- వరల్డ్ నం.1 న్యూజిలాండ్తో ఇండియా ఢీ
- నేడు ఉప్పల్లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇయ్యాల ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో వరల్డ్ నంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్తో టీమిండియా పోటీ పడనుంది. హైదరాబాద్లో నాలుగేండ్ల గ్యాప్ తర్వాత జరుగుతున్న వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1.30కి షురూ కానుంది. శ్రీలంకతో వన్డే సిరీస్లో అదరగొట్టిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్కు హోమ్గ్రౌండ్లో ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం. లోకల్ స్టార్ సిరాజ్తోపాటు ఇండియా కూడా అదే జోరు చూపెట్టి కివీస్ను పడగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో ఉన్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్లో శ్రీలంకను 3–0తో వైట్వాష్ చేసిన మూడు రోజుల గ్యాప్లోనే మరో పోరుకు రెడీ అయ్యింది.మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. లంకతో సిరీస్ వన్సైడ్వార్గా మారగా.. వన్డేల్లో టాప్ ర్యాంకర్ అయిన కివీస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా, పాకిస్తాన్లో వన్డే సిరీస్ గెలిచి కివీస్ మన దేశానికి వచ్చింది. అదే జోరును ఇక్కడా కొనసాగించాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బ్లాక్క్యాప్స్ టీమ్ను పడగొట్టడం నాలుగో ర్యాంకర్ రోహిత్సేనకు సవాల్తో కూడుకున్న పనే కానుంది. ఈ సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేస్తే ఇండియా వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ అందుకుంటుంది.
శ్రేయస్కు గాయం.. బరిలోకి ఇషాన్
తన చివరి వన్డేలో వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ చేసినా.. శ్రీలంకతో వన్డేల్లో బెంచ్పై కూర్చున్న యంగ్ కీపర్ ఇషాన్ కిషన్ కివీస్పై బరిలోకి దిగబోతున్నాడు. పర్సనల్ రీజన్స్తో కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో ఇషాన్ కీపర్గా రానున్నాడు. తను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. గత పోరులో ఓపెనర్ గిల్ సెంచరీ కొట్టగా.. చివరి నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలతో విరాట్ కోహ్లీ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ ఇద్దరికి తోడు రోహిత్ కూడా దంచితే టీమ్కు తిరుగుండదు. లంకపై నాలుగో నంబర్లో ఆడిన శ్రేయస్ అయ్యర్ గాయంతో ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతని ప్లేస్లో రజత్ పటీదార్ను తీసుకున్నారు. అయితే, శ్రేయస్ ప్లేస్లో నాలుగులో సూర్యకుమార్ బరిలోకి దిగే చాన్స్ ఉంది. లంకతో చివరి వన్డేకు రెస్ట్ తీసుకున్న పాండ్యా తిరిగి రావడం ఖాయమే. అక్షర్ కూడాఈ సిరీస్ నుంచి బ్రేక్ తీసుకోగా.. కివీస్ టీమ్లోని లెఫ్టాండర్లపై పనికొచ్చే స్పిన్ ఆల్రౌండర్ సుందర్ను తుది జట్టులో కొనసాగించే చాన్సుంది. ఇక పేస్ బౌలింగ్ను హైదరాబాదీ సిరాజ్ మరోసారి ముందుండి నడిపించనున్నాడు. లంకపై జోరును సిరాజ్ ఇక్కడా కొనసాగిస్తే ఇండియా విజయం సులువు అవుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ కంటే కుల్దీప్ కే మొగ్గు కనిపిస్తోంది.
కివీస్ కీలక ప్లేయర్లు లేకుండా..
వన్డేల్లో టాప్ ర్యాంకర్ అయిన న్యూజిలాండ్ కీలక ప్లేయర్లు లేకుండా ఇండియాను ఢీకొట్టనుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, పేసర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్కు దూరంగా ఉన్నారు. స్పిన్నర్ ఇష్ సోధీ ఈ మ్యాచ్లో ఆడటం లేడని స్టాండిన్ కెప్టెన్ టామ్ లాథమ్ చెప్పాడు. అయినా కివీస్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. లాథమ్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో భారీ హిట్టర్లు ఉన్నారు. ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా సత్తా ఉన్న ఆటగాడే. ఐపీఎల్ అనుభవం ఉన్న స్పిన్నర్ మిచెల్ శాంట్నర్, పేసర్ లోకీ ఫెర్గూసన్తో ఇండియన్స్కు సవాల్ ఎదురవనుంది.
