లీడ్స్ టెస్ట్ లో భారత్ కు దారుణ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 345 పరుగుల ఆధిక్యం సాధించింది ఇంగ్లండ్. ఇంకా ఆ జట్టుకు 2 వికెట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 78 రన్స్ కే ఆలౌట్ అయి... మొదటి రోజే గెలుపు అవకాశాలను కోల్పోయింది భారత్. రెండోరోజూ ఆటలో ఇంగ్లండ్ ధాటిగా ఆడింది. 120 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట కొనసాగించింది ఇంగ్లండ్. ఓపెనర్లే రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మంచి పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. టీమ్ స్కోర్ 135 రన్స్ దగ్గర ఉండగా... 61 పరుగులు చేసిన రోరీ బర్న్స్ షమీ ఔట్ చేశాడు. తర్వాత కాసేపటికే 68 పరుగులు చేసిన హసీబ్ హమీద్ ను జడేజా ఔట్ చేశాడు.
అయితే డేవిడ్ మలన్ సహకారంతో... కెప్టెన్ జోరూట్ ఇంగ్లండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. డేవిడ్ మలన్ 70 పరుగులు చేయగా... జో రూట్ సెంచరీ కొట్టాడు. 165 బంతుల్లో 121 రన్స్ సాధించాడు రూట్. అయితే డేవిడ్ మలన్ ను సిరాజ్, రూట్ ను బుమ్రా ఔట్ చేయడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే భారత్ కు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత వచ్చిన బెయిర్ స్టో 29, బట్లర్ 7, మోయిన్ అలీ 8, శ్యామ్ కరన్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. క్రెయిన్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, సిరాజ్ 2, జడేజా 2, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
భారత్ పై 345 పరుగుల ఆధిక్యం సాధించింది ఇంగ్లండ్. ఇవాళ ఆ జట్టును తొందరగా ఆలౌట్ చేసినా... భారత్ సాధించాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని అధిగమించి... భారీ స్కోర్ సాధించడం భారత్ కు అసాధ్యమంటున్నారు క్రికెట్ ఎక్స్ పర్ట్స్. వీలైతే మ్యాచ్ ఇవాళే ముగించాలని ఇంగ్లండ్ పట్టుమీదున్నట్టు కనిపిస్తోంది.