న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్లో రిలయన్స్ డీమెర్టర్ హాట్ టాపిక్గా మారింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మార్కెట్లో లిస్ట్ కానుండడంతో ఇన్వెస్టర్ల చూపు ఈ కంపెనీలపై పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నుంచి డీమెర్జ్ చేసి, అర్హులైన షేర్హోల్డర్లకు జియో ఫైనాన్షియల్ షేర్లను అలాట్ చేయనున్నారు. ఈ షేర్లు సెకండరీ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ను సపరేట్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు ఇచ్చింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జర్ చేయడంలో ఈ నెల 20 వ తేదీని రికార్డ్ డేట్గా నిర్ణయించారు. అంటే ఈ తేదీ నాటికి ఆర్ఐఎల్ షేర్లు ఉన్న షేర్హోల్డర్లకు రిలయన్స్ స్ట్రాటజిక్ షేర్లు అలాట్ అవుతాయి. ఆ తర్వాత రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్గా పేరు మార్చుతారు.
ఒక ఆర్ఐఎల్ షేర్ ఉన్న షేర్హోల్డర్కు ఒక రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ షేరును అలాట్ చేస్తారు. కాగా, ఈ డీమెర్జర్పై ఈ ఏడాది మార్చిలో ఆర్ఐఎల్ ప్రకటన చేసింది. అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి ఎండీ అండ్ సీఈఓగా హితేష్ కుమార్ సేథిని మూడేళ్ల కాలానికి నియమించింది. మాజీ యూనియన్ హోమ్ సెక్రెటరీ రాజీవ్ మహర్షిని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ సీఈఓ సునిల్ మెహతాని కంపెనీ బోర్డులో అదనపు డైరెక్టర్లుగా నియమించింది. ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి ఆర్బీఐ, కంపెనీ షేర్ హోల్డర్ల నుంచి అనుమతులు రావాలి.
జియో ఫైనాన్షియల్ షేరు ఇంత..!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర రూ.179 దగ్గర ఉండొచ్చని బ్రోకరేజి కంపెనీ జెఫరీస్ పేర్కొంది. మరో ఫైనాన్షియల్ కంపెనీ జేపీ మోర్గాన్ ఈ కంపెనీ షేరు ధర రూ.189 ఉండొచ్చని అంచనావేసింది. ప్రస్తుతం కంపెనీ అసెట్ వాల్యూని బట్టి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ధరను బ్రోకరేజి కంపెనీలు అంచనావేస్తున్నాయని ప్రాఫిట్మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ అన్నారు. షేర్లు లిస్టింగ్ అయ్యే ముందు వాల్యూ ఇన్వెస్టర్ ఎవరైనా కంపెనీలో జాయిన్ అయితే షేర్ల వాల్యూ మారొచ్చని చెప్పారు. వాల్యూ ఇన్వెస్టర్లు జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అర్హులైన షేర్ హోల్డర్లకు కంపెనీ డీమెర్జర్ మంచి లాభాలను ఇస్తుందని అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం సెషన్లో రూ.2,629 దగ్గర క్లోజయ్యాయి. గత ఐదు రోజుల్లో ఈ కంపెనీ షేర్లు 3% పెరగగా, నెల రోజుల్లో 6 % పెరిగింది.