- 12.1 కోట్ల మంది ఇండియన్ రోగుల టెస్టుల ఫొటోలు లీక్
- టాప్లో అమెరికా.. 30.3 కోట్ల ఫొటోలు లీక్
- గ్రీన్బోన్ రిపోర్ట్.. పరిస్థితి దారుణమని వెల్లడి
- ప్రపంచమంతటా 119 కోట్ల రోగుల రిపోర్టుల ఫొటోలు ఆన్లైన్లో
ఒంట్లో కొంచెం నలతగా ఉంది.. హాస్పిటల్కు వెళ్లాం. డాక్టర్ స్కానింగ్ తీయించుకోమన్నాడు. తీయించుకున్నాం. ‘బొమ్మ’లో అంతా బాగానే ఉంది. ఏం లేదు.. హ్యాపీ. పెద్ద యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో చేరగానే ఎక్స్రే తీశారు.కొన్ని చోట్ల ఎముకలు విరిగిపోయాయి. చాలా బాధ.కంట్లో చిన్న ప్రాబ్లం. కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లాం. కంటికి దగ్గరగా ఏదో మెషీన్ పెట్టి చూశాడు డాక్టర్. ఏం కాదులే అన్నాడు.
అన్ని టెస్టులూ మనం హాస్పిటల్ మీద నమ్మకంతో చేయించుకుంటున్నాం. మరి, అలా టెస్టులు చేయించుకున్న డేటా భద్రంగానే ఉందా? అంటే లేనే లేదు అంటోంది జర్మనీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రీన్బోన్. అవును, ఒకటి కాదు.. రెండు కాదు.. 12.1 కోట్ల మంది ఇండియన్ పేషెంట్ల వివరాలు, వారి టెస్టుల ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయని తేల్చింది. పేషెంట్లకు సంబంధించిన సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రే ఫొటోలు ఆన్లైన్లో ‘ఫ్రీ’గా యాక్సెస్కు ఉన్నాయని చెప్పింది. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది. 3,08,451 డేటా చోరీలతో 6 కోట్ల 97 లక్షల 89 వేల 685 మంది రోగుల వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఇక, 1,26,160 డేటా చోరీలతో 59 లక్షల 97 వేల 360 మంది రోగుల వివరాలు ఆన్లైన్లో లీకై తెలంగాణ నాలుగో స్పాట్లో ఉంది. మొత్తంగా దేశమంతటా 10.2 లక్షల డేటా చోరీలు జరిగినట్టు రిపోర్ట్ చెప్పింది.
పీఏసీఎస్ సర్వర్లలోనే ప్రాబ్లమ్
ఈ డేటా లీక్ సమస్యంతా పిక్చర్ ఆర్కైవింగ్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ (పీఏసీఎస్) సర్వర్లలోనే ఉందని గ్రీన్బోన్ తేల్చింది. ఆ సర్వర్లు అంత సేఫ్ కాదని పేర్కొంది. డేటా స్టోర్ చేసిన ఆ సర్వర్లు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండానే ఇంటర్నెట్లో పబ్లిక్కు ఫ్రీగా అందుబాటులో ఉందని తేల్చి చెప్పింది.
నిజానికి దీనిపై నిరుడు అక్టోబర్లోనే గ్రీన్బోన్ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో పేషెంట్ల రికార్డులు, సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రేల ఫొటోలు లీకయ్యాయని చెప్పింది. ఆ తర్వాత నవంబర్లో ఆ డేటా లీక్కు సంబంధించి వివిధ దేశాలకు, గుడ్(మంచి), బ్యాడ్ (బాలే), అగ్లీ (అస్సలు బాలే) కేటగిరీలుగా విభజించి మరో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ తర్వాత దేశాలు చేపట్టిన చర్యలకు తగ్గట్టు ఆ కేటగిరీలు ఇచ్చింది. ఇందులో ఇండియా.. అగ్లీ కేటగరిలో నిలిచింది. ఫస్ట్ రిపోర్ట్ విడుదల చేసిన నాటికి 6.27 లక్షల డేటా చోరీలు జరిగితే, ఇప్పుడు తాజా రిపోర్ట్లో మాత్రం ఆ సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటేసింది. పేషెంట్ల స్కానింగ్ ఫొటోలు అప్పుడు 10.5 కోట్లుగా ఉంటే, ఇప్పుడది 12.1 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 9.04 లక్షల లీకులకు సంబంధించి 11.47 కోట్ల ఫొటోలు నెట్లో ఫ్రీగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. 97 సర్వర్ల నుంచి డేటా లీక్ కాగా, అందులో 20 కొత్త పీఏసీఎస్ సర్వర్లున్నట్టు పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త డేటా ప్రైవసీ బిల్లునూ గ్రీన్బోన్ ప్రస్తావించింది.
లీక్లో అమెరికానే టాప్
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 119 కోట్ల మంది రోగుల వివరాలు ఆన్లైన్లో లీకైనట్టు రిపోర్ట్ పేర్కొంది. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే రోగుల డేటా లీక్ 60 శాతం పెరిగిందని చెప్పింది. అక్టోబర్లో 73.7 కోట్ల మంది పేషెంట్ల డేటా ఆన్లైన్లో లీకైతే ఇప్పుడు అది చాలా ఎక్కువ పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించింది. దాదాపు 3.5 కోట్ల డేటా లీకులు జరిగాయని చెప్పింది. అక్టోబర్లో డేటా లీకుల సంఖ్య 2.45 కోట్లు. ఇప్పుడది 40% పెరిగింది. ఇక, పేషెంట్ల డేటా లీక్లో అమెరికా టాప్లో ఉంది. 1.37 కోట్ల డేటా లీకులతో 30.3 కోట్ల మంది పేషెంట్ల వివరాలు ఆన్లైన్లో ఉన్నట్టు తేల్చింది. అందులో 4.58 కోట్ల మంది వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని వివరించింది.