న్యూఢిల్లీ: అక్టోబర్– డిసెంబర్2022 క్వార్టర్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) గ్రోత్ 4.4 శాతానికి తగ్గింది. తాజా క్యూ 3 డేటాను మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంగళవారం రిలీజ్ చేసింది. రేట్లను అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను పెంచడం వల్లే గ్రోత్ రేటు తగ్గినట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ మొదటి రెండు క్వార్టర్లతో పోలిస్తే ఈ గ్రోత్ రేటు బాగా తక్కువ. ఏప్రిల్– జూన్ 2022 మధ్యలో మన జీడీపీ 13.2 శాతం గ్రోత్ రేటును, జులై – సెప్టెంబర్ మధ్యలో 6.3 శాతం గ్రోత్ రేటును సాధించింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో గ్రోత్ బాగా తక్కువ ఉండటం వల్ల 2022–23 మొదటి క్వార్టర్లో గ్రోత్ రేటు ఎక్కువగా రికార్డయింది. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్కు జీడీపీ గ్రోత్ రేటు 7 శాతంగా ఉంటుందని మంగళవారం స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ గ్రోత్ రేటు 6.8 శాతానికి మించకపోవచ్చని ఆర్బీఐ అంచనా వేసిన విషయం తెలిసిందే. నిలకడైన ధరల వద్ద క్యూ 3 జీడీపీ రూ. 40.19 లక్షల కోట్లని స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ డేటా తెలిపింది. అంతకు ముందు ఏడాది (2021–22) క్యూ 3 లో ఈ జీడీపీ రూ. 38.51 లక్షల కోట్లు. అంటే క్యూ 3 లో 4.4 శాతం పెరిగినట్లు. అదేవిధంగా, ప్రస్తుత రేట్ల వద్ద జీడీపీ లెక్కిస్తే అది రూ. 69.38 లక్షల కోట్లని మినిస్ట్రీ డేటా పేర్కొంది. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లో ఈ జీడీపీ రూ. 62.39 లక్షల కోట్లు మాత్రమేనని, దీంతో పోలిస్తే ఈ క్యూ 3 లో 11.2 శాతం పెరిగినట్లవుతుందని వివరించింది.
తగ్గిన కన్జూమర్ డిమాండ్,
ఎగుమతులూ కారణాలే..
రేట్లను కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను పెంచడమే జీడీపీ గ్రోత్ రేటు తగ్గడానికి ప్రధానమైన కారణమని చెబుతున్నారు. ఇదే కాకుండా, మరి కొన్ని కారణాల వల్లా జీడీపీ జోరు తగ్గింది. ఎగుమతులలో స్లోడౌన్, దేశంలో కన్జూమర్ డిమాండ్ తగ్గడం వంటి కారణాలు కూడా జీడీపీ నెమ్మదించడానికి కారణాలేనని పేర్కొంటున్నారు. ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే, కన్జూమర్ డిమాండ్ తగ్గడానికి వడ్డీ రేట్లు పెంచడమే కారణంగా నిలుస్తుంది. గ్లోబల్గా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో ఆయా దేశాలలో డిమాండ్ తగ్గడం వల్ల మన ఎగుమతులు నెమ్మదించాయి.
వ్యవసాయం నిలబెట్టింది..
మూడో క్వార్టర్లో తయారీ రంగం 1.1 శాతం కుచించుకుపోయిందని, ఇదే సమయంలో వ్యవసాయ రంగం 3.7 శాతం గ్రోత్ రేటు సాధించిందని డేటా వెల్లడిస్తోంది. 2022-23 మూడో క్వార్టర్లో మైనింగ్ సెక్టార్ ఊపందుకుందని, ఈ రంగం 3.7 శాతం గ్రోత్రేటును రికార్డు చేసిందని పేర్కొంది. ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్సెక్టార్లూ వరసగా 8.2 శాతం, 8.4 శాతం చొప్పున గ్రోత్ సాధించినట్లు మినిస్ట్రీ డేటా తెలిపింది. కానీ, హోటల్స్-ట్రాన్స్పోర్ట్ సెక్టార్ గ్రోత్ రేటు 9.7 శాతానికి పడిపోయింది. మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్ 5.8 శాతం పెరగగా, డిఫెన్స్ సెక్టార్ 2 శాతం గ్రోత్ను రికార్డు చేసింది.
జనవరిలో కోర్ సెక్టార్ 7.8 శాతం పెరిగింది...
మరోవైపు డిసెంబర్2022 తో పోలిస్తే జనవరి 2023 లో కోర్ సెక్టార్ గ్రోత్ 7.8 శాతానికి పెరిగింది. అంతకు ముందు నెల అంటే డిసెంబర్ 2022 లో కోర్ సెక్టార్ గ్రోత్ 7 శాతంగా రికార్డయింది. కోల్, ఫెర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ పెరగడం వల్లే జనవరిలో కోర్సెక్టార్ గ్రోత్ పెరిగినట్లు స్టాటిస్టికల్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఏకంగా 17.9 శాతం పెరగ్గా, కోల్ ప్రొడక్షన్ 13.4 శాతం, ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ 12 శాతం చొప్పున పెరిగింది. ఇక స్టీల్ సెక్టార్ అవుట్పుట్ 6.2 శాతం, నేచురల్ గ్యాస్ అవుట్పుట్ 5.3 శాతం, సిమెంట్ అవుట్పుట్ 4.6 శాతం చొప్పున పెరిగాయి. ఎనిమిది కోర్ సెక్టార్లలో ఒక్క సెక్టార్ మాత్రమే నెగిటివ్ గ్రోత్ కనబరిచిందని, క్రూడ్ ఆయిల్ అవుట్పుట్ జనవరి 2023 లో 1.1 శాతం తగ్గిపోయిందని డేటా తెలిపింది. ఏప్రిల్2022 నుంచి జనవరి 2023 దాకా 10 నెలలకు కలిపి చూస్తే కోర్సెక్టార్లు 7.9 శాతం గ్రోత్ సాధించాయని కూడా స్టాటిస్టికల్ మినిస్ట్రీ డేటా పేర్కొంది. నవంబర్, డిసెంబర్2022 నెలలతోపాటు, జనవరి 2023 లోనూ కోర్ సెక్టార్లు పాజిటివ్గ్రోత్ చూపించడమంటే, దేశంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పుంజుకున్నట్లే. అంతకు ముందు అక్టోబర్ 2022 నెలలో ఎనిమిది కీలక సెక్టార్ల అవుట్పుట్ 0.1 శాతం తగ్గిపోయింది.