పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం విజయవంతం

ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్  ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులోని సింక్రోనస్ ఆర్టిట్లోకి వాటిని పంపారు. 960 కేజీల ఓషన్‌ శాట్-6తో పాటు మరో 8 నానో శాటిలైట్లు ఇందులో ఉన్నాయి. భూటాన్‌కు చెందిన ఓ శాటిలైట్ 'భూటాన్‌ శాట్' కూడా ఇందులో ఉంది.

శుక్రవారం ఉదయం 10:26 గంటలకు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అర్ముగం రాజరాజన్ కౌంట్ డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రమే రాకెట్ లోని నాల్గో దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత అన్ని పరీక్షలు నిర్వహించారు. రాత్రి 10 గంటల తర్వాత రాకెట్ రెండో దశకు అవసరమైన లిక్విడ్ ప్యూయెల్ నింపారు. దాదాపు 25గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 11 :56 గంటలకు ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ను నింగిలోకి పంపారు. 

ప్రయోగంలో భాగంగా ముందుగా ప్రధాన శాటిలైట్ ఓషియన్ శాట్–6ను 742 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్1లోకి చేర్చింది. అనంతరం రాకెట్ కిందకు దిగుతూ 516  నుంచి 528 కిలోమీటర్ల మధ్య ఆర్బిట్2లో మిగతా ప్యాసింజర్ శాటిలైట్లను వేర్వేరుగా విడిచిపెట్టింది. ఇలా వేర్వేరు ఆర్బిట్లలోకి శాటిలైట్లను చేర్చడం కోసం రాకెట్ కు ప్రత్యేకంగా రెండు ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్లను అమర్చారు. ఇది పీఎస్ఎల్వీ రాకెట్ కు 56వ మిషన్ కాగా, పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ వెర్షన్ లో 24వ ప్రయోగం.

ఓషియన్ శాట్–2 స్థానంలో సేవలు అందించేందుకు ఓషియన్ శాట్–6 శాటిలైట్ను ఇస్రో పంపింది. ఇది సముద్రపు రంగు, గాలులు, ఇతర అంశాలకు సంబంధించిన డేటాను నిరంతరం అందించనుంది. మిగతా 8 ఉపగ్రహాల్లో ‘ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్ (ఐఎన్ఎస్2బీ)’, బెంగళూరుకు చెందిన పిక్సెల్ ఇండియా స్టార్టప్ కంపెనీకి చెందిన ‘ఆనంద్’, హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘ధ్రువ స్పేస్’కు చెందిన రెండు ‘థైబోల్ట్’ నానో శాటిలైట్లు, అమెరికన్ కంపెనీ స్పేస్ ఫ్లైట్కు చెందిన నాలుగు ‘ఆస్ట్రోక్యాస్ట్’ నానో శాటిలైట్లను నింగిలోకి పంపారు.