సిరాజ్ మాకు చాలా ఇంపార్టెంట్: రోహిత్
హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండేండ్లుగా మూడు ఫార్మాట్లలోనూ సిరాజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడన్నాడు. ‘తన హోం గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్కు బెస్టాఫ్ లక్. సిరాజ్ మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. గత రెండేళ్లలో తన లైన్ అండ్ లెంగ్త్ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఔట్ స్వింగర్లతో సత్తా చాటుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో తన స్వింగ్ చూపెట్టాడు. తన బౌలింగ్ గురించి ఇప్పుడు సిరాజ్ బాగా తెలుసుకున్నాడు. అదే టైమ్లో జట్టుకు ఏం అవసరమో తెలుసుకొని అందుకు తగ్గ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. కొత్త బాల్తో స్టార్టింగ్లోనే కాకుండా మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలోనూ వికెట్లు పడగొట్టే స్కిల్స్ అతని సొంతం. అలాంటి బౌలర్ మాకు చాలా అవసరం. కాబట్టి సిరాజ్ వర్క్లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాతో రాబోయే టెస్టు సిరీస్తో పాటు వన్డే వరల్డ్కప్నకు అతడిని ఫ్రెష్గా ఉంచాలి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
42 మ్యాచ్ ల తర్వాత సొంతగడ్డపై తొలిపోరు..
లోకల్ స్టార్ సిరాజ్కు ఈ మ్యాచ్ స్పెషల్ కానుంది. హైదరాబాద్లో అతనికిదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇండియా తరఫున ఇప్పటిదాకా 42 (15 టెస్టులు, 19 వన్డేలు, 8 టీ20లు) మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించిన సిరాజ్ ఉప్పల్లో ఒక్కటి కూడా ఆడలేదు. ఐపీఎల్లో సిరాజ్ మెరుపులు చూసిన భాగ్యనగర అభిమానులు ఇప్పుడు బ్లూ జెర్సీలో సిరాజ్ స్పీడ్, స్వింగ్ చూడాలని ఆశిస్తున్నారు. 2022లో సిరాజ్ 33 వికెట్లతో ఇండియా తరఫున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. లంకతో సిరీస్లో 9 వికెట్లతో చెలరేగాడు. తాను ఓనమాలు నేర్చుకున్న గడ్డపై ఇండియా తరఫున తొలి పోరును సిరాజ్ గుర్తుండిపోయేలా చేసుకుంటాడేమో చూడాలి.
నాలుగేండ్ల తర్వాత ఉప్పల్లో వన్డే..
ఉప్పల్ స్టేడియంలో నాలుగేండ్ల గ్యాప్ తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. చివరగా 2019 మార్చిలో ఆస్ట్రేలియాతో వన్డే ఆడిన ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ స్టేడియంలో ఇండియాకు మంచి రికార్డుంది. 2011 నుంచి ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ నెగ్గింది. 2005లో మొదలైన ఈ స్టేడియంలో ఇండియా 6 వన్డేలు, 5 టెస్టులు, 3 టీ20లు ఆడింది. ఓ టెస్టు డ్రా చేసుకొని నాలుగింటిలో నెగ్గింది. ఆరు వన్డేల్లో తొలి మూడు వన్డేల్లో ఓడి, చివరి మూడింటిలో గెలిచింది. ఓ టీ20 వర్షంతో రద్దవగా.. మిగతా రెండింటిలో మన జట్టే నెగ్గింది.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్య, ఇషాన్ (కీపర్), పాండ్యా, సుందర్, కుల్దీప్/చహల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ న్యూజిలాండ్: అలెన్, కాన్వే, చాప్మన్/నికోల్స్, డారిల్ మిచెల్, లాథమ్ (కెప్టెన్, కీపర్), ఫిలిప్స్, మిచెల్ బ్రేస్వెల్, శాంట్నర్,హెన్రీ షిప్లీ, జాకబ్ డఫీ, ఫెర్గూసన్.
ఈ మ్యాచ్ వికెట్పై పెద్దగా గ్రాస్ కనిపించడం లేదు. మంగళవారం సాయంత్రం ఎక్కువగా రోలింగ్ చేశారు. టీ20 మాదిరిగా బౌండ్రీలైన్ కూడా కొంచెం ముందుకు జరిపారు. కాబట్టి బ్యాటర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. భారీ స్కోర్లు రావొచ్చు. రాత్రి మంచు ప్రభావం దృష్ట్యా ఛేజింగ్ టీమ్కు అడ్వాంటేజ్ ఉంటుంది. బుధవారం వాన సూచన లేదు.