జైపూర్: ఒక మహిళను గ్యాంగ్రేప్ చేసిన దోషులను చనిపోయేంత వరకు జైలులోనే ఉంచాలని రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటనను వీడియో తీసి షేర్ చేసిన మరో వ్యక్తికి కనీసం ఐదేళ్లు జైలులో ఉంచాలని చెప్పింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మైనర్పై జువైనల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హన్రాజ్ గుర్జర్, అశోక్ గుర్జర్, ఛోతేలాల్ గుర్జర్, ఇంద్రజ్ గుర్జర్లను దోషులుగా నిర్ధారించింది. పోయిన ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దోషులపై ఇండియన్ పీనల్ కోడ్, ఎస్సీ, ఎస్టీ, ఐటీ యాక్ట్లలోని రిలవెంట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుల్దీప్ జైన్ చెప్పారు. పదేపదే లైంగిక దాడికి పాల్పడిన హన్స్రాజ్పై అదనపు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తెలిపారు. తన భర్త ముందే ఒక మహిళను నలుగురు వ్యక్తులు గ్యాంగ్రేప్ చేసి, డబ్బులు దోచుకున్న సంఘటన ఘటన రాజస్థాన్లోని తనగజి ఆల్వార్ బైపాస్లో పోయిన ఏడాది ఏప్రిల్లో జరిగింది.
తీర్పును స్వాగతించిన సీఎం అశోక్ గెహ్లాట్
అల్వార్ గ్యాంగ్రేప్ దోషులను చనిపోయే వరకు జైలులోనే ఉంచాలని ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. కేసు విచారణ వేగంగా పూర్తి చేసి శిక్ష విధించడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ అని ట్వీట్ చేశారు.