చెన్నై: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆప్ విజయఢంకా మోగించింది. మొత్తం 117 స్థానాల్లో ఆ పార్టీ 92 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ ప్రశంసల జల్లులు కురిపించారు. పంజాబ్ లో ఆప్ గెలుపు అపూర్వమని ఆయన మెచ్చుకున్నారు. తన ఫ్రెండ్ కేజ్రీవాల్ కు విషెస్ చెప్పిన కమల్.. పార్టీ పెట్టిన పదేళ్లలోనే మరో రాష్ట్రంలో నెగ్గడం అభినందనీయమని ట్వీట్ చేశారు.
Congratulations to my friend @ArvindKejriwal and Aam Aadmi party for their sweeping victory. It is commendable that within ten years since it's inception, the party has reigned victorious in another state, Punjab. pic.twitter.com/NGSXyrOLIj
— Kamal Haasan (@ikamalhaasan) March 11, 2022
జాతీయ పార్టీగా అవతరించాలంటే..?
అన్నా హజారే లోక్ పాల్ డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ.. ఆమ్ ఆద్మీ. జాతీయ పార్టీగా ఎదగాలని ఆప్ కలలు కంటోంది. ఒకవేళ జాతీయ పార్టీగా అవతరిస్తే ఎన్నికల్లో ఒకే గుర్తుతో దేశవ్యాప్తంగా పోటీ చేయడానికి వీలుంటుంది. అయితే, ఒక పార్టీకి జాతీయహోదా దక్కాలంటే.. లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు ఏదైనా స్టేట్ నుంచి నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతీయ పార్టీకి ఎన్నికల సంఘం జాతీయ పార్టీ హోదాను ఇస్తుంది. మన దేశంలో జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఆప్ కూడా జాతీయ పార్టీగా మారే దిశగా అడుగులు వేస్తోంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54 శాతం ఓట్లను సాధించగా.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో 42%, గోవాలో 6.77%, ఉత్తరాఖండ్లో 3.4%, ఉత్తర్ ప్రదేశ్లో 0.3% ఓట్ షేర్ ను గెలుచుకుంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ సత్తా చాటితే ఆప్ ‘జాతీయ’ లక్ష్యాలు నెరవేరినట్లే!
మరిన్ని వార్తల కోసం: