పవర్​లో ఉన్న పార్టీకే మానుకోట జై.!

పవర్​లో ఉన్న పార్టీకే మానుకోట జై.!
  • 1957 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి
  • ఈసారి అదే సీన్​ రిపీట్​ అవుతుందని కాంగ్రెస్​ ధీమా
  • ఓటమితో బీఆర్ఎస్​ డీలా
  • క్యాడర్​ లేని బీజేపీకి మోదీపైనే ఆశలు

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ పార్టీ పవర్​లో ఉంటే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకే మానుకోట ఓటర్లు పట్టం గడ్తున్నారు. 1957 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.   ప్రస్తుతం మహబూబాబాద్​ లోక్​సభ స్థానం నుంచి  కాంగ్రెస్​ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్​, బీఆర్​ఎస్​ నుంచి మాలోతు కవిత, బీజేపీ అభ్యర్థిగా ప్రొఫెసర్​ సీతారామ్​ నాయక్​ పోటీపడ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్​ డీలాపడగా, ఆ పార్టీ అభ్యర్థి కవిత ఒంటరి పోరు చేస్తున్నారు. ఇక క్యాడర్​లేని బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాంనాయక్​ ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు. 

సెంటిమెంట్​ కలిసి వచ్చేనా

మహబూబాబాద్​ పార్లమెంట్​1957లో  జనరల్ ​ఎంపీ సీటుగా ఆవిర్భవించింది. నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ నుంచి ఎంపీని గెలిపిస్తున్నారు.  మహబూబాబాద్​ జనరల్​ సీటుగా ఉన్న 1957, 62లో కాంగ్రెస్ ​అభ్యర్థి  ఈఎం రావు వరుసగా రెండుసార్లు గెలిచారు. 1965 ఉప ఎన్నికలో  కాంగ్రెస్​ నుంచే ఆర్.సురేందర్​ రెడ్డి  విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహబూబాబాద్​ ఎస్టీ రిజర్వుడ్​గా మారింది. ఎస్టీగా మారిన తర్వాత 2009లో కాంగ్రెస్​ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్​ గెలుపొంది కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ టైంలో కాంగ్రెస్​ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2014లో టీఆర్ఎస్​ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్​ సీతారాం నాయక్​ గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్​  అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్​ నుంచి మాలోతు కవిత విజయం సాధించగా, మరోసారి టీఆర్​ఎస్​ ప్రభుత్వం స్టేట్​లో పవర్​లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

భారీ మెజారిటీపై బలరాంనాయక్​ కన్ను

గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్​, డోర్నకల్, పినపాక, భద్రాచలం, ఇల్లందు  అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్​ సుమారు 3లక్షలకు పైగా మెజారిటీ వస్తుందనే ధీమాతో ఉన్నారు. బలరాం నాయక్​గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం ఆయనకు అదనపు బలం. ప్రజలకు అందుబాటులో ఉండే ఆయనకు ఆపదలో ఆదుకుంటారనే పేరుంది. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో 365 నేషనల్​ హైవే ఏర్పాటు, శాతవాహన  రైల్వే హాల్టింగ్, కురవిలో ఏకలవ్య విద్యాలయ నిర్మాణం,  తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ మధ్య గోదావరిపై వంతెన సాంక్షన్​ చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నందున తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవికూడా వచ్చే అవకాశముందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 

 మాలోతు కవిత  ఒంటరి పోరాటం

సిట్టింగ్​ ఎంపీ, బీఆర్ఎస్​ అభ్యర్థి మాలోత్​ కవితకు  ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్​ నుంచి లేకపోవడం ఆమెకు మైనస్. ఉన్న ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కూడా కాంగ్రెస్​లో చేరారు. మాజీ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా సహకారం దక్కట్లేదు. పార్టీలో అంతర్గత విభేదాలు ఆమెకు సమస్యగా మారాయి.  ఎంపీగా ఐదేండ్లు కొనసాగిన  కవిత కేంద్రం నుంచి  ఎలాంటి నిధులు సాధించలేకపోయారు. ఈ అభివృద్ధి చేశానని చెప్పుకోలేని పరిస్థితి. విభజన హామీగా ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ కూడా నెరవేరలేదు. మహబూబాబాద్​లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని క్యాడర్​కు అందుబాటులో ఉండడం ఆమెకు కొంతవరకు కలిసివచ్చే అంశం.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్​ఎస్​ క్యాడర్ ​నిస్తేజంలో ఉండడంతో ఫీల్డ్​లో ఆమెకు ఎంతవరకు సహకారం దక్కుతుందనేది అనుమానమే.  

నమో నినాదాన్నే నమ్ముకున్న సీతారాం నాయక్​

మహబూబాబాద్​లో​ బీజేపీకి చెప్పుకోదగిన క్యాడర్ ​లేదు. ఆ పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ముందే బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరారు. గెలిచాక  నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని, కేవలం ఎన్నికల టైంలో ప్రత్యక్షం అవుతారనే అపవాదు ఉంది. ఎం పీ గా కొనసాగిన సమయంలోనూ చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయకపోవడం ఆయనకు మైనస్​. మహబూబాబాద్​ పార్లమెంట్​ పరిధిలో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉంది. అందులోనూ పాత బీజేపీ క్యాడర్​  సీతారాంనాయక్​కు పెద్దగా సహకరించే పరిస్థితి లేదు.  ​ మరోవైపు నియోజకవర్గంలో ప్రచారానికి పేరున్న లీడర్లెవరూ రావడం లేదు. కేవలం ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకొన్న సీతారాంనాయక్​, కేంద్ర పథకాలు, హిందుత్వ ఎజెండా తనను గెలిపిస్తాయనే ఆశతో ప్రచారం 
కొనసాగిస్తున్నారు.