హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వెహికల్స్కు చార్జింగ్ వసతులను కల్పించే హైదరాబాద్ కంపెనీ చార్జ్నెట్ తాజాగా ఈవీ సొల్యూషన్స్ కంపెనీ బైక్వోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈవీల కోసం 50 వేలకు పైగా చార్జింగ్, స్వాపింగ్ సెంటర్లలో ఏడాదిలో ఏర్పాటు చేస్తుంది. బైక్వో డీలర్/డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్తో ఛార్జింగ్ సెంటర్లను అన్ని నగరాలకు విస్తరించడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని చార్జ్నెట్ తెలిపింది. నెట్వర్క్ విస్తరణకు రూ.70 కోట్లు పెట్టుబడి పెడతామని చార్జ్నెట్ కో–ఫౌండర్ చక్రవర్తి అంబటి తెలిపారు.
‘భారత్లో అతిపెద్ద ఈవీ చార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న సంస్థ లక్ష్యానికి బైక్వో భాగస్వామ్యం దోహదం చేస్తుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ చార్జింగ్ డివైజ్లను దేశీయంగానే తయారు చేస్తున్నాం. హైదరాబాద్లోని కంపెనీ ప్లాంటుకు నెలకు 20 వేల యూనిట్లను ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది. దీనిని 18 నెలల్లో రెండింతలకు పెంచుతాం. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 200లకుపైగా చార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు. టూవీలర్ల అమ్మకాలు, సర్వీస్, బీమా, లోన్లు, యాక్సెసరీస్, చార్జింగ్ మౌలిక వసతులను కల్పిస్తూ వన్స్టాప్ షాప్ సొల్యూషన్స్గా ఎదిగామని బైక్వో కో–ఫౌండర్ విద్యాసాగర్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం 140 స్టోర్ల స్థాయికి చేరుకోవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ప్రముఖ బ్రాండ్ల ఎలక్ట్రిక్ టూవీలర్ల బైక్వో అమ్ముతోంది.