
- రెండింతలు పెరిగిన లోన్ బకాయిలు
- బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన లోన్లు జూమ్
- ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలోని కుటుంబాలు (హౌస్హోల్డ్స్) చేస్తున్న సేవింగ్స్ 2022–23 లో ఏకంగా 47 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి పెరుగుతోందని చాలా మంది ఎకనామిస్ట్లు చెబుతున్నారు. దీనిపై ఫైనాన్స్ మినిస్ట్రీ స్పందించింది. కుటుంబాలు తమ సేవింగ్స్ను ఇండ్లు, బండ్లు వంటి ఇతర అసెట్స్ల కోసం ఖర్చు చేస్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు, వెహికల్ లోన్లు భారీగా పెరిగాయని తెలిపింది. కాగా, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం, 2022–23 లో కుటుంబాల నెట్ సేవింగ్స్ జీడీపీలో 5.1 శాతానికి తగ్గాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 7.1 శాతంగా రికార్డయ్యింది. ఇదే టైమ్లో కుటుంబాల లోన్ల బకాయిలు జీడీపీలో 3.8 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగాయి. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, కుటుంబాల లోన్ బకాయిలు 2021 తో పోలిస్తే రెండింతలు పెరిగి 2022–-23 లో రూ. 15.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాగా, ఫిజికల్ (భూములు, గోల్డ్ వంటివి), ఫైనాన్షియల్ (షేర్లు, డిపాజిట్లు వంటివి), జ్యువెలరీ (గోల్డ్, సిల్వర్ నగలు వంటివి) లలోని ప్రజల ఇన్వెస్ట్మెంట్లను సేవింగ్స్గా చెప్పొచ్చు. కంపెనీలకు క్యాపిటల్ ఫండ్స్ అందడంలో ఇవి సాయపడతాయి. ఎకానమీ గ్రోత్లో హౌస్హోల్డ్స్ సేవింగ్స్ చాలా ముఖ్యం.
ఎకానమీ స్ట్రాంగ్గానే ఉంది..
సేవింగ్స్ తగ్గిపోవడం వలన ఎకానమీపై ఎటువంటి ఒత్తిడి లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. ‘హౌస్హోల్డ్స్ సేవింగ్స్, ఎకానమీలో వీటి ప్రభావం పై ఈ మధ్య ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ప్రజలు ఇతర అసెట్లలో ఇన్వెస్ట్ చేయడం వలన సేవింగ్స్ తగ్గిపోయాయి. ఎకానమీలో ఎటువంటి ఒత్తిడి లేదు’ అని ట్విట్టర్లో పేర్కొంది. దేశంలోని కుటుంబాలు 2020–21 లో నికరంగా రూ. 22.8 కోట్ల విలువైన ఫైనాన్షియల్ అసెట్స్ (షేర్లు, డిపాజిట్లు, ఇన్సూరెన్స్లు వంటివి) ను కొనుగోలు చేశారని, 2021–22 లో రూ.17 లక్షల కోట్లను, 2022–23 లో రూ.13.8 లక్షల కోట్లను తమ పోర్టుఫోలియోకి యాడ్ చేసుకున్నారని వెల్లడించింది. ఇవి ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తగ్గినా, ఓవరాల్గా గ్రోత్ బాటలోనే ఉన్నామని తెలిపింది. మెజార్టీ కుటుంబాలు లోన్లు తీసుకొని ఇండ్లు కొంటున్నారని, అందుకే వీటి లోన్ బకాయిలు పెరిగాయని, అదే టైమ్లో ఫైనాన్షియల్ అసెట్స్లో కుటుంబాల ఇన్వెస్ట్మెంట్లు తగ్గాయని వివరించింది. ‘ఆర్బీఐ డేటా చూస్తే బ్యాంకులు ఇచ్చిన పర్సనల్ లోన్లు భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. వీటిలో హోమ్ లోన్లు, వెహికల్ లోన్ల వాటా ఎక్కువగా ఉంది. ఈ రెండూ కూడా సెక్యూర్డ్ లోన్లు. బ్యాంకింగ్ సెక్టార్ ఇచ్చిన మొత్తం పర్సనల్ లోన్లలో వీటి వాటా 62 శాతంగా ఉంది. మిగిలిన వాటా క్రెడిట్ కార్డ్ లోన్లు, ఇతర పర్సనల్ లోన్లది ఉంది’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ‘2021 నుంచి బ్యాంకులు ఇస్తున్న హోమ్ లోన్లు రెండంకెల గ్రోత్ నమోదు చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ అసెట్స్ కొనడానికి అప్పులు చేస్తున్నారు. వెహికల్ లోన్లు కూడా 2022 ఏప్రిల్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తున్నాయి. తనఖాలపైన హోమ్లోన్లు, వెహికల్ లోన్లు తీసుకోవడం పెరిగింది. హౌస్హోల్డ్ సెక్టార్ ఒత్తిడిలో లేదు’ అని వివరించింది. మొత్తం హౌస్హోల్డ్ సేవింగ్స్ (ఫైనాన్షియల్, ఫిజికల్, జ్యువెలరీ) 2013–14 నుంచి 2021–22 మధ్య ఏడాదికి 9.2 శాతం గ్రోత్ నమోదు చేసిందని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఇదే టైమ్లో దేశ నామినల్ జీడీపీ ఏడాదికి 9.65 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది.
ఎన్బీఎఫ్సీల లోన్లు.. 11 రెట్లు అప్..
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) 2022–23 లో ఇచ్చిన లోన్లు భారీగా పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో హౌస్హోల్డ్స్కు రూ.21,400 కోట్ల అప్పులు ఇచ్చిన ఈ కంపెనీలు, కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.4 లక్షల కోట్ల అప్పులిచ్చాయి. ఇది ఏకంగా 11.2 రెట్ల గ్రోత్కు సమానం. ఎన్బీఎఫ్సీల రిటైల్ లోన్ల బకాయిలు 2021–22 లో రూ.8.12 లక్షల కోట్లుగా రికార్డవ్వగా, 2022–23 లో రూ.10.5 లక్షల కోట్లకు పెరిగిందని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ‘ఎన్బీఎఫ్సీల రిటైల్ లోన్ సెగ్మెంట్లో వెహికల్ లోన్ల వాటా ఎక్కువగా ఉంది. ఈ టైప్ లోన్ల బకాయిలు 2021–22 లో రూ.3.4 లక్షల కోట్లు ఉంటే 2022–23 లో 12.5 శాతం పెరిగి రూ.3.82 లక్షల కోట్లకు పెరిగాయి. ఇతర రిటైల్ లోన్లు రూ.3.95 లక్షల కోట్ల నుంచి రూ.5.22 లక్షల కోట్లకు ఎగిశాయి. మైక్రో ఫైనాన్స్ లోన్లు, మోర్టగేజ్ లోన్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు రిటైల్ లోన్లలో 36 శాతం వాటా రిటైల్ లోన్లదే ఉంది. బండ్లు కొనడానికి అప్పులు తీసుకోవడం ఎకానమీలో ఒత్తిడిని చూపడం లేదు’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ వివరించింది. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, హౌస్హోల్డ్స్ సేవింగ్స్ నుంచి బయటకు తీసిన ఫండ్స్లో మెజార్టీ భాగం ఇండ్లు, వెహికల్స్ వంటి ఫిజికల్ అసెట్స్లోకి వెళ్లాయి. 2022–23 లో హౌస్హోల్డ్స్ లోన్ బకాయిలు రూ.8.2 లక్షల కోట్లు పెరగగా, ఇందులో రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకులే ఇచ్చాయి. ఇందులో కూడా హోమ్ లోన్ల బకాయిలే ఎక్కువగా ఉన్నాయి.