- మేరీకోమ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఐవోఏ
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వచ్చిన లైంగిక ఆరోపణలను విచారించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఏడుగురితో కమిటీ వేసింది. మేరీకోమ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో యోగేశ్వర్ దత్, డోలా బెనర్జీ, సహదేవ్ యాదవ్, అలక్నందా అశోక్, నీలాంజన్ భట్టాచార్య (అడ్వకేట్)ఉన్నారు. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐవోఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ పీటీ ఉష, జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ చౌబేతో పాటు అభినవ్ బింద్రా, యోగేశ్వర్ ఈ మీటింగ్కు హాజరయ్యారు. అయితే కమిటీ ఎప్పటిలోగా విచారణ పూర్తి చేయాలన్న దానిపై ఎలాంటి గడువును నిర్దేశించలేదు. ప్రస్తుతానికి బ్రిజ్ భూషణ్, రెజ్లర్ల మధ్య నడుస్తున్న గొడవకు ఫుల్స్టాప్ పెట్టి, ధర్నాను విరమించేందుకు కమిటీ ప్రయత్నించనుంది. తాము ప్రతి ఒక్కరి వాదనలను వింటామని, పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సహదేవ్ యాదవ్ స్పష్టం చేశాడు. వేధింపులకు గురైన ప్లేయర్ల పేరు చెబితే.. కమిటీ ప్రత్యక్షంగా వాళ్లను కలువనుంది. అయితే వీటిని రహస్యంగా ఉంచనున్నారు. అన్ని అంశాలను కమిటీ పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేస్తుందని ఉష రెజ్లర్లకు హామీ ఇచ్చింది.
నేను దిగను: బ్రిజ్
మరోవైపు తాను ప్రెసిడెంట్ పోస్ట్కు రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశాడు. తనకు ఈ పదవి ఎవరి దయతో రాలేదని ఘాటుగా స్పందించాడు. రెజ్లర్ల ధర్నా వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్న బ్రిజ్.. దీన్ని షహీన్ భాగ్ నిరసనలతో పోల్చాడు. ‘అన్ని అంశాలను పబ్లిక్లోకి తీసుకొస్తే భూకంపం వస్తుందని రెజ్లర్లు చెబుతున్నారు. కానీ నేను నోరు విప్పితే సునామీ వస్తుంది’ అని బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించాడు.