ఒక వస్తువు ఒక చోట నుంచి మాయమై మరో చోట ప్రత్యక్షమవడం చాలా తెలుగు సినిమాల్లో చూశాం. అయితే.. సినిమాల్లో అది మాయగానో, మ్యాజిక్లాగానో చూపిస్తారు. కానీ.. ఇక్కడ అలాంటిది నిజంగానే జరిగిందట. అమెరికా చేసిన ఒక ప్రయోగం వల్ల వందల కిలోల బరువు ఉండే ఒక షిప్ మాయమై 500 కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షమైంది. అదెలా జరిగింది?ఆ ప్రయోగం అమెరికా ఎందుకు చేసింది? ఇంతకీ ప్రయోగం సక్సెస్ అయ్యిందా?ఫెయిల్ అయ్యిందా?
అది 28 అక్టోబరు1943. సరిగ్గా సాయంత్రం 5:15 గంటలకు.. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్ ‘‘యూఎస్ఎస్ఎస్ ఎల్ర్డిడ్జ్’’ ఫిలడెల్ఫియా ఓడరేవులో ఉంది. లంగరు వేసి ఉన్న ఆ షిప్ నుంచి ఒక్కసారిగా నీలి రంగు కాంతి రావడం మొదలైంది. ఆ కాంతిలో ఓడ కూడా సరిగ్గా కనిపించడం లేదు. కొన్ని నిమిషాలు ఆ వెలుగు అలాగే ఉంది. కాసేపటి తరువాత ఆ కాంతితో పాటు షిప్ కూడా మాయమైంది. అక్కడున్న వాళ్లంతా అసలేం జరిగిందో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతానికి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్ఫోక్ ప్రాంతంలో షిప్ కనిపించింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి నుంచి కూడా మాయమై ఫిలడెల్ఫియాకు తిరిగొచ్చింది. నిమిషాల్లో వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయడం ఎలా సాధ్యమైంది? అనేది ఇప్పటికీ మిస్టరీనే.
అమెరికా ఇంత పెద్ద ప్రయోగం చేసినా.. ఎవరికీ తెలియదు. అంతేకాదు.. ఈ ప్రయోగం జరిగిన పన్నెండేండ్లకు దీని గురించి ప్రపంచానికి తెలిసింది. అమెరికాలో అలెన్ అనే ఒక ఎక్స్మర్చంట్ మెరైనర్ ఈ ఎక్స్పర్మెంట్ని చూసినట్లు చెప్పాడు. అతనే దీని గురించి వివరించాడు. అతను చెప్పిన దాని ప్రకారం.. యూఎస్ నావికాదళం ‘యూఎస్ఎస్ఎస్ ఎల్డ్రిడ్జ్’ అనే ఒక డిస్ట్రాయర్ ఎస్కార్ట్ క్లాస్ షిప్తో టెలీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పరిమెంట్స్ చేసింది. కొంతమంది సైంటిస్ట్లు షిప్ని మాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ.. ఊహించని ఫలితాలు రావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఎక్స్పరిమెంట్ని ఆపేశారు. అలెన్ చెప్పిన ఈ వివరాలన్నీ అవాస్తవాలని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.
టెలీ ట్రాన్స్పోర్టేషన్
ఈ ప్రయోగం కోసం ఎంతోమంది గొప్ప సైంటిస్ట్లు పనిచేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనిపెట్టి, ప్రపంచానికి చెప్పని కొన్ని సూత్రాల ద్వారా ఈ ప్రయోగం చేసినట్టు చెప్తుంటారు. కొందరైతే ఈ ప్రయోగానికి కొన్ని నెలల ముందు చనిపోయిన నికోలా టెస్లా ప్రత్యక్షంగా ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్నట్టు చెప్పారు. అదెలాగో వాళ్లకే తెలియాలి! టెలీ ట్రాన్స్పోర్టేషన్ అంటే.. ఒక వస్తువును క్షణాల్లో ఒకచోట నుంచి మాయం చేసి, మరో చోట ప్రత్యక్షమయ్యేలా చేయడం. అయితే.. ఈ థియరీని ఇప్పటివరకు పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప, ప్రయోగం చేసి సక్సెస్ అయినవాళ్లు ఎవరూ లేరు. ఈ షిప్ టెలీ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీతో ప్రయాణించేటట్టు సైంటిస్ట్లు ప్రయోగాలు చేశారు. ఎందుకంటే.. యుద్ధాలు జరిగినప్పుడు ఈ షిప్లో శత్రువులు ఉండే ప్లేస్కి వెళ్లి, అక్కడ సైన్యాన్ని, షిప్లను ధ్వంసం చేసి క్షణాల్లో మళ్లీ తిరిగి వచ్చేయొచ్చు. శత్రు దేశాలు దాడి చేసినప్పుడు ఉన్నచోటి నుంచి క్షణాల్లో మాయమైపోవచ్చు. అందుకే అమెరికా ఈ ఎక్స్పరిమెంట్ చేయించిందట. దీనికి ఫ్రాంక్లిన్ రెనో అనే సైంటిస్ట్ నాయకత్వం వహించాడని చెప్పుకుంటుంటారు.
అసలేం జరిగింది?
అలెన్ చెప్పినదాని ప్రకారం.. ప్రయోగం చేసినప్పుడు ఈ డిస్ట్రాయర్ షిప్ కొన్ని నిమిషాల పాటు నార్ఫోక్ ప్రాంతానికి టెలీపోర్ట్ అయ్యింది. మళ్లీ కాసేపటికి ఫిలడెల్ఫియా యార్డ్లో కనిపించింది. కొందరు ఈ షిప్ కొన్ని నిమిషాల పాటు స్పేస్, టైమ్లో ప్రయాణించిందని కూడా చెప్తున్నారు. షిప్ తిరిగి వచ్చాక చూస్తే.. సిబ్బంది మతిస్థిమితం కోల్పోయారు. చాలారకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. షిప్లో ఉన్నవాళ్లలో కొందరు కనిపించకుండా పోయారు. అందుకే నావికాదళం ఈ ప్రయోగాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంది. తర్వాత అమెరికా కూడా ప్రయోగం గురించి దాచేసిందనే కథనాలు ఉన్నాయి.
పాపులారిటీ
వాస్తవానికి ఈ ప్రయోగం జరిగిందా? లేదా? అనేదాని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయినా.. ఈ స్టోరీ బాగా పాపులర్ అయ్యింది. చాలామంది అలెన్ చెప్పిన విషయాలు నమ్మారు. కొంతమంది జర్నలిస్టులు ఎల్డ్రిడ్జ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. కొంతమంది ఈ స్టోరీపై డాక్యుమెంటరీలు తీశారు. “ది ఫిలడెల్ఫియా ఎక్స్పరిమెంట్” పేరుతో స్టీవర్ట్ రాఫిల్ అనే డైరెక్టర్1984లో ఒక హాలీవుడ్ సినిమా కూడా తీశాడు. ఇది బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. తర్వాత ‘‘ది ఫిలడెల్ఫియా ఎక్స్పరిమెంట్ 2” కూడా వచ్చింది. దీనిపై నవలలు కూడా పబ్లిష్ చేశారు.