
న్యూఢిల్లీ : దేశంలోని మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లకు కొత్త ట్రోజాన్ వైరస్ ముప్పు వచ్చి పడింది. ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడే ఈ వైరస్ను అన్ ఇన్స్టాల్ చేయడం కష్టతరమని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. జులై నెలలో మొదటిసారిగా ఈ సోవా వైరస్ మన దేశంలో కనిపించిందని, ఇప్పుడు అయిదో వెర్షన్కు అప్గ్రేడ్ అయిందని తెలిపింది. ఈ వైరస్పై సెర్ట్కు రిపోర్టు చేశారు కూడా. యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ను తెలుసుకునే శక్తి ఈ సోవా వైరస్కు ఉందని, కీ లాగింగ్, స్టీలింగ్ కుకీస్, ఫాల్స్ ఓవర్లేస్ వంటి టెక్నిక్స్తో ఈ వైరస్ మన డేటా దోచుకుంటోందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. సెప్టెంబర్ 2021 నుంచి అండర్ గ్రౌండ్ మార్కెట్లలో ఈ సోవా వైరస్ను అమ్ముతున్నట్లు పేర్కొంది. గతంలో యూఎస్, రష్యా, స్పెయిన్ వంటి దేశాలపైనే ఈ సోవా వైరస్ ఫోకస్ ఉండేదని, కానీ జులై 2022 నుంచి మన దేశంలోని మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లపైనా గురి పెట్టారని వివరించింది. ఫేక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో సోవా వైరస్ దాక్కుంటుంది. క్రోమ్, అమెజాన్, ఎన్ఎఫ్టీ వంటి ఫేమస్ అప్లికేషన్ల తరహాలోనే ఈ సోవా వైరస్ లోగో ఉంటుందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. యూజర్లను ఇన్స్టలేషన్కు ప్రేరేపించడం కోసమే ఫేమస్ అప్లికేషన్ల మాదిరిగా లోగోను వైరస్కు వాడుతున్నట్లు హెచ్చరించింది. బ్యాంక్ అకౌంట్లను చూసుకోవడానికి కస్టమర్లు నెట్ బ్యాంకింగ్లోకి లాగ్ ఇన్ అయినప్పుడు ఆ డేటాను ఈ మాల్వేర్ దొంగిలిస్తుంది. మొత్తం 200 మొబైల్ అప్లికేషన్స్ను సోవా వైరస్ టార్గెట్ చేసినట్లు సమాచారం ఉంది. బ్యాంకింగ్ యాప్స్తోపాటు, క్రిప్టో ఎక్స్చేంజీలు, వాలెట్లను సైతం ఈ వైరస్ వదిలి పెట్టడం లేదు. ఈ హెచ్చరికలను దేశంలో సైబర్ ఎటాక్స్ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) జారీ చేసింది. ఇంటర్నెట్ ఫిషింగ్, హ్యాకింగ్ ప్రయత్నాలను, ఇతర ఆన్లైన్ అటాక్స్ నుంచి దేశంలోని ప్రజలను రక్షించేందుకు సెర్ట్ ప్రయత్నిస్తోంది.
ఎస్ఎంఎస్ (స్మిషింగ్) ద్వారానే ఈ మాల్వేర్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్లు గుర్తించారు. చాలా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్లు ఈ తరహాలోనే డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్లు సమాచారం. ఈ ట్రోజాన్ వైరస్ ఒకసారి ఆండ్రాయిడ్ అప్లికేషన్లోకి చొరబడిన తర్వాత ఆ ఫోన్లోని అన్ని అప్లికేషన్ల వివరాలనూ సీ2 (కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్)కి అంటే మోసగాళ్లకు పంపిస్తుంది. సోవా వైరస్ను కొంత మంది మోసగాళ్లు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నట్లు కూడా సెర్ట్ చెబుతోంది. సోవా వైరస్ చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తున్న నేపథ్యంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పేర్కొంటోంది. యూజర్లు ఈ సోవా వైరస్ మాల్వేర్ యాప్ను గుర్తించి, అన్ ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ విషయం వెంటనే హోమ్ స్క్రీన్కి తీసుకెళ్లిపోతుందని, తద్వారా యూజర్ల ప్రయత్నాలను అడ్డుకుంటుందని వివరించింది.