- కొన్ని కంపెనీల్లో ఇంక్రిమెంట్ల విధానాల్లో మార్పులు
- ఖర్చులు తగ్గించుకునేందుకు ఫ్రెషర్ల నియామకాలు
న్యూఢిల్లీ: సీనియర్ ఎంప్లాయీస్ జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం పెడుతున్న ఖర్చులు తడిసిమోపెడు అవుతుండటంతో ఐపీ కంపెనీలు ఫ్రెషర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫ్రెష్ ట్యాలెంట్ కోసం కాలేజీల్లో వేట మొదలుపెట్టాయి. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కొన్ని విభాగాల ఉద్యోగులకు వేరియబుల్ శాలరీని తగ్గించాయి లేదా నిలిపివేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దాని వేతన పెంపు పద్ధతులను మార్చింది. భారీగా ఉద్యోగులను తీసుకునే మైండ్ట్రీ, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీల్లోనూ సీనియర్ల సంఖ్య తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి.
లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్ వంటి కొన్ని ఐటీ కంపెనీలు ఇటీవల సిబ్బందికి రివార్డ్లు ఇచ్చాయి. అయినప్పటికీ మైడ్సైజ్ కంపెనీలు 2023 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు కాగ్నిజెంట్, నగరాల్లో క్యాంపస్ నియామకా కోసం తాము వెళ్లే కాలేజీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ 2022లో భారతదేశం నుండి 50 వేల మంది ఫ్రెషర్లను తీసుకోవడానికి రెడీ అవుతోంది. ఇంతగా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి. “మేం భారత్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ను తిరిగి స్టార్ట్ చేశాం.
మా తాజా నియామకాలలో ఎక్కువగా క్లౌడ్, ఏఐ, అనలిటిక్స్, ఐఓటీ, డిజిటల్ ఇంజనీరింగ్కు సంబంధించిన జాబ్స్ ఉంటాయి. వీరిలో ఎక్కువ మందిని ఇంజనీరింగ్ కాలేజీల నుంచి తీసుకుంటాం” అని కాగ్నిజెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను ఝా అన్నారు. మిడ్-సైజ్ ఐటీ సంస్థ మైండ్ట్రీ 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5,000–-6,000 క్యాంపస్ స్టూడెంట్లను తీసుకోవాలని భావిస్తోంది. లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్ గత ఏడాది కంటే 10 శాతం ఎక్కువ ఫ్రెషర్లను రిక్రూట్ చేయనుంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనన్ని జాబ్స్ ఇవ్వనుంది.
ఎక్స్పర్టులు ఏమంటున్నారంటే..
ఐటీ కంపెనీలకు ప్రస్తుతం పరిస్థితులు అనువుగా లేకపోయినా గ్రోత్మాత్రం ఆగదని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అన్నారు. ఎక్కువ మంది ఫ్రెషర్లను తీసుకోవడం ద్వారా కంపెనీలు అట్రిషన్ను (రాజీనామాలు) తట్టుకోగలుగుతాయని, అందుకే ఇవి క్యాంపస్ నియామకానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ‘‘పెద్ద కంపెనీలు గతేడాది చాలా జాబ్స్ఇచ్చాయి. మిడ్-టైర్ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున టాలెంట్ పూల్ను నిర్మించాలి.
క్యాంపస్ హైర్లకు కూడా కొత్త టెక్నాలజీలపై ట్రైనింగ్ఇస్తాయి”అని గుప్తా చెప్పారు. తక్కువ ఖర్చుతో ట్యాలెంట్ను సమర్థంగా వాడుకోవాలంటే ప్రస్తుత వర్క్ఫోర్స్కి తాజా గ్రాడ్యుయేట్లను చేర్చడం తప్పనిసరని మైండ్ట్రీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ సురేష్ బెతవాండు అన్నారు. ఏ పెద్ద సంస్థ అయినా గ్రోత్ని కొనసాగించేందుకు ట్యాలెంట్పూల్ను బలోపేతం చేయాలని, ఇందుకు క్యాంపస్ నియామకం అవసరమని ఎల్&టీ ఇన్ఫోటెక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నచికేత్ దేశ్పాండే అన్నారు. ఇది 2021–-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5,500 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ సంవత్సరం దాదాపు 6,000 మందిని తీసుకోనుంది.
తమ వద్ద డిజిటల్, క్లౌడ్, డేటా, అనలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, యూఐ/యూఎక్స్ డొమైన్లో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా, అనలిటిక్స్ సేవల కోసం కూడా కేండిడేట్లను తీసుకుంటామని దేశ్పాండే చెప్పారు. ఐటీ కంపెనీలు తమ బిజినెస్ను టైర్ 2, 3 నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి. “ఫ్రెషర్ హైరింగ్ని పెంచడానికి దేశవ్యాప్తంగా మరిన్ని కాలేజీలతో మాట్లాడాం. భోపాల్, జబల్పూర్, డెహ్రాడూన్, పూణే, భువనేశ్వర్, జలంధర్, జంషెడ్పూర్, లక్నో మంగళూరులో మా నియామకాలు ఉంటాయి ”అని ఎంఫసిస్ సీహెచ్ఆర్ఓ శ్రీకాంత్ కర్రా అన్నారు.
టెక్ మహీంద్రా కూడా టైర్2, టైర్3 నగరాల నుండి ఫ్రెషర్లను తీసుకుంటోంది. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 వేల మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇంతే సంఖ్యలో జాబ్స్ఇవ్వనుంది. అన్ని స్థాయిలలో నియామకాలను పెంచుతున్నామని, ‘స్టెమ్’ కోర్సుల స్టూడెంట్లనూ నియమిస్తున్నామని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ చెప్పారు.