బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలోని టాప్ 100 మంది ధనవంతుల లిస్టులో అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ టాప్లో నిలిచారు. కిందటేడాది గౌతమ్ అదానీ సంపద మూడు రెట్లు పెరిగితే ఈ ఏడాది రెండింతలకు పైగా ఎగిసింది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ‘ఇండియాస్ 100 రిచ్లిస్ట్’ లో 150 బిలియన్ డాలర్ల (రూ. 12.3 లక్షల కోట్ల) తో మిగిలిన ధనవంతులకు అందనంత ఎత్తులో గౌతమ్ అదానీ ఉన్నారు. రూపాయి విలువ (డాలర్ మారకంలో) పతనం వలన మిగిలిన ధనవంతల సంపద కొంత తగ్గినప్పటికీ అదానీ సంపద మాత్రం విపరీతంగా పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరుగుతుండడంతో ఆయన సంపద కూడా దూసుకుపోతోంది. ఈ లిస్టులో 88 బిలియన్ డాలర్ల (రూ.7.21 లక్షల కోట్ల) తో రెండో ప్లేస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉన్నారు. దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగిన అంబానీ గౌతమ్ అదానీ దెబ్బకు రెండో ప్లేస్కు పడ్డారు. గౌతమ్ అదానీ సంపదకు, ముకేశ్ అంబానీ సంపదకు మధ్య ఏకంగా 62 బిలియన్ డాలర్ల (రూ. 5.03 లక్షల కోట్ల) తేడా ఉండడాన్ని గమనించాలి. ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచ్లిస్టులోని ధనవంతులందరి సంపద 800 బిలియన్ డాలర్లు (రూ. 65 లక్షల కోట్లు) గా ఉండగా, ఇందులో 30 శాతం వాటా అంబానీ, అదానీల నుంచే ఉంది.
మిగిలిన వారు..
రాధాకిషన్ దమాని (డీమార్ట్ ఓనర్ ), సైరస్ పూనావాలా (సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), శివ్ నాడార్ (హెచ్సీఎల్ టెక్), సావిత్రి జిందాల్ (జిందాల్ గ్రూప్), దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా), హిందుజా బ్రదర్స్ (హిందుజా గ్రూప్), కుమార్ మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్), బజాజ్ ఫ్యామిలీ (బజాజ్ గ్రూప్) లు ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన లిస్టులో టాప్ 10 లో ఉన్నారు. టాప్ 100 మంది రిచ్ లిస్టులో కొత్తగా తొమ్మిది మంది ప్లేస్ సంపాదించారు. ఇందులో ముగ్గురి సంపద వారి కంపెనీలు మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత విపరీతంగా పెరిగింది. ఫాల్గుణి నాయర్ (నైకా– 44 వ స్థానం), రవి మోడీ (వేదాంత్ ఫ్యాషన్స్– 50 వ స్థానం), రఫిక్ మాలిక్ ( మెట్రో బ్రాండ్స్– 89 వ స్థానం).. కొత్తగా ఫోర్బ్స్ టాప్ 100 రిచ్లిస్టులో చేరారు. వీరు ముగ్గురు కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచే రావడం విశేషం. బిజినెస్ వరల్డ్లోని ప్రముఖులు నలుగురు ఈ ఏడాది మరణించారు. బజాజ్ ఫ్యామిలీకు చెందిన రాహుల్ బజాజ్, సీనియర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా, కన్స్ట్రక్షన్ సెక్టార్కు చెందిన పల్లోంజి మిస్త్రీ, ఆయన కొడుకు సైరస్ మిస్త్రీలు ఈ ఏడాది మరణించారు. గతంలో లిస్టులో ఉండి తర్వాత ప్లేస్ కోల్పోయిన నలుగురు ధనవంతులు ఈ ఏడాది తిరిగి ఫోర్బ్స్ టాప్ 100 (ఇండియా) రిచ్లిస్టులోకి వచ్చారు. వీరిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ఈ ఏడాది మంచి పెర్ఫార్మెన్స్ చేయడంతో ఈ రిచ్లిస్టులో ఆయన 91 వ ప్లేస్ను దక్కించుకోగలిగారు.
దానంలో వీళ్లే టాప్
సంపాదించడంలోనే కాదు దానం చేయడంలో కూడా ముందుంటామని టాప్ బిలియనీర్లు చాటి చెబుతున్నారు. హెచ్సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్, అతని ఫ్యామిలీ 2021–22 లో ఏకంగా రూ. 1,161 కోట్లను దానం చేశారు. అంటే రోజుకి రూ. 3 కోట్లు కంటే ఎక్కువ ఆయన దానాలకు ఇచ్చారు. దేశంలోని టాప్ ఫిలాంత్రపిస్ట్ల లిస్టును ఎడెల్గివ్, హురున్ ఇండియాలు కలిసి విడుదల చేశాయి. ఈ సంస్థలు విడుదల చేసిన ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపి లిస్ట్ 2022 లో మరోసారి శివ్ నాడార్ టాప్లో నిలిచారు. ఆయన తర్వాత విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ, ఆయన ఫ్యామిలీ ఉంది. అజిమ్ ప్రేమ్జీ ఈ ఏడాది రూ. 484 కోట్లను దానం చేశారు. ముకేశ్ అంబానీ, ఆయన ఫ్యామిలీ, కుమార్ మంగళం బిర్లా, ఆయన ఫ్యామిలీ, మైండ్ట్రీ కో–ఫౌండర్స్ సుస్మితా, సుబ్రోతో, రాధా, ఎన్ఎస్ పార్థసారధిలు కలిసికట్టుగా తర్వాత ప్లేస్లో ఉన్నారు. మైండ్ట్రీ కో–ఫౌండర్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) కి 2021–22 లో రూ.425 కోట్లు దానం చేశారు. గౌతమ్ అదానీ, ఆయన ఫ్యామిలీ, అనిల్ అగర్వాల్, ఆయన ఫ్యామిలీలు కూడా ఫిలాంత్రపి లిస్టులోని టాప్ 10 లో ఉన్నారు. ఈసారి కొంత మంది ప్రొఫెషనల్ మేనేజర్లు (ఓనర్లు కాకుండా) కూడా భారీగానే దానం చేశారు. వీరిలో ఎల్ అండ్ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏఎం నాయక్ ముందు వరసలో ఉంటారు. అర్చన చంద్ర, అమిత్ చంద్రలు రూ.24 కోట్లు చొప్పున దానం చేశారు.
వ్యక్తిగతంగా దానం చేసినోళ్లు..
కంపెనీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా దానం చేసినవాళ్లలో కూడా శివ్ నాడార్, ఆయన ఫ్యామిలీ టాప్లో ఉంది. వీరు 2021–22 లో రూ. 1,043 కోట్లు దానం చేశారు. నందన్ నిలేకని రూ. 159 కోట్లను ఇవ్వగా, రోహిని నిలేకని రూ. 120 కోట్లను దానం చేశారు. క్వస్ కార్ప్ చైర్మన్ అజిత్ ఐజాక్ రూ.115 కోట్లు దానం చేశారు. బ్రోకరేజి కంపెనీ జెరోధా ఫౌండర్లు నితిన్, నిఖిల్ కామత్లు కలిసి రూ.100 కోట్లను, ఇండిగో రాకేష్ గంగ్వాల్ పర్సనల్గా రూ. 100 కోట్లను దానం చేశారు.