మెదక్, కొల్చారం, వెలుగు: ఘనపూర్ ఆనకట్ట (వనదుర్గా ప్రాజెక్ట్) ఎత్తు పెంపుతో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆఫీసర్లు ప్రపోజల్పంపిన నాలుగేండ్ల దాకా ప్రభుత్వం ఫండ్స్ఊసే ఎత్తలేదు. ఎట్టకేలకు నిరుడు ఫండ్స్ మంజూరు చేస్తున్నట్లు జీవో ఇచ్చినా.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు. కలెక్టర్ అకౌంట్కు అమౌంట్ రాకపోవడంతో బాధిత రైతులకు పరిహారం అందడం లేదు. ఈ విషయమై ఆర్థిక శాఖ మంత్రి హారీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునితారెడ్డిని కలిసినా లాభం ఉండడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.
318 ఎకరాల ముంపు
జిల్లాలో ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ఘనపూర్ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 0.135 టీఎంసీలకు తగ్గింది. ఆయకట్టు భూముల సాగుకు ఇబ్బంది కలుగుతుండటంతో ఆనకట్ట ఎత్తును 1.725 మీటర్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2015లో ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు గాను రూ.43.64 కోట్లు మంజూరు చేసింది. ఇందులోభాగంగా ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి, శేరిపల్లి, కొడపాక, గాజులగూడెం పరిధిలో 271 మంది రైతులకు చెందిన 256 ఎకరాలు, కొల్చారం మండలం చిన్నఘనపూర్, సంగాయిపేటలో 95 మంది రైతులకు చెందిన 62.26 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించారు.
ఫండ్స్ రాక జాప్యం...
ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు రూ.13 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం రూ.5 కోట్లు మాత్రమే మంజూరు చేయడంతో కొందరికి మాత్రమే పరిహారం అందింది. మరో రూ.8 కోట్లు మంజూరు చేయకపోవడంతో భూసేకరణ ప్రక్రియ కూడా పెండింగ్లో పడింది. 2019లో ప్రభుత్వానికి మరోసారి ప్రపోజల్ పంపగా గతేడాది మార్చిలో రూ.8.10 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మిగతా రైతులు కూడా తమకు పరిహారం అందుతుందని ఆశించారు. కానీ, ఏడాది గడిచినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ రావడం లేదు.
తిరిగి తిరిగి యాష్టకొస్తంది
ఆనకట్ట ఎత్తు పెంచుతుండడంతో 6 .20 ఎకరాల పొలం ముంపునకు గురవుతుంది. పరిహారం కోసం నర్సాపూర్ ఎమ్మెల్యేను పదిసార్లు, మంత్రి హారీశ్రావును రెండుసార్లు, మాజీ మంత్రి సునితారెడ్డిని మూడునాలుగు సార్లు కలిసినం. మొన్నకూడా మంత్రిని కలిస్తే వారం పది రోజుల్లో పైసలు పడ్తయని చెప్పిన్రు. నెల గడుస్తున్నా పైసలు మాత్రం రాలే. తిరిగి తిరిగి యాష్టకోస్తుంది.
- పంతులు సంగమేశ్వర్, రైతు, చిన్నఘనపూర్
12 గుంటలు పోతుంది
చిన్నఘనపూర్ శివారులో నాకు ఐదెకరాల భూమి ఉంది. ఆనకట్ట ఎత్తు పెంచుతుండడంతో 12 గుంటలు పోతుంది. అయితే సర్వేచేసి ఏండ్లు గడుస్తున్నయి. కానీ, నాకు పరిహారం పైసలు మాత్రం రాలే. మొన్న ఫిబ్రవరి నెలల రైతులందరం మంత్రి హరీశ్ రావును కలిసినం. మార్చి ఐదో తారీఖున ఫండ్స్రిలీజ్ చేస్తామని చెప్రిన్రు. కానీ ఇంకా పైసలు రాలేదు.
- శ్రీనివాస్ చారి, రైతు, చిన్నఘనపూర్
ఆర్డీవో అకౌంట్లో అమౌంట్ పడలేదు
ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపును గురువుతన్న భూములను సర్వే చేసి పైఅధికారులకు రిపోర్ట్ పంపించినం. పరిహారం విషయంలో రైతులతో సమావేశం కూడా పెట్టినం. ఆర్డీవో అకౌంట్లో ఇంకా అమౌంట్ జమ కాలేదు. అందుకే చెక్కులు పంపిణీ చేయలేదు. కాగానే సంబంధిత రైతులకు సమాచారం ఇస్తం.
- చంద్రశేఖర్ రావు, కొల్చారం తహసీల్దార్