న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్టుండి డియాక్టివేట్ అయ్యింది. దాదాపు 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలకు పైగా) ఫాలోవర్స్ ఉన్న విరాట్ ఇన్స్స్టా అకౌంట్ శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచి ఓపెన్ అవ్వడం లేదు. విరాట్ ఇన్స్స్టా హ్యాండిల్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే యూజర్ నాట్ ఫౌండ్ అంటూ మెసేజ్ దర్శనం ఇస్తోంది. దీంతో కోట్లాది మంది విరాట్ ఫాలోవర్స్, అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.
విరాట్ ఇన్స్ స్టా అకౌంట్కు ఏమైంది.. ఆకస్మాత్తుగా ఎందుకు డీయాక్టివేట్ అయ్యిందంటూ ఆరా తీస్తున్నారు. మరికొందరు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు సోషల్ మీడియాలో మేసేజులు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇన్స్స్టా అకౌంట్కు ఏమైందని ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోహ్లీ టీమ్ గానీ ఇన్స్స్టా గ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇంటర్నెట్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు తమ వ్యక్తిగత జీవితం, కుటుంబ గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కోహ్లీ ఇన్స్ స్టాకు గుడ్ బై చెప్పి అకౌంట్ డిలీట్ చేసినట్లు ప్రచారం ఊపందుకుంది. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల జరిగి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్స్స్టా గ్రామ్లో కోహ్లీకి 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలకు పైగా) ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల్లో ఒకరు. కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే కోట్లలో ఆదాయం వస్తుంది. అలాంటిది కోట్ల ఇన్ కమ్ను వదిలేసుకుని సడెన్ గా ఇన్స్ స్టా అకౌంట్ ఎందుకు డిలీట్ చేసుకున్నారనేది తెలియాల్సి ఉంది. కోహ్లీ నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ దీనిపై ఒక క్లారిటీ రానుంది.
