలు తీసుకోలేదని, చెరువుల అభివృద్ధిని పట్టించుకోవడంలేదని పాలకులపై ప్రజలు మండిపడుతున్నారు. చెత్త నిర్వహణ లేకపోవడంతో రోడ్లపై, ఖాళీ ప్రాంతాల్లో పారేస్తుండటంతో ఆ ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. 

పేరుకే మున్సిపాలిటీలు

2018 ఆగస్టులో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉన్నాయి. మేజర్​పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చిన ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాలను కూడా విలీనం చేసింది. పట్టణాలుగా మార్చడం వల్ల అభివృద్ధి జరుగుతుందని జనం అనుకున్నప్పటికీ.. జనాలపై పన్నుల భారం పెరిగిందే తప్ప డెవలప్ మెంట్ కనిపించడంలేదు. విలీన గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు. మున్సిపాలిటీల ఏర్పాటు సమయంలో, ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. కంకర తేలిన రోడ్లకు, కూలిన డ్రైనేజీలకు కూడా రిపేర్లు చేయించడం లేదు.  

భారీగా ఫండ్స్​ ఉన్నప్పటికీ..

గ్రేటర్ శివారులోని బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 22 మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్ని మినహా ఒక్కో కార్పొరేషన్ లో రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు, మున్సిపాలిటీల్లో  రూ.5నుంచి రూ.10 కోట్ల వరకు జనాల నుంచి పన్ను రూపంలో వసూలైన ఫండ్స్​ఉన్నాయి. కానీ వీటిని జనం కోసం ఖర్చు పెట్టేందుకు మేయర్లు, చైర్మన్లు ముందకు రావడం లేదు. కొన్నిచోట్ల వివాదాలు నెలకొనడంతో పనులు ఆగిపోతున్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెయిన్ రోడ్డును 2 కి.మీ మేర వైడెనింగ్ చేసేందుకు రెండేండ్ల కిందట ఫండ్స్​రిలీజ్ చేశారు. మొదట 100 అడుగులతో సెంట్రల్ లైటింగ్ విభాగాలతో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. అయితే, నిధులు సరిపోవడం లేదంటూ స్థానికులు జోక్యం చేసుకుని.. 55 అడుగుల వెడల్పు మాత్రమే చేయాలంటూ పట్టుబట్టడంతో ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి జనం అవస్థ పడుతున్నారు. మరికొన్ని చోట్ల అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలతో డెవలప్ మెంట్ పనులు ​ముందుకు సాగడం లేదు. 

సరిపడా స్టాఫ్​లేక కష్టాలు..

కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ మేరకు తగిన స్టాఫ్​ను కేటాయించ లేదు. చాలా మున్సిపాలిటీల్లో  ఇన్ చార్జిలు, డిప్యూటేషన్లపై వచ్చిన వారే డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి 10 వేల మంది జనాభాకు 28 మంది సిబ్బంది(కార్మికులు) ఉండాలని రూల్స్ చెబుతున్నప్పటికీ.. సిబ్బంది మాత్రం తక్కువగా ఉంటున్నారు. అన్ని మున్సిపాలిటీలకు స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసిన సర్కార్ వాటిని నడిపేందుకు డ్రైవర్లను నియమించకపోవడంతో కొన్నిచోట్ల వెహికల్స్​మూలనపడ్డాయి. దీంతో కాలనీల్లో వారాల తరబడి చెత్త పేరుకపోయి కంపుకొడుతున్నాయి. చాలాచోట్ల డంపింగ్​యార్డులు లేక చెత్తను వేరే ప్రాంతాలకు తరలిస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ల ఏర్పాట్లు కూడా ముందుకు సాగడం లేదు. కనీస సౌలతులు కల్పించకుండానే మున్సిపల్ ఆఫీసర్లు స్థానికుల నుంచి అన్ని ట్యాక్స్​లు వసూలు చేస్తున్నారు.

బండ్లగూడ జాగీర్​మున్సిపల్​కార్పొరేషన్ లో విలీనమైన పీరం చెరువు, గంధంగూడ గ్రామపంచాతీయల్లో సమస్యలు ఎప్పట్లాగే ఉన్నాయి. కార్పొరేషన్​అయ్యాక సమస్యలు తీరుతాయని స్థానిక జనం  ఆశించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ ఆస్తి పన్నుల ద్వారా ఏడాదికి రూ.30 కోట్లు, ఇండ్ల పర్మిషన్స్ ద్వారా కార్పొరేషన్ కు భారీగానే ఆదాయం వస్తోంది. కానీ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. కార్పొరేషన్ పరిధిలో కనీసం శ్మశాన వాటికలు లేవు. అంత్యక్రియల కోసం ఇక్కడి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని లంగర్ హౌస్​కు వెళ్లాల్సి వస్తోంది.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని పన్నుల ద్వారా ఏడాదికి రూ.50 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రూ.20 కోట్ల ఫండ్స్​ఉన్నాయి. కానీ డెవలప్ మెంట్ కోసం కార్పొరేషన్ ఎలాంటి ఖర్చు చేయడం లేదు. రోడ్లు, డ్రైనేజీ, నాలాలు ఇలా అనేక సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు.

రెండు లక్షల జనాభా ఉన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్​లో ఎలాంటి అభివృద్ధి జరగడంలేదు. కార్పొరేషన్​ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. బాలాజీనగర్ లో డ్రైనేజీ సమస్య తో పాటు రోడ్లు, వాటర్ ప్రాబ్లమ్ ఇలా అనేక సమస్యలు వేధిస్తున్నాయి.

ప్రభుత్వం ఫండ్స్ ఇయ్యాలి

 మున్సిపాలిటీల్లో ట్యాక్స్ లు పెరుగుతున్నయ్. కానీ అభివృద్ధి జరగడం లేదు. నాలుగేండ్లు గడిచిపోయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు పడిన ప్రాంతాలను కూడా పట్టించుకుంట లేరు. రోడ్లు, డ్రైనేజీ, నీటిసమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

- డి.వెంకటాచారి, బీజేపీ అధికార ప్రతినిధి, బోడుప్పల్  కార్పొరేషన్