డీఎంకే నేత, ఎంపీ కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించిన సందర్భంగా ఓ మహిళ డ్రైవర్ బస్లో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బస్సు కండక్టర్.. ఎంపీకి టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఆ మహిళా డ్రైవర్ను సదరు ట్రావెల్స్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అయితే దీనిపై సీని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు. ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్కు ఓ కారును బహుమానంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకనుంచి ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఎంపీ కనిమొళి ఇటీవల కొయంబత్తూర్లోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రైవేట్ సంస్థకు చెందిన బస్సులో ప్రయాణించారు. అయితే ఈ బస్సును నడుపుతోన్న షర్మిల అనే మహిళా డ్రైవర్ ప్రతిభను మెచ్చుకుంటూ.. కనిమొళి ఆమెకు చేతి గడియారాన్ని బహూకరించారు. అనంతరం తాను నడిపిన బస్సులో శిక్షణలో ఉన్న మహిళా కండక్టర్.. ఎంపీ కనిమొళితో అనుచితంగా ప్రవర్తించిందంటూ షర్మిల తన యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
ALSO READ:తెలంగాణలో రూ.3 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న లులూ గ్రూప్
అదే సమయంలో.. తన పాపులారిటీ కోసం బస్సులో ప్రయాణించేందుకు తరచుగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు ఆ కండక్టర్ కూడా షర్మిలపై ఫిర్యాదు చేశారట. ఇలా ఇరువురి వాదనల నేపథ్యంలో షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించినట్లు యాజమాన్యం వెల్లడించడంతో ఈ విషయం చర్చనీయాంశమయ్యింది. ఇది కమల్ హాసన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆమెకు కారును బహుమతిగా ఇచ్చారు.