
కాగజ్ నగర్, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేదని ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో జరిగింది. ఎస్ఐ కమలాకర్ తెలిపిన ప్రకారం.. మేడిపల్లి పంచాయతీ పరిధి లింబుగూడ గ్రామానికి చెందిన సూర్పం యాదవ్ ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు శేఖర్(17) ఇటీవల ఆసిఫాబాద్ లోని పీటీజీ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ లో జాయిన్ అయ్యాడు. ఈనెల 11న అతడు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లి దిగులుగా ఉంటున్నాడు.
తనకు చదువు ఇష్టం లేదని, కాలేజీకి వెళ్లనని చెప్పడంతో తల్లిదండ్రులు చదువుకుంటే జీవితం బాగుంటుందని నచ్చజెప్పారు. మంగళవారం ఉదయం శేఖర్ గ్రామ శివారులో టాయిలెట్ కు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి వెతికారు. చేనులోని వేప చెట్టుకు తాడుతో ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.