- ఎక్కడ చూసినా ఫుల్ ఆక్యుపెన్సీ
- జాబ్ నోటిఫికేషన్లతో పెరిగిన రష్
హైదరాబాద్, వెలుగు: పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే తగిన వాతావరణం ఉండాలి. హాస్టళ్లలో, ఫ్రెండ్స్ తో కలిసి రూమ్లలో ఉంటూ చదువుకోవాలంటే చాలా కష్టం. అన్నిరకాల సదుపాయాలు ఉన్నప్పుడే పుస్తకాల మీద ఫోకస్ పెట్టగలం. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని సిటీలో వందల సంఖ్యలో రీడింగ్హాల్స్, స్టడీ రూమ్స్ఏర్పాటు అవుతున్నాయి. ప్రస్తుతం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు పడుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. అభ్యర్థుల రష్ పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని పుట్టుకొస్తున్నాయి. మునుపటితో పోలిస్తే రెండింతల మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అటు కోచింగ్ సెంటర్లకు, ప్రైవేట్ హాస్టళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది.
వెయ్యికి పైగా రీడింగ్ హాల్స్
సిటీలో వెయ్యికి పైగా రీడింగ్ రూమ్లు, హాళ్లు ఉన్నాయి. ఒక్కోచోట 50 మంది నుంచి 500 మంది వరకు చదువుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా డెస్క్లు, వైఫై, మంచినీరు, రెస్ట్రూమ్లు, పర్సనల్ మీటింగ్ రూమ్లు ఉంటున్నాయి. అభ్యర్థుల డిమాండ్ను బట్టి కొన్నిచోట్ల కంప్యూటర్ సదుపాయం కూడా ఉంది. నిర్వాహకులు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు అందిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంటుండడగా, కొన్ని ఏరియాల్లో 24 గంటలు తెరిచే ఉంచుతున్నారు. రీడింగ్ రూమ్లలో చేరాలనుకునేవారికి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీకి ఒక్కోవిధంగా ఛార్జ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ల నేపథ్యంలో ఇప్పటికే సిటీలోని కోచింగ్ సెంటర్లు, అకాడమీలు అభ్యర్థులతో నిండిపోయాయి. వీటితోపాటు రీడింగ్ రూమ్ లు కిటకిటలాడుతున్నాయి. సివిల్స్, నీట్ కి ప్రిపేర్ అయ్యేవారితోపాటు ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్ పరీక్షల కోసం అభ్యర్థులు ఎక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఫుల్లుగా ఉన్నారు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత రీడింగ్ రూమ్ ప్రారంభించాను. 50 మంది చదువుకునేలా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. వైఫై, సెపరేట్ డెస్క్ సదుపాయం ఇస్తున్నాం. వరుస నోటిఫికేషన్లతో డిమాండ్ ఎక్కువగా ఉంది.
- సందీప్, రీడింగ్రూమ్నిర్వాహకుడు, షేక్పేట
నచ్చినంతసేపు చదువుకుంటా
ఫ్రెండ్స్తో కలిసి రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నా. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. రూమ్లో ఉండి చదువుకోవాంటే ఇబ్బందిగా ఉంటోంది. అందుకే డైలీ రీడింగ్ రూమ్కి వెళ్తున్నాను. ఉదయం 7 గంటలకు వెళ్లి నచ్చినంత సేపు చదువుకుని వస్తున్నా. అక్కడ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏకాగ్రతతో చదువుకునే వాతావరణం ఉంటుంది. ఇతర అభ్యర్థులతో డిస్కస్ చేసుకునేందుకు వీలుంటుంది.
– మహేశ్, క్యాండిడేట్, షేక్పేట
24 గంటలూ తెరిచి ఉంచుతున్నం
ఐదేండ్ల కిందట రీడింగ్ రూమ్ అండ్ లైబ్రరీ మొదలుపెట్టాం. రెండు ఫ్లోర్లలో 300 నుంచి 450 మంది వరకు చదువుకునేలా ఏర్పాట్లు చేశాం. 24 గంటలూ ఓపెన్ చేసి ఉంటుంది. వాటర్, వైఫై, రెస్ట్ రూమ్ సదుపాయాలు ఉన్నాయి. అభ్యర్థులకు కావాలంటే ల్యాప్టాప్లు ప్రొవైడ్ చేస్తున్నాం. స్టూడెంట్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని కేటగిరీల వారు వస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లు పడిన తర్వాత డిమాండ్ పెరిగింది.
- అఫ్తాబ్, రీడింగ్ రూమ్, లైబ్రరీ నిర్వాహకుడు, మాదాపూర్