న్యూఢిల్లీ వరసగా ఏడో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు అదరగొట్టాయి. సెప్టెంబరు నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ. 1.40 లక్షల కోట్ల మార్కుకు పైనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్లకు చేరినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. పండగల సీజన్ కావడంతో రాబోయే నెలల్లో ఈ వసూళ్లు మరింతగా పెరుగుతాయని ఎక్స్పర్టులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 2022 నెల వసూళ్లు రూ. 1,47,686 కోట్లయితే, ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 25,271 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 80,464 కోట్లు, సెస్ రూ. 10,137 కోట్లని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. దిగుమతులపై వచ్చిన జీఎస్టీ రూ. 41,215 కోట్లని పేర్కొంది.
ఏప్రిల్ 2022లో జీఎస్టీ వసూళ్లు రికార్డు లెవెల్లో రూ. 1.67 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 2022లో ఈ వసూళ్లు రూ. 1.43 లక్షల కోట్లు. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు అంతకు ముందు ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 26 శాతం అధికమయ్యాయి. దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 39 శాతం పెరగ్గా, దేశీయ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరిగినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా చెబుతోంది. సెప్టెంబర్ నెలదాకా ఆరు నెలలకు కలిపి చూస్తే జీఎస్టీ వసూళ్లు 27 శాతం పెరిగాయి. ఎకానమి జోరు కొనసాగడం వల్లే జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయనేది దీంతో స్పష్టమవుతుందని ఎక్స్పర్టులు పేర్కొంటున్నారు. ఆగస్టు 2022లో 7.7 కోట్ల వే బిల్లులు జనరేట్ అయ్యాయి. అంతకు ముందు నెల అంటే జులై 2022లో 7.5 కోట్ల వే బిల్లులు జనరేట్ అయ్యాయని డేటా పేర్కొంటోంది.
సెప్టెంబర్ 20 నాడు (ఒకే రోజు) జీఎస్టీ కలెక్షన్లు రూ. 49,453 కోట్లు. అదే రోజున ఏకంగా 8.77 లక్షల చలాన్లు ఫైలయ్యాయని, ఇది జులై నెలలోని ఒకే రోజు వసూళ్ల కంటే కొద్దిగానే తక్కువని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ ఏడాది జులై నెలలో ఒకే రోజున 9.58 లక్షల చలాన్లు ఫైలవగా, ఆ రోజు జీఎస్టీ కలెక్షన్లు ఏకంగా రూ. 57,846 కోట్లు. జీఎస్టీఎన్ మెయింటెయిన్ చేస్తున్న జీఎస్టీ పోర్టల్ పనితీరు కూడా బాగా మెరుగుపడిందనడానికి ఈ అంకెలు నిదర్శనంగా నిలుస్తాయని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది.