- దంచికొట్టిన అభి, సూర్య.. 60 బాల్స్లోనే 154 టార్గెట్ ఛేజ్ చేసిన ఇండియా
- బుమ్రా, బిష్ణోయ్ సూపర్ బౌలింగ్ మూడో టీ20లోనూ కివీస్ చిత్తు
గువాహతి: వన్డే సిరీస్లో ఓటమికి న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్లో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. గత మ్యాచ్లో 15.2 ఓవర్లలో 209 రన్స్ చేసిన సూర్యకుమార్ సేన ఈసారి 10 ఓవర్లోనే 154 టార్గెట్ ఛేజ్ చేసి తమ బ్యాటింగ్ పవర్ చూపెట్టింది. 14 బాల్స్లోనే ఫిఫ్టీతో ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బాల్స్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్) చేసిన విధ్వంసానికి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 నాటౌట్) ఫిఫ్టీతో రాణించడంతో ఆదివారం గువాహతిలో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. ఈ వన్సైడ్ మ్యాచ్లో తొలుత జస్ప్రీత్ బుమ్రా (3/17), రవి బిష్ణోయ్ (2/18) సూపర్ బౌలింగ్ తో విజృంభించంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153/9 స్కోరు మాత్రమే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 48), మార్క్ చాప్మన్ (32), మిచెల్ శాంట్నర్ (27) రాణించారు. హార్దిక్ పాండ్యా (2/23) కూడా రెండు వికెట్లు తీశాడు. అనంతరం అభి, సూర్య మెరుపులతో ఇండియా 10 ఓవర్లలోనే 155/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగో టీ20 వైజాగ్లో బుధవారం జరగనుంది.
బౌలర్ల కట్టడి
ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టి పదేండ్లు పూర్తి చేసుకున్న పేస్ లీడర్ బుమ్రాకు తోడు రీఎంట్రీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ మూడో బాల్కే మిడాఫ్లో హార్దిక్ పాండ్యా పట్టిన స్టన్నింగ్ క్యాచ్కు డెవాన్ కాన్వే (1) ఔటయ్యాడు. రెండో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన హార్దిక్.. షార్ట్బాల్తో రచిన్ రవీంద్ర (4)ను వెనక్కుపంపాడు. ఓ ఎండ్లో గ్లెన్ ఫిలిప్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. సిఫర్ట్ (12)ను ఆరో ఓవర్లో బుమ్రా క్లీన్బౌల్డ్ చేయడంతో కివీస్ 34/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో చాప్మన్ తోడుగా ఫిలిప్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కుల్దీప్ వేసిన 9వ ఓవర్లో 6, 4తో చాప్మన్ వేగం పెంచగా.. ఫిలిప్స్ కూడా సిక్స్ బాదడంతో ఇన్నింగ్స్కు ఊపు వచ్చింది. సగం ఓవర్లకు 75/3తో నిలిచిన కివీస్ మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఇండియా బౌలర్లు మళ్లీ పుంజుకున్నారు. 12వ ఓవర్లో చాప్మన్ను ఔట్ చేసిన బిష్ణోయ్ నాలుగో వికెట్కు 52 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. డారిల్ మిచెల్ను (14)ను పాండ్యా వెనక్కు పంపగా.. మూడు బాల్స్ తర్వాత ఫిలిప్స్ను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చడంతో కివీస్ జోరుకు బ్రేకులు పడ్డాయి. స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ శాంట్నర్ కొన్ని షాట్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. 18వ ఓవర్లో జేమీసన్ (3)ను బౌల్డ్, మాట్ హెన్రీ (1)ని రనౌట్ చేసిన బుమ్రా మూడే రన్స్ ఇచ్చాడు. హర్షిత్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన శాంట్నర్ను లాస్ట్ ఓవర్లో బమ్రా పెవిలియన్ చేర్చగా.. కివీస్ అతి కష్టమ్మీద 150 మార్కు దాటింది.
అభి, సూర్య ధనాధన్
కివీస్ బ్యాటర్లు ఇబ్బంది పడిన వికెట్పై అభిషేక్, సూర్యకుమార్ విజృంభించడంతో లక్ష్యాన్ని ఇండియా
అలవోకగా అందుకుంది. టీ20 వరల్డ్ కప్ ముంగిట అందరి ఫోకస్ ఉన్న ఓపెనర్ సంజూ శాంసన్ (0) మరోసారి ఫెయిలవడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హెన్రీ వేసిన తొలి బాల్నే వికెట్ల మీదకు ఆడుకున్న శాంసన్ గోల్డెన్ డకౌటయ్యాడు. కానీ, ఇది ఆతిథ్య జట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. అదే ఓవర్లో 6, 4, 4తో ఇషాన్ కిషన్ (28) తన ఫామ్ కొనసాగిస్తే.. డఫీ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బాల్కే సిక్స్ కొట్టిన అభిషేక్ తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. జేమీసన్ బౌలింగ్లో 4, 6 కొట్టాడు. దాంతో నాలుగో ఓవర్లోనే కివీస్ స్పిన్నర్ ఇషో సోధీని బౌలింగ్కు దింపింది. అతనికి ఫోర్తో స్వాగతం పలికి స్కోరు ఫిఫ్టీ దాటించిన ఇషాన్ తర్వాతి బాల్కే ఔటయ్యాడు. పవర్ ప్లేలో తన ధాటిని కొనసాగించిన అభి.. హెన్రీ బౌలింగ్లో సిక్స్, డఫీ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్తో 14 బాల్స్లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. మరో ఎండ్లో కెప్టెన్ సూర్యకుమార్ కూడా వేగంగా ఆడటంతో 6.3 ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. ఇటు అభి, అటు సూర్య పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు కొట్టడంతో కివీస్ బౌలర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఫిలిప్స్ బౌలింగ్లో సూర్య 6, 4, 4 తో సూర్య ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు పదో ఓవర్లోనే మ్యాచ్ ముగించాడు. సూర్య, అభి మూడో వికెట్కు అజేయంగా 102 రన్స్ జోడించారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 153/9 (గ్లెన్ ఫిలిప్స్ 48, చాప్మన్ 32, బుమ్రా 3/17, బిష్ణోయ్ 2/18)
ఇండియా: 10 ఓవర్లలో 155/2 (అభిషేక్ 68 నాటౌట్, సూర్య 57 నాటౌట్, హెన్రీ 1/28).
ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై 150 ప్లస్ టార్గెట్ను ఎక్కువ బాల్స్ (60) మిగిలుండగానే ఛేజ్ చేసిన టీమ్గా ఇండియా రికార్డుకెక్కింది.
టీ20ల్లో సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (14 బాల్స్లో) చేసిన ఇండియన్ అభిషేక్. యువరాజ్ సింగ్ 2007లో ఇంగ్లండ్పై 12 బాల్స్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు.
టీ20ల్లో ఇండియాకు ఇది వరుసగా 11వ సిరీస్ విజయం. వరుసగా ఎక్కువ సిరీస్లు నెగ్గిన పాక్ రికార్డును సమం చేసింది. స్వదేశంలో వరుసగా 10 సిరీస్లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.
