బిజినెస్ డెస్క్, వెలుగు: దేశ స్టాక్ మార్కెట్లు రానున్న నెలల్లో కొత్త రికార్డులకు చేరుకుంటాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి నిఫ్టీ 20,936 లెవెల్కు చేరుకుంటుందని బ్రోకరేజి కంపెనీ ప్రభుదాస్ లిలాధర్ అంచనావేసింది. బుల్లిష్ ట్రెండ్ ఎక్కువగా ఉంటే నిఫ్టీ 22,918 వరకు కూడా వెళ్లొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నిఫ్టీ 20,000 - 21,000 లెవెల్ను టచ్ చేస్తుందని ఎస్ఎస్జే ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. నిఫ్టీ శుక్రవారం 17,332 వద్ద క్లోజయ్యింది. గ్లోబల్గా గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో యూఎస్, యూరప్ దేశాల్లో ఇన్ఫ్లేషన్ 15–20 ఏళ్ల గరిష్టాలకు చేరుకున్నాయి. దీంతో గ్లోబల్ ఎకానమీ మాంద్యంలోకి జారుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్గా మెరుగ్గా ఉన్నా, గ్లోబల్ కారణాలు మన మార్కెట్లను కిందకి లాగుతున్నాయి. దీంతో మార్కెట్లో వోలటాలిటీ కనిపిస్తోంది. కానీ, ఇది తాత్కాలికమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. నిఫ్టీ కొత్త రికార్డులకు చేరుకోవడానికి అనేక అంశాలు సాయపడనుండగా ఇందులో ముఖ్యమైంది పండుగ సీజన్ అని ప్రభుదాస్ లిలాధర్ వివరించింది. లోకల్గా కన్జూమర్లు ఖర్చు చేయడం కరోనా ముందు స్థాయిలకు చేరుకుందని తెలిపింది.
నిఫ్టీపై ప్రభుదాస్ లిలాధర్ అంచనాలు..
ఈ బ్రోకరేజ్ కంపెనీ ప్రకారం, వచ్చే రెండు క్వార్టర్లలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే తప్ప మార్కెట్లో వోలటాలిటీ తగ్గదు. క్రూడాయిల్, మెటల్స్, పాల్మాయిల్, వివిధ రకాల అగ్రి కమొడిటీల ధరలు తగ్గినప్పటికీ రానున్న నెలల్లో వీటి రేట్లు తిరిగి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఫెడ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటోందని ప్రభుదాస్ లిలాధర్ తన ఎనలిస్ట్ నోట్లో పేర్కొంది. దేశ 10 ఏళ్ల టీ బిల్స్ (ఈల్డ్(రాబడి) 7.46 శాతం) , ఫెడ్ 10 ఏళ్ల టీ బిల్స్ (ఈల్డ్ 3.88 శాతం) ఈల్డ్ల మధ్య అంతరం 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. వడ్డీ రేట్లను కూడా ఫెడ్ పెంచినంత ఎక్కువగా ఆర్బీఐ పెంచడం లేదు. ఫలితంగా ఆర్బీఐ రెపో రేటు 5.9 శాతంగా, ఫెడ్ వడ్డీ రేటు 3 – 3.25 శాతం రేంజ్లో ఉన్నాయి. సాధారణంగా ఈల్డ్ (రాబడి) ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెళుతుంటాయి. ‘ గ్లోబల్ ఎకానమీ గ్రోత్ నెమ్మదించడం, వోలటాలిటీ ఎక్కువగా ఉండడంతో రానున్న నెలల్లో రూపాయిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అంచనావేస్తున్నాం. రూరల్ డిమాండ్ ఇంకా రికవరీ అవ్వనప్పటికీ లోకల్గా ఓవరాల్గా డిమాండ్ పుంజుకుంటోంది. డిస్క్రిషనరీ (ఏసీలు, ఆటోమొబైల్స్ వంటివి కొనడం) సెగ్మెంట్లో ఖర్చు చేయడానికి కన్జూమర్లు వెనకడుగు వేయడం లేదు.
