రాంచీలో ‘రోకో’ షో
వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న కోహ్లీ, రోహిత్పై ఈ మ్యాచ్లో అందరి దృష్టి నిలవగా.. రాంచీ స్టేడియంలో రోకో తమ బ్యాటింగ్ షో చూపెట్టారు. అంచనాల ఒత్తిడిని తనదైన శైలిలో అధిగమిస్తూ 36 ఏండ్ల కోహ్లీ సెంచరీ పాత కింగ్లా రెచ్చిపోయాడు. పేస్, స్పిన్ను అలవోకగా ఎదుర్కొంటూ మునుపటి కోహ్లీని గుర్తు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఇండియా ఆరంభంలోనే బర్గర్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ (18) వికెట్ కోల్పోయింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 136 రన్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1 రన్ వద్ద డిజార్జి డ్రాప్ చేసిన ఈజీ క్యాచ్ నుంచి బయటపడ్డ రోహిత్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యాన్సెన్, బాష్ బౌలింగ్లో ఫ్లిక్, పుల్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు బర్గర్ బౌలింగ్లో మిడాఫ్ మీదుగా సిక్స్తో అలరించిన కోహ్లీ.. ఆ వెంటనే తన మార్కు కవర్ డ్రైవ్తో ఫ్యాన్స్ను ఫిదా చేశాడు. స్టాండిన్ కెప్టెన్ మార్క్రమ్ స్పిన్నర్లను బరిలోకి దింపినా.. రోకో అస్సలు వెనక్కు తగ్గలేదు.
బాష్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన కోహ్లీ, సింగిల్తో రోహిత్ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. చివరకు యాన్సెన్ బౌలింగ్లో రోహిత్ ఎల్బీ అవ్వడంతో ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. రుతురాజ్ గైక్వాడ్ (8), సుందర్ (13) విఫలమవ్వడంతో ఇండియా ఇన్నింగ్స్ కాస్త మందగించింది. కానీ, మరో ఎండ్లో కోహ్లీ గోడలా నిలబడ్డాడు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ తోడుగా తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో 02 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టైమ్లో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఒక అభిమాని విరాట్ కాళ్లు మొక్కాడు. వంద దాటి తర్వాత మరింత వేగం పెంచిన కోహ్లీ స్పిన్నర్ సుబ్రయన్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో 21 రన్స్ రాబట్టడం ఇన్నింగ్స్కే హైలైట్. కాసేపటికే బర్గర్ బౌలింగ్లో తను ఔటైనా.. స్లాగ్ ఓవర్లలో రాహుల్, జడేజా (32) ధాటికిగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు.
యాన్సెన్, మాథ్యూ వణికించినా..
ఛేజింగ్ ఆరంభంలోనే మూడు వికెట్లు పడ్డా.. సఫారీ ప్లేయర్లు యాన్సెన్, బ్రీట్జ్కే, కార్బిన్ బాష్ ఇండియాను వణికించారు. తన తొలి బాల్కు రికెల్టన్ (0)ను బౌల్డ్ చేసిన హర్షిత్ రాణా మూడో బాల్కు క్వింటన్ డికాక్ (0)కు డకౌట్ చేసి ఇండియాకు అద్భుత ఆరంభం అందించాడు. ఆ వెంటనే కెప్టెన్ మార్క్రమ్ (7)ను అర్ష్దీప్ పెవిలియన్ చేర్చడంతో 11/3తో సఫారీ టీమ్ డీలా పడింది. కొద్దిసేపు మెరుపులు మెరిపించిన డిజార్జి (39)ని కుల్దీప్, బ్రెవిస్ (37)ను హర్షిత్ ఔట్ చేయడంతో 130/5తో నిలిచిన సౌతాఫ్రికా తొందర్లోనే ఆలౌటయ్యేలా కనిపించింది.
ఈ టైమ్లో బ్రీట్జ్కేకు తోడైన ఆల్రౌండర్ యాన్సెన్ అనూహ్యంగా విజృంభించాడు. భారీ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 30 ఓవర్లకే సఫారీ స్కోరు 200 దాటింది. యాన్సెన్, బ్రీట్జ్కేను కుల్దీప్ ఒకే ఓవర్లో ఔట్ చేసినా.. కొత్తగా క్రీజులోకి వచ్చిన కార్బిన్ బాష్ బౌలర్లకు ఎదురునిలిచాడు. సుబ్రయన్ (17), బర్గర్ (17) తోడుగా స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లు కొట్టి టెన్షన్ పెట్టినా లాస్ట్ ఓవర్లో అతను ఔటవడంతో ఇండియానే విజయం వరించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 349/8 (కోహ్లీ 135, రాహుల్ 60, రోహిత్ 57, బార్ట్మన్ 2/60)
సౌతాఫ్రికా: 49.2 ఓవర్లలో 332 ఆలౌట్ (బ్రీట్జ్కే 72, యాన్సెన్ 70, బాష్ 67, కుల్దీప్ 4/68).
సిక్సర్ల రారాజు రోహిత్
ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (352) బాదిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది (398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు) రికార్డును బ్రేక్ చేశాడు. ఆఫ్రిది ఈ ఘనతకు 398 మ్యాచ్లు తీసుకోగా, రోహిత్ కేవలం 278 మ్యాచ్ల్లోనే (270 ఇన్నింగ్స్లు) అతడిని అధిగమించాడు.
