దక్షిణ కొరియాలో రీసెర్చ్​ ప్రొఫెసర్​గా మెదక్ యువకుడు

దక్షిణ కొరియాలో రీసెర్చ్​ ప్రొఫెసర్​గా మెదక్ యువకుడు

స్కూల్లో చదివే రోజుల నుంచే సైన్స్​ సబ్జెక్ట్  మీద ఇష్టం పెంచుకున్నాడు. అబ్దుల్ కలాంను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఆయనలా సైంటిస్ట్​ అవ్వాలని అనుకున్నాడు.  అందరూ కష్టమైన సబ్జెక్ట్​ అనుకునే ఫిజిక్స్​ని ఇష్టంగా చదవడమే కాకుండా, అందులోనే పీహెచ్​డీ కూడా చేశాడు. ఫిజిక్స్​లో  కొత్త రీసెర్చ్​లు చేస్తూ ఇంటర్నేషనల్​ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు జక్కపల్లి పుండరీకం గౌడ్. మెదక్​ జిల్లాలోని  చిలప్​చెడ్​ మండలంలో ఉన్న అంతారం ఇతని సొంతూరు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో రీసెర్చ్​ ప్రొఫెసర్​గా పని చేస్తున్నాడు. మారుమూల పల్లెటూరు నుంచి దక్షిణ కొరియా వరకు వెళ్లిన అతని రీసెర్చ్​ జర్నీ ఇది...

‘‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ పేరు లక్ష్మమ్మ, నాన్న అంజా గౌడ్​. నాకు ముగ్గురు అన్నలు, ఒక అక్క. పదో క్లాస్​ వరకు గవర్నమెంట్​ స్కూల్లోనే చదివాను.   హైస్కూల్​​ నుంచే  సైన్స్​ సబ్జెక్ట్​ మీద, ఎక్స్​పరిమెంట్స్​ మీద  ఇంట్రెస్ట్​ ఉండేది. ఇంటర్​లో ఎంపీసీ తీసుకున్నా. ‘కలలు కనండి. వాటిని నిజం చేసుకోండి’ అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఆయన్నే ఇన్​స్పిరేషన్​గా తీసుకొని సైంటిస్ట్​ అవ్వాలని డిసైడ్​ అయ్యా. డిగ్రీ తర్వాత హైదరాబాద్​లోని సైఫాబాద్​ సైన్స్​ కాలేజీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్​ చదివా.  పాండిచ్చేరి సెంట్రల్​ యూనివర్సిటీలో ఎం.ఫిల్ చదివేటప్పుడు అక్కడి ప్రొఫెసర్లు రీసెర్చ్​ వైపు నన్ను ఎంకరేజ్​ చేశారు.  

లేజర్​ టెక్నాలజీ సాయంతో...

ఎంఫిల్​ తర్వాత హైద్రాబాద్​లోని సెంట్రల్​ యూనివర్సిటీలో పీహెచ్​డీ జాయిన్​ అయ్యా. ప్రొఫెసర్​ కేసీ. జేమ్స్​రాజ్ నాకు గైడ్​. ​నా పీహెచ్​డీ టాపిక్ ఏమిటంటే... లేజర్​ టెక్నాలజీ ఉపయోగించి బేరియం, స్ట్రాన్షియం, టైటానియం వంటి మూలకాల్ని తక్కువ ఉష్ణోగ్రత దగ్గర క్రిస్టలైజ్​ చేయడం. సబ్జెక్ట్​ పుస్తకాలు చదవడం, ల్యాబ్​లోఎక్స్​పరి​మెంట్స్​ చేయడం, ఆర్టికల్స్​ రాయడం.. పీహెచ్​డీలో ఇదే నా దినచర్య. 

పేటెంట్​కోసం...

గైడ్  జేమ్స్​ రాజ్​ఆధ్వర్యంలో మా రీసెర్చ్​ టీం బేరియం, స్ట్రాన్షియం​, టైటానెట్​ (బి.ఎస్​.టి) పల్చని ఫిల్మ్​లను తక్కువ ఉష్ణోగ్రతలో లేజర్​ టెక్నాలజీ సాయంతో క్రిస్టలైజ్​ చేశాం. దాంతో వీటిని మైక్రోవేవ్​ ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేసే ఎలక్ట్రానిక్​ పరికరాలకు, కెపాసిటర్​ల అనువర్తనాలకు పనికొచ్చే విధంగా తయరు చేశాం. ట్యూనబుల్​ మైక్రోవేవ్​ పరికరాల కోసం ఫెర్రో ఎలక్ట్రిక్​ పల్చని ఫిల్మ్​ను 300 డిగ్రీల సెంటిగ్రేడ్​ దగ్గర లేజర్​ సాయంతోక్రిస్టలైజ్​ (స్పటికీకరించడం) చేశాం. మా ఇన్నొవేషన్​కు ఇండియా పేటెంట్​ రైట్స్​ కోసం అప్లై చేశాం. ఈ రీసెర్చ్​కు సంబంధించి నేను రాసిన ఆర్టికల్​ 20 ఇంటర్నేషనల్​ జర్నల్స్​లో పబ్లిష్​ అయింది. పోయిన ఏడాదే థీసిస్​ సబ్మిట్​ చేసి, డాక్టరేట్​ పట్టా సాధించాను. 

రెండు లక్షలు అప్పు చేసి...

పీహెచ్​డీ అవ్వగానే దక్షిణ​ కొరియాలోని యంగ్​నమ్​ యూనివర్సిటీలో పోస్ట్​ డాక్టోరల్​ ఫెలోగా (పీడీఎఫ్​) అడ్మిషన్​ రావడంతో ఎగిరి గంతేశా. కానీ, అక్కడికి వెళ్లేందుకు వీసా, ఫ్లైట్​ టికెట్, అక్కడ రూం కోసం రెండు లక్షల రూపాయలు అవసరం అయ్యాయి. దాంతో, అప్పుచేయక తప్పలేదు. ఇప్పుడు  రీసెర్చ్​ ప్రొఫెసర్​గా నెలకు లక్ష రూపాయల పైనే సంపాదిస్తున్నా.  దక్షిణ కొరియా వెళ్లేందుకు చేసిన అప్పు కూడా తీర్చాను. పోయిన ఏడాది నవంబర్​లో అక్కడి ​ మెటీరియల్​ సైన్స్​ అండ్​ ఇంజనీరింగ్ స్కూల్లో రీసెర్చ్​ ప్రొఫెసర్​గా చేరాను. ఎలక్ట్రికల్​ ప్రాపర్టీస్​ మెజర్​మెంట్స్​ సిస్టం, కెపాసిటర్స్​, సెన్సర్స్, ఎనర్జీ హార్వెస్టింగ్​ వంటి అప్లికేషన్స్​ మీద రీసెర్చ్​ చేస్తున్నా. చిన్నప్పటి నుంచి నేను చదువులో ఎప్పుడూ  ఫస్ట్​ ఉండటంతో ‘నీకు నచ్చింది చదువుకో బిడ్డా’ అన్నారు అమ్మానాన్న. నన్ను బాగా చదివించేందుకు చాలా కష్టపడ్డారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికి డెడికేషన్, హార్డ్​వర్క్​తో ఈ పొజిషన్​కి వచ్చా. రీసెర్చర్​గా సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారుచేయాలన్నదే నా లక్ష్యం.

::: తిమ్మన్నగారి శ్రీధర్​, మెదక్​, వెలుగు.