
- సొంత శాఖలకు పంపేందుకు నిర్ణయం
- డిప్యూటేషన్ పై ఉన్న 17 మంది ఆఫీసర్లు
- ఒకరిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోని అసిస్టెంట్మెడికల్ అండ్ హెల్త్ఆఫీఫర్ (ఏఎంఓహెచ్)లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలకు పాల్పడుతున్నట్లు కొందరిపైన ఫిర్యాదులు అందగా, అప్పట్లోనే విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడగా అవినీతి ఆరోపణలు వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడంలేదని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే బల్దియాలోని ఏఎంఓహెచ్ లకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటుందా? లేదా సొంత డిపార్టుమెంట్ కి పంపుతుందా..? అనేది చూడాల్సి ఉంది.
ఇప్పటికే పక్రియ కూడా మొదలైంది. శేరిలింగంపల్లి జోన్ లో ఓ మెడికల్ ఆఫీసర్ ని సొంత డిపార్టు మెంట్ కు పంపుతూ నాలుగు రోజుల కిందట కమిషనర్ ఆర్డర్ రిలీజ్ చేశారు. కానీ ఆ ఉత్తర్వులు పెండింగ్ లో పెట్టినట్లు, దీని వెనకాల ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా..! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి త్వరలో ఏఎంఓహెచ్ లపై ఏదో ఒక నిర్ణయమైతే ప్రభుత్వం తీసుకోనుంది.
కొంతమందిపై అవినీతి ఆరోపణలు
బల్దియాలో ప్రస్తుతం 17 మంది ఏఎంఓహెచ్ లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చి పని చేస్తున్నారు. వీరిలో కొందరు ఏండ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. పలువురు మెడికల్ఆఫీసర్లకు సంబంధించి ఎస్ఎఫ్ఏల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ జారీకి ఒకరిద్దరు మెడికల్ ఆఫీసర్లు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ మెడికల్ ఆఫీసర్ తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, సంబంధిత ఆధారాలతో కిందిస్థాయి సిబ్బంది ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్లాస్టిక్ కవర్ల నుంచి మొదలు పెడితే హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ ఇలా ఎక్కడ కూడా వదలకుండా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. శేరిలింగంపల్లి జోన్ లో అయితే ఏకంగా నోటీసులు జారీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా కొంతమందిపై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇలాంటి వారిని ముందుగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్టుమెంట్కు పంపితే కాస్త అవినీతిని అరికట్టవచ్చని జనం అంటున్నారు.
డిప్యూటేషన్ పై వచ్చి..
బల్దియాలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్నుంచి డిప్యూటేషన్ వస్తున్నారు. వారు తిరిగి వెళ్లేందుకు మాతృసంస్థకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపడంలేదు. రూల్ ప్రకారం డిప్యూటేషన్ పై వచ్చిన వారు 3 ఏండ్ల వరకు పనిచేయాల్సి ఉంది. అవసరమైతే మరో రెండేండ్లు చేసి తిరిగి పేరెంట్ డిపార్ట్ మెంట్ కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలాంటి రూల్స్ తమకి ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ భారీగా అక్రమ సంపాదన ఉండడంతోనే వెళ్లడం లేదని తెలుస్తుంది.
మెడికల్ ఆఫీసర్లు ఏ పని చేసినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపించారు. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు, దీనిపై గతంలోనే కొందరు సిబ్బంది నేరుగా కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు. బల్దియా పరిధి లో 30 సర్కిల్స్ ఉండగా ప్రస్తుతం 17 మంది మెడికల్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో మూడేండ్లకు మించి పని చేస్తున్న అధికారులు ఎక్కువగానే ఉన్నారు.