దేశ ఇన్ఫ్లేషన్ ఇంకో రెండో క్వార్టర్లలో లిమిట్ కంటే దిగువకు వస్తుందని ఆర్బీఐ అంచనావేస్తోంది. అయినప్పటికీ గ్లోబల్ సమస్యలు, లోకల్గా లిక్విడిటీ ఒత్తిళ్ల వలన జాగ్రత్త వహిస్తున్నాం’ అని ప్రభుదాస్ లిలాధర్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో పండుగ సీజన్ వలన ఎకానమీ వృద్ధి చెందుతుందని అంచనావేసింది. అంతేకాకుండా ప్రభుత్వ ఇన్ఫ్రా ఖర్చులు, ప్రభుత్వ కంపెనీల క్యాపెక్స్, డిఫెన్స్, డిజిటైజేషన్, డేటా సెంటర్స్ మొదలైన సెక్టార్లలో క్యాపెక్స్ పెరగనుండడంతో దేశ ఎకానమీకి మేలు జరుగుతుందని తెలిపింది. ఐటీ సర్వీస్లకు గ్లోబల్గా మంచి డిమాండ్ ఉంటుందని, చైనాకు వెలుపల మరో సప్లయ్ చెయిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఫార్మా, కెమికల్స్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీలు చూస్తున్నాయని వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో కనిపించే వోలటాలిటీ తాత్కాలికమని, ఇన్వెస్టర్లు క్వాలిటీ షేర్లను కొనుక్కోవాలని సలహాయిచ్చింది.
ఈ షేర్లపై ఫోకస్..
వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థి తుల్లో డొమెస్టిక్ మార్కెట్ నుంచి ఎక్కువ గా రెవెన్యూ వచ్చే కంపెనీలపై ఫోకస్ పెట్టాలని ఎస్ఎస్జే ఫైనాన్స్ పేర్కొంది. ఐటీ షేర్లు లాంగ్ టెర్మ్లో మంచి రిటర్న్ ఇస్తా యని, క్వాలిటీ షేర్లను కొనుక్కోండని సలహాయిచ్చింది. ఎఫ్ఎంసీజీ, సిమెంట్, బ్యాంక్ షేర్లపై ఈ కంపెనీ బుల్లిష్గా ఉంది. బ్యాంకులు, హెల్త్కేర్, ఐటీ సర్వీసెస్, ఆటో మొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, టెలికం సెక్టా ర్లపై ప్రభుదాస్ లిలాధర్ బుల్లిష్గా ఉంది.
నిఫ్టీపై ఎస్ఎస్జే ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీస్ అంచనాలు..
సాధారణంగా అక్టోబర్ నెల బుల్స్కు ఫేవర్గా ఉంటుందని ఎస్ఎస్జే ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీస్ ఎండీ సౌరభ్ ఎస్ జైన్ పేర్కొన్నారు. తాజాగా నిఫ్టీ 18,100 నుంచి 7 శాతం పడిందని, 16,750 దగ్గర సపోర్ట్ లభించిందని అన్నారు. ‘షార్ట్ టెర్మ్లో ముఖ్యంగా అక్టోబర్ నెలలో మార్కెట్ వోలటాలిటీలో ఉంటుంది. పైకి వెళ్లే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయి. కరెక్షన్ వస్తే దిగువ స్థాయిల వద్ద సపోర్ట్ లభిస్తుంది’ అని వివరించారు. నిఫ్టీ 16,500–16,300 లెవెల్ను హోల్డ్ చేసేంత వరకు 17,350–17,500 వరకు కదులుతుందని, 17,850 పైన సస్టయిన్ అయితే కొత్త గరిష్టాలకు చేరుకోవడాన్ని చూస్తామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిఫ్టీ 19,000 కు, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 20,000–21,000 కు వెళుతుందని అంచనావేశారు.