ఇకపై గ్రౌండ్​వాటర్​కూ సెస్​!

ఇకపై గ్రౌండ్​వాటర్​కూ సెస్​!
  • భూమిలోంచి తోడే ప్రతి లీటర్​ వాటర్​కూ లెక్క చెప్పాల్సిందే 
  • బోర్లకు స్మార్ట్​ మీటర్లు పెట్టాల్సిందే
  • ఇండస్ట్రీస్​, అపార్ట్​మెంట్స్​, మినరల్​ వాటర్​ ప్లాంట్స్​, బల్క్​ వాటర్​ సప్లయర్స్​పై కొరడా
  • ఇప్పటికే పలు జిల్లాల్లో నోటీసులిస్తున్న ఆఫీసర్లు
  • క్రమంగా అన్ని ఇండ్లకూ వర్తింపజేసే ఆలోచన
  • తెలంగాణ స్టేట్​ గ్రౌండ్​ వాటర్​ ఎక్స్​ట్రాక్షన్​ రూల్స్​ –2023 రెడీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తామంటే ఇకపై కుదరదు. ‘తెలంగాణ స్టేట్​ గ్రౌండ్​వాటర్​ ఎక్స్​ట్రాక్షన్​ రూల్స్–2023’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధనలతో గ్రౌండ్​వాటర్​ విచ్చలవిడి వినియోగానికి చెక్​ పడనుంది.  కొత్త రూల్స్​ ప్రకారం.. బోర్లకు స్మార్ట్​ మీటర్లు పెట్టి, రోజుకు వెయ్యి లీటర్లు మించితే స్లాబులవారీగా ఫీజులు గుంజుతారు. దశల వారీగా ఇండస్ట్రీస్, అపార్ట్​మెంట్స్​, హౌసింగ్​ సొసైటీలు, బల్క్​వాటర్​ సప్లయర్స్, ప్యాకేజ్డ్​ డ్రింకింగ్​ వాటర్​ సప్లయర్స్, వాటర్ ​ట్యాంకర్స్ ​యాజమానుల నుంచి వాటర్​సెస్ వసూలు చేయనున్నారు. మొదట పలు పరిశ్రమల్లో ఈ  నెల నుంచే అమలు చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు  నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. గ్రౌండ్​వాటర్ ​కంట్రోల్​ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సర్కారు చెప్తుండగా,  భగీరథ వాటర్​ ఫ్రీగా ఇస్తున్న సర్కారు, ఆ లోటును పూడ్చుకునేందుకు వాటర్​సెస్​ను తెరపైకి తెస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

జీవో 15లో మార్గదర్శకాలు

బోర్ల ద్వారా నీళ్లను ఇష్టమున్నట్టు వాడుకోకుండా సర్కారు ఇటీవల జీవో నెంబర్​ 15 ద్వారా మార్గదర్శకాలను రిలీజ్​ చేసింది. అయితే, ఆదాయం పెంచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవోను ఒక్కసారే అమలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదని భావించిన ప్రభుత్వం దశల వారీగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఇందులో భాగంగా మొదట ASఅండర్​గ్రౌండ్​వాటర్​ఉపయోగించే పరిశ్రమలపై దృష్టి సారించారు. సింగరేణి, ఐటీసీ, గ్రానైట్స్​తో పాటు ఇతరత్రా భారీ పరిశ్రమల నుంచి వాటర్​ సెస్​ వసూలు చేసేందుకు ఇప్పటికే ఆఫీసర్లు నోటీసులు పంపించినట్టు సమాచారం. 

ఇవీ రూల్స్ 

గ్రౌండ్​ వాటర్​ఎక్స్​ట్రాక్షన్​ రూల్స్​లో భాగంగా బోర్ల ద్వారా వచ్చే భూగర్భ జలాలను కొలిచేందుకు టెలిమెట్రీ ట్యాంపర్​ ప్రూఫ్​ డిజిటల్ ​వాటర్​ ఫ్లో మీటర్లను ఏర్పాటు చేస్తారు. వీటికి స్మార్ట్​ మీటర్లను కూడా బిగిస్తారు. జీవో ప్రకారం 25 క్యూబిక్ ​మీటర్ల (క్యూబిక్​ మీటర్​వెయ్యి లీటర్లు) వరకు ఫ్రీగా వినియోగించుకోవచ్చు. రెసిడెన్షియల్​అపార్ట్​మెంట్లు, హౌసింగ్​సొసైటీలైతే 26 నుంచి 50 క్యూబిక్​ మీటర్ల వరకు లీటర్​కు రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. 50 క్యూబిక్​ మీటర్లు దాటితే లీటర్​కు రూ. 2 కట్టాలి. ప్యాకెజ్డ్ ​డ్రింకింగ్ ​వాటర్​యూనిట్లకైతే 50 క్యూబిక్​ మీటర్ల వరకు రూపాయి చొప్పున, అంతకంటే ఎక్కువ దాటితే వాడే నీటిని బట్టి రూ.10వరకు వసూలు చేస్తారు. 

అండర్ ​గ్రౌండ్​వాటర్​ లభ్యతను బట్టి చార్జీలను రూ. 2 నుంచి రూ. 60 వరకు తీసుకుంటారు. ఇందులో సెమీక్రిటికల్, క్రిటికల్ ​డ్రింకింగ్ ​వాటర్​యూనిట్ల వారీగా బోర్లు వాడే ప్రాంతాలను అధికారులు విభజించనున్నారు. ట్యాంకర్ల ద్వారా అండర్ గ్రౌండ్​వాటర్​ సప్లయ్​ చేసే వారి దగ్గరి నుంచి ట్యాంకర్ల కెపాసిటీని బట్టి లీటర్​కు రూ.10, రూ. 20, రూ. 25చొప్పున తీసుకోనున్నారు. ప్రతి రోజు వంద క్యూబిక్ ​మీటర్ల కంటే ఎక్కువ వినియోగించుకునే పరిశ్రమలు..గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ప్రతి ఏడాది వాటర్ ​ఆడిట్ ​నిర్వహించి నివేదికలను భూగర్భజల శాఖకు అందజేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చెల్లించే సెస్​లో మార్పులు చేర్పులుంటాయి.  ప్రతి మూడు నుంచి ఐదేండ్ల కోసారి ఎన్వోసీ రెన్యూవల్​ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఓవర్​ ఎక్స్​ట్రాక్షన్​ జోన్​లో ఉన్న వారు ప్రతి రెండేండ్లకోసారి ఎన్​ఓసీని రెన్యూవల్​ చేయించుకోవాలి. 

సింగరేణి కాలనీలకు నీటి కోత తప్పదా

సింగరేణి తమ అవసరాలకు ప్రధానంగా గ్రౌండ్​వాటర్​పై ఆధారపడి ఉంది. కోల్​ మైన్స్​తో పాటు సింగరేణి కార్మిక వాడల్లో ఇప్పటి వరకు మైనింగ్​ తవ్వకాలు, బోర్ల ద్వారా వచ్చే నీటినే వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి చార్జీలు లేకపోవడంతో కోల్​బెల్ట్​ వ్యాప్తంగా సింగరేణి కార్మిక వాడల్లో కొన్ని చోట్ల ఉదయం, సాయంత్రం, మరి కొన్ని చోట్ల ప్రతి రోజు సింగరేణి నీటిని సప్లై చేస్తోంది. ఇక నుంచి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండడంతో నీటిని పొదుపుగా వాడుకోవాల్సి ఉన్నందున, కాలనీలకు వాటర్​ సప్లైలో కొంత మేర కోత విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలకు మున్సిపాలిటీ వాటర్ ​సప్లై సరిగ్గా లేదు. దీంతో వీరంతా సింగరేణి సరఫరాచేసే నీటి పైనే ఆధారపడుతున్నారు. వాటర్​ సెస్​ పుణ్యమా అని ఇక నుంచి సింగరేణి వాసులకు కష్టాలు తప్పకపోవచ్చు.  

వాటర్​ప్లాంట్ల యజమానులు, అపార్ట్​మెంట్ల వాసుల ఆందోళన

ప్యాకెజ్డ్​ డ్రింకింగ్​ వాటర్​ ప్లాంట్ల నుంచి వాటర్​సెస్​ వసూలు చేసే నిర్ణయంపై వాటర్​ప్లాంట్ల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు లేక జీవనోపాధి కోసం వాటర్​ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని బతుకుతుంటే చార్జీలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్​ హైదరాబాద్​తో పాటు వరంగల్​, కరీంనగర్​, ఖమ్మం లాంటి నగరాలతో పాటు పట్టణాల్లో కూడా అపార్ట్ మెంట్​ కల్చర్​పెరిగింది. వీరు కూడా వాటర్​సెస్ ​చెల్లించాల్సి ఉంటుంది. బోర్​వేసుకునేందుకు అధికారికంగా పర్మిషన్​ తీసుకున్నామని, ఇప్పుడేమో కొత్తగా వాటర్​సెస్​ అంటూ చార్జీలను వసూలు చేయడం అన్యామమని వీరు వాపోతున్నారు.