కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్

కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్

కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాప్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కొవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ కొనసాగుతోంది.. ఆరోగ్య సౌకర్యాలు, ఐసోలేషన్‌ బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్‌ డాక్టర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల లభ్యత.. అలాగే అంబులెన్సు, పరీక్షా పరికరాలు, అవసరమైన మందులు తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. 

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సందర్శించారు. మాక్ డ్రిల్ నిర్వహణను పర్యవేక్షించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను సమీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిపై దృష్టి సారించారు. చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. దీంతో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో నిర్థారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు మాస్కులను కంపల్సరీ చేశాయి.