
- ఏడు, ఎనిమిది నెలలుగా డైలీ 20 వెహికల్స్ కు ఫైన్లు
- నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై పడుతుండగా యాక్సిడెంట్లు
- రూల్స్ పాటించని వెహికల్ డ్రైవర్లకు రూ.25 వేల ఫైన్
- ఇప్పటికే కొన్నింటిని సీజ్ చేసిన అధికారులు
- కొద్దిరోజులుగా డ్రైవర్లలో కనిపిస్తున్న మార్పు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలో నిర్మాణ రంగ మెటిరీయల్, కూల్చివేసిన వ్యర్థాలను తరలించే వాహనాలపై బల్దియా ఈవీడీఎం అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని ఎత్తైన ప్రాంతాల మీదుగా వెళ్తుండగా రెడిమిక్స్ వాహనాల్లోంచి కాంక్రీట్ పడుతుండడంతో స్పీడ్ బ్రేకర్ మాదిరిగా ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టిప్పర్, లారీ, మినీ ట్రాలీ ఇతర వాహనాల్లో తీసుకెళ్లే కంకర, ఇసుక, ఇటుక, మట్టితో పాటు నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలను తరలించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే చర్యలు చేపడుతున్నారు.
వాహనాల్లోంచి రోడ్లపై వ్యర్థాలు పడుతున్నా నిర్లక్ష్యంగా తీసుకెళ్లే డ్రైవర్లకు ఈవీడీఎం అధికారులు రూ.25 వేల ఫైన్ వేస్తున్నారు. వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి ఆ తర్వాత ఫైన్లు వేస్తుండగా డ్రైవర్లలో కొంత మార్పు కనిపిస్తుంది. ఏడు, ఎనిమిది నెలలుగా దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా చాలా వరకు సత్ఫలితాలు వచ్చాయి. అయినా డైలీ 20 కి పైగా వెహికల్స్కు ఫైన్లు వేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కంట్రోల్ లోకి వస్తుండగా.. సిటీ శివారులో పరిస్థితి అలాగే ఉంది. వెహికల్స్ లోడ్ తో వెళ్లే సమయంలో టార్పాలిన్తో పూర్తిగా కవర్ చేసుకోవాలి. దీనివల్ల మెటిరీయల్ లేదా వ్యర్థాలు, రోడ్డుపై కింద పడవు. కానీ.. ఓపెన్ గానే కంకర, ఇసుక, మట్టితో పాటు నిర్మాణ వ్యర్థాలు తరలిస్తున్నారు. రెడిమిక్స్ వాహనాలతోనూ రోడ్లు పూర్తిగా కరాబ్ అవుతున్నాయి.
నిర్మాణ ప్రాంతాలోనే ఎక్కువగా..
భారీ కన్ స్ర్టక్షన్స్ అయ్యే ప్రాంతాల్లో రోడ్లపై ఇసుక, మట్టి, కంకర కనిపిస్తుంది. వీటిని బిల్డర్లు పట్టించుకోవడం లేదు. రోడ్లపై పడితే తమకేంటనట్టుగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రోడ్లపైనే ఇసుక, కంకర నిల్వ చేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఇసుక, కంకర రోడ్లపైకి చేరుతుంది. వాన తగ్గిన తర్వాత పొడిగా తయారై వాహనదారులు కిందపడుతున్నారు. సిటీలోని మెయిన్ రోడ్లపైనే ఇసుక, కంకర బిజినెస్చేస్తున్నారు.
వీటిని రోడ్ల పక్కనే నిల్వ చేస్తుండగా.. స్టోరేజీ రోడ్లు డేంజర్గా ఉంటున్నాయి. హయత్నగర్లోని ఆటోనగర్ విజయవాడ హైవే పక్కన ఇసుక లారీల్లోంచి ఇసుకను మరో లారీలోకి డంప్చేస్తున్నారు. ఆ సమయంలో రోడ్లపై ఇసుక పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టూ వీలర్లు స్కిడ్ అయి పడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. టోలిచౌకీ ఫ్లై ఓవర్ పక్కన రోడ్లపైనే ఇసుకను స్టోరేజ్చేసి బిజినెస్చేస్తున్నారు. ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ .7, ఖైరతాబాద్, బండ్లగూడ, ఫతేనగర్, లోటస్ పాండ్తో పాటు చాలా ప్రాంతాలు డేంజర్గా మారాయి.
ప్లాంట్లకు వ్యర్థాలు తరలించట్లే..
గ్రేటర్లో పాత ఇండ్ల స్థానంలో కొత్తగా నిర్మించే వారు పాత ఇంటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడే పారేస్తున్నారు. ఇండ్లను భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ (సీ అండ్ డీ) ప్లాంట్లు ఫతుల్లా గూడ, జీడిమెట్లలో ఉండగా.. వ్యర్థాలు ఎక్కడ వేయాలనేది జనాలకు తెలియడంలేదు. పాత ఇండ్లను కూల్చి కొత్తగా నిర్మాణాలు చేపట్టాలంటే తొలగించిన వ్యర్థాలు ఎక్కడ వేయాలనే టెన్షన్ ఎక్కువైంది. బయట వేస్తే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బల్దియా ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ ప్లాంట్కి పంపాలంటే వేలాది రూపాయలు వ్యర్థాల కోసమే ఖర్చు అవుతుండగా గృహ నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. వ్యర్థాల కోసం ఒక్కో టన్నుకి రూ.405 కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఖర్చు ఎందుకని రాత్రిపూట వేరే ప్రాంతాల్లో పారవేస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్సంస్థ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ రీసైక్లింగ్ప్లాంట్లను నిర్మించింది. గ్రేటర్ లో డైలీ 3 వేల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ప్లాంట్లకు తరలించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలి.
చర్యలు తీసుకుంటున్నం
నిర్మాణ వ్యర్థాలు తరలించే వెహికల్స్ డైవర్లు రోడ్డుపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. జాగ్రత్తలు పాటించని వారికి రూ. 25 వేల ఫైన్ వేస్తున్నం. అయినా మారకపోతే వెహికల్స్ సీజ్ చేస్తున్నం.
– ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి