
'RRR' సినిమాతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ), 'వార్ 2' ( War 2) చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన హృతిక్ రోషన్ ( Hrithik Roshan )తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో, లండన్లోని ఎన్టీఆర్ అభిమానులు ఓ అసాధారణమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యుద్ధ ట్యాంకులతో ర్యాలీ..
'వార్ 2' విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, లండన్లోని ఎన్టీఆర్ అభిమానులు సరికొత్త ప్రచారానికి తెర తీశారు.. ఇందులో రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన అసలైన యుద్ధ ట్యాంకులను ఒక నిజమైన యుద్ధ క్షేత్రంలో నడిపి తమ అభిమాన చాటుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ 'వరల్డ్ వార్ 2' కార్యక్రమం కోసం వారు అధికారిక అనుమతులను సైతం తీసుకున్నారు. ఒక సినిమా కోసం ఇంతటి భారీ స్థాయి ప్రచార కార్యక్రమం చేయడం చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : 'అర్జున్ రెడ్డి'కి నా రెమ్యూనరేషన్ రూ. 5 లక్షలే.. ఈ రోజు స్టార్ డమ్ !
టైగర్ నేషన్ కదిలితే,..
టైగర్ నేషన్ కదిలితే, అసాధ్యం కూడా తలవంచుతుంది! ఇది చరిత్రలో మునుపెన్నడూ చూడని ర్యాలీ. నిజమైన ట్యాంకులతో యుద్ధరంగంలో రణభేరి మోగించారు" అని ఎన్టీఆర్ అభిమానులు గర్వంగా ప్రకటించారు. గతంలో మెల్బోర్న్లో అభిమానులు విమానాలతో గగనతలంలో "NTR" అనే అక్షరాలను చెక్కగా, ఇప్పుడు యూకే అభిమానులు దానికి మించి ముందుకు సాగారు.
When TIGER NATION Moves, Even The IMPOSSIBLE Bows Down !🙇♂️
— UK NTR Fans (@UKNTRfans) August 1, 2025
A RALLY Like No Other, History Rolled With Us With REAL TANKS That Fought In #WorldWAR2 Now Roars For TIGER NATION On REAL BATTLEFIELD 🐯
LOVE YOU FOREVER @tarak9999 ❤️🔥#WAR2 #WAR2Celebrations @yrf
VC: @Movies_NTR 🔥 pic.twitter.com/BIl0vDW9gp
'ఆవన్ జావన్' పాటతో హంగామా
ఎన్టీఆర్ అభిమానులు ఒకవైపు తమ ప్రచారంతో దుమ్మురేపుతుంటే, మరోవైపు 'వార్ 2' చిత్రబృందం 'ఆవన్ జావన్' అనే రొమాంటిక్ పాటను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ పాటలో హృతిక్ రోషన్, కియారా అద్వానీల మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ అభిమానుల కోసం ఒక డ్యాన్స్ ఛాలెంజ్ను ప్రకటించారు. "ఆవన్ జావన్' హుక్స్టెప్ను అనుసరిస్తూ రీల్స్ చేయండి. అదృష్టవంతులైన వారిని నేను స్వయంగా కలుస్తాను" అని ఆయన వీడియో సందేశంలో తెలిపారు.
ఈ మూవీలో హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్గా తన పాత్రను తిరిగి పోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతూ విలన్గా అడుగుపెడుతున్నారు. ఈ టీజర్లో కత్తుల పోరాటాలు, కార్ ఛేజ్లు, హ్యాండ్-టు-హ్యాండ్ పోరాటాలతో కూడిన సీక్వెన్సులు ఉన్నాయి. హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ 'వార్ 2' ను ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్. ఈ సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్లతో రూపొందుతుంది. ఈ సినిమాలో భారతదేశపు అగ్రశ్రేణి సూపర్ ఏజెంట్లుగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరితో ఒకరు తలపడనున్నారు. 'వార్ 2' హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆతృత పతాక స్థాయికి చేరింది.