
- 105 మందితో ఫస్ట్ లిస్ట్
- 101 మంది సిట్టింగ్లు,
- నలుగురు కొత్తవాళ్లకు టికెట్లు
- ఫస్ట్ లిస్ట్లో లేని మేయర్ బొంతు రామ్మోహన్ పేరు
హైదరాబాద్ ,వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ ఎస్ తరఫున పోటీ చేసే 105 మంది క్యాండిడేట్లతో ఫస్ట్ లిస్ట్ ను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో సిటీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు లేదు. ఆయన గెలిచిన చర్లపల్లి డివిజన్ ను పెండింగ్లో పెట్టారు. రామ్మోహన్ కు వచ్చే ఏడాది జరగనున్న హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చర్లపల్లి డివిజన్ టికెట్ తన భార్య బొంతు శ్రీదేవి యాదవ్ కు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను ఇటీవల మేయర్ కోరారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఓ డివిజన్ నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి కొడుకు లేదా ఆయన దగ్గరి చుట్టం పోటీ చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొన్ని డివిజన్లకు క్యాండిడేట్లను ప్రకటించలేదు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా ఓ డివిజన్ నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు పోటీ చేసే అవకాశం ఉన్నందున అక్కడ కొన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంబర్ పేట, ఉప్పల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, సనత్ నగర్, కూకట్ పల్లి తో పాటు పలు నియోజకవర్గాల్లో డివిజన్లకు క్యాండిడేట్లను ప్రకటించ లేదు.
కొత్త క్యాండిడేట్లు నలుగురు
నాలుగు డివిజన్లలో మాత్రమే అభ్యర్థులను మార్చింది. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్ మరణించగా అక్కడ ఉప్పలపాటి శ్రీకాంత్ కు టికెట్ ఇచ్చారు. బాలాజీనగర్ కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి బీజేపీలో చేరగా అక్కడ శిరీష బాపూరావుకు టికెట్ ఇచ్చారు. సోమాజిగూడ కార్పొరేటర్ అత్తలూరి విజయ లక్ష్మి పోటీ చేయనని చెప్పడంతో ఆ ప్లేస్లో సంగీతా యాదవ్ కు టికెట్ ఇచ్చారు. రామచంద్రపురం డివిజన్ నుంచి సిట్టింగ్ తోట అంజయ్య ఉండగా ఆయన ప్లేస్లో పుష్ప నగేష్ యాదవ్కు చాన్స్ దక్కింది.
ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలకు టికెట్ రాలే
అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భార్య కాలేరు పద్మ , ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య బేతి స్వప్న రెడ్డిలు సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే పెండింగ్పెట్టిన వాటిలో ఈ రెండు డివిజన్లు కూడా ఉన్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు కూడా టికెట్ రాలేదు.
అంబర్ పేట నియోజకవర్గం మొత్తం పెండింగ్
అంబర్ పేట నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు పెండింగ్ లో పెట్టారు. అసెంబ్లీ ఎలక్షన్ టైమ్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు టికెట్ ఇవ్వడం ఇష్టం లేక కార్పొరేటర్లు ఎవరూ ఆయనకు సహకరించలేదు. దీంతోనే ఇప్పుడు ఎమ్మెల్యే ఒక్కరికి కూడా టికెట్ రాకుండా అడ్డుకున్నారని చర్చ జరుగుతోంది.
క్యాస్ట్ ల వారీగా అభ్యర్థులు
ఓసీలు -24, బీసీలు 55 , ఎస్టీలు 3,
ఎస్సీలు -6 , మైనారిటీలు 16
సీపీఎం, సీపీఐ కలిసి 30 స్థానాల్లో పోటీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి లెఫ్ట్ పార్టీలు రెడీ అవుతున్నాయి. కిందటిసారి హైదరాబాద్ వన్ పేరుతో సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా కలిసి పోటీ చేయగా.. ఈసారి సీపీఎం, సీపీఐ ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. పార్టీ, ప్రజాసంఘాలు బలంగా ఉన్న చోట్లనే పోటీ చేస్తున్నట్టు చెప్పాయి. ఈ లెక్కన మొత్తం 150 డివిజన్లలో 30 స్థానాల్లోనే బరిలో నిలిచే చాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒక్కోపార్టీ15 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బుధవారం రెండు పార్టీలు 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశాయి.