న్యూఢిల్లీ: గ్లోబల్గా ఐటీ కంపెనీలు ఇబ్బందులు పడుతుంటే లోకల్ కంపెనీలయిన ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్లు దుమ్ములేపాయి. ఎనలిస్టుల అంచనాలను అందుకోవడమే కాకుండా, క్యూ4 లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తామనే గైడ్లైన్స్ ప్రకటించాయి. మార్కెట్ను ఆశ్చర్య పరిచాయి. టీసీఎస్ ఇప్పటికే తన డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించగా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ గురువారం తమ ఫలితాలను విడుదల చేశాయి.
ఇన్ఫోసిస్కు అడ్డేలేదు..
ఇన్ఫోసిస్ రెవెన్యూ డిసెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ3 ) లో రూ.38,318 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే ఈసారి కంపెనీ రెవెన్యూ 20.2 శాతం ఎగిసింది. ఇది ఎనలిస్టులు అంచనావేసిన రూ.37,965 కోట్ల కంటే ఎక్కువ. నికర లాభం క్యూ3 లో 13.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ 16–16.5 శాతం పెరుగుతుందనే గైడ్లైన్స్ను ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2022–23 లో రెవెన్యూ 15–16 శాతం పెరుగుతుందని గతంలో ఈ ఐటీ కంపెనీ గైడ్లైన్స్ విడుదల చేసింది. గ్లోబల్గా రెసిషన్ భయాలు ఉన్నప్పటికీ, ఇన్ఫోసిస్ తన గైడ్లైన్స్ను మెరుగుపరచడం విశేషం. ఆపరేటింగ్ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21–22 శాతంగానే ఉంటుందని వివరించింది. కంపెనీ రెవెన్యూ క్వార్టర్లీ పరంగాక్యూ3 లో 2.4 శాతం వృద్ధి చెందింది.
డీల్స్ పెరిగాయ్..
డిసెంబర్ క్వార్టర్లో ఐటీ కంపెనీలు ఇబ్బంది పడినా, ఇన్ఫోసిస్ మాత్రం 3.3 బిలియన్ డాలర్ల (రూ.27 వేల కోట్ల) విలువైన డీల్స్ను సొంతం చేసుకుంది. గత ఎనిమిది క్వార్టర్లలో ఇదే హయ్యస్ట్. తమ రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ను నమోదు చేసిందని, డిజిటల్ బిజినెస్, కీలకమైన సర్వీసెస్ బిజినెస్ కూడా వృద్ధి చెందిందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. క్లయింట్స్కు పారదర్శకమైన, నమ్మదగ్గ పార్టనర్గా ఉన్న తాము, మార్కెట్లో వాటా పెంచుకుంటున్నామని వివరించారు. డీల్స్ పెరగడం ఇందుకు నిదర్శనమని అన్నారు. సాధారణంగా క్యూ3 లో ఐటీ కంపెనీలకు బిజినెస్ తగ్గినప్పటికీ, ఖర్చులను తగ్గించుకోవడం వలన తమ ఆపరేటింగ్ మార్జిన్స్ నిలకడగా ఉన్నాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. అట్రిషన్ (ఉద్యోగులు జాబ్ మానేయడం) క్యూ3 లో తగ్గిందని, రానున్న క్వార్టర్లలో కూడా తగ్గుతుందని అన్నారు. యూఎస్, కెనడా వంటి నార్త్ అమెరికా మార్కెట్ (రెవెన్యూ 10% అప్) , యూరప్ మార్కెట్ (13.6% అప్) లలో బిజినెస్ బాగుందని ఇన్ఫోసిస్ పేర్కొంది.
హెచ్సీఎల్ రిజల్ట్స్ అదుర్స్..
టాప్ 3 ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్ కూడా క్యూ3 లో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. కంపెనీ నికర లాభం డిసెంబర్ క్వార్టర్లో రూ.4,096 కోట్లకు ఎగిసింది. ఇది 2021 , డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.3,442 కోట్లతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. కంపెనీ రెవెన్యూ (కన్సాలిడేటెడ్) 19.61 శాతం పెరిగి రూ. 26,700 కోట్లకు చేరుకుంది. కంపెనీ రెవెన్యూ క్యూ3 లో రూ.26,026 కోట్లుగా, నికర లాభం రూ.3,796 కోట్లుగా రికార్డవుతుందని ఎనలిస్టులు అంచనావేశారు. హెచ్సీఎల్ టెక్ రెవెన్యూ క్వార్టర్లీ ప్రాతిపదికన 5 శాతం వృద్ధి సాధించింది. డిసెంబర్ క్వార్టర్లో ఈ ఐటీ కంపెనీ 2.35 బిలియన్ డాలర్ల (రూ. 19 వేల కోట్ల) విలువైన డీల్స్ను దక్కించుకుంది. షేరుకి రూ.10 ఇంటెరిమ్ డివిడెండ్గా ఇచ్చేందుకు హెచ్సీఎల్ టెక్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఇందుకు ఈ నెల 20 రికార్డ్ డేట్. ఫిబ్రవరి 1 న డివిడెండ్ చెల్లిస్తారు. ‘రెవెన్యూ , మార్జిన్, డీల్స్ వంటి అన్ని సెగ్మెంట్లలో మంచి పెర్ఫార్మెన్స్ చేశాం’ అని హెచ్సీఎల్ టెక్ సీఈఓ సీ విజయకుమార్ అన్నారు. తమ సర్వీసెస్ బిజినెస్ పెరగడం వలన రెవెన్యూ పెరిగిందని అన్నారు. డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ అట్రిషన్ రేట్ 19.8 శాతంగా నమోదయ్యింది. కాగా, టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్ రెవెన్యూ కూడా డిసెంబర్ క్వార్టర్లో 19 శాతం పెరిగి (ఏడాది ప్రాతిపదికన) రూ.58,229 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ నికర లాభం 11 శాతం ఎగిసి రూ.10,883 కోట్లుగా రికార్డయిన విషయం తెలిసిందే.