
వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: ఇండియా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఇద్దరు బ్యాటర్లలో ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ అయితే.. మరొకరు కరుణ్ నాయర్. కానీ సెహ్వాగ్ కెరీర్ అద్భుతంగా సాగితే.. నాయర్ మాత్రం ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ఎంత మంది సెలెక్టర్లు మారినా, కెప్టెన్లు మారినా, ప్లేయర్లు వచ్చిపోయినా నాయర్కు మాత్రం నో చాన్స్. ఈ మధ్యలో కౌంటీల్లో పరుగుల వరద పారించినా, డొమెస్టిక్స్ మ్యాచ్ల్లో సెంచరీలతో కదం తొక్కినా అవకాశం మాత్రం దక్కలేదు. అయినా ఏనాడూ నిరుత్సాహానికి గురికాకుండా నమ్ముకున్న ఆటతోనే ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
‘డియర్ క్రికెట్. నాకు మరో చాన్స్ ఇవ్వవా!’ అంటూ డిసెంబర్ 10, 2022న గాయపడిన హృదయంతో కరుణ్ నాయర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్కు మే 24, 2025న సరైన జవాబు లభించింది. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత కరుణ్ నాయర్ను మళ్లీ టీమిండియా టెస్టుల్లోకి తీసుకున్నారు. దాంతో తన కెరీర్ను పునః ప్రారంభించుకోవడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని పొందాడు.
డొమెస్టిక్ క్రికెట్లో ఎనిమిదేండ్లు అసాధారణంగా పోరాడాడు. కానీ ఏనాడూ తన కలను మాత్రం ఆపలేదు. కొత్త తరం ప్రతిభావంతుల మధ్య పాతతరం క్రికెటర్లను మర్చిపోవడం చాలా కామన్. అయినా క్రికెట్ ప్రపంచానికి నేను ఉన్నాననే ఓ ఆలోచనను ఎప్పుడూ కలిగించాడు. దానికి అతను ఎంచుకున్న ఏకైక మార్గం పరుగులు సాధించడం. దాన్ని సమర్థంగా చేసి చూపెట్టాడు.
విదర్భకు మారడం అదృష్టం..
డొమెస్టిక్ క్రికెట్లో కర్నాటక నుంచి విదర్భకు మారడం కరుణ్ కెరీర్లో నిజమైన మలుపుగా చెప్పొచ్చు. కర్నాటక తుది జట్టులో చోటు దక్కించుకోవడమే కష్టమైన నేపథ్యంలో విదర్భలో బ్యాటింగ్ లైనప్లో ఏకంగా పాతుకుపోయాడు. ఎందుకంటే ఆ టీమ్లో అనుభవజ్ఞుడైన బ్యాటర్ లేకపోవడం నాయర్కు కలిసొచ్చింది. దీనికి తోడు తన పార్ట్టైమ్ బౌలింగ్ కూడా విదర్భకు మంచి చేసింది. విదర్భ తరఫున ఆడిన 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 690 రన్స్ చేశాడు. 2024–25 సీజన్లో 9 మ్యాచ్ల్లో 54 సగటుతో 4 సెంచరీలతో కలిపి 863 రన్స్ సాధించాడు.
ఇక విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్ల్లో 5 సెంచరీలతో కలిపి 779 రన్స్ చేశాడు. యావరేజ్ 389.50గా ఉంది. ఈ సీజన్ రంజీ ట్రోఫీని విదర్భ గెలవడంలోనూ నాయర్ కీలక పాత్ర పోషించాడు. ఈ పెర్ఫామెన్స్తో నాయర్ సెలెక్టర్ల మదిలో అట్లాగే నిలిచిపోయాడు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్తో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తనకు నో చెప్పే అవకాశాన్ని సెలెక్టర్లకు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నాయర్ ఎంపిక నేషనల్ వైడ్గా చర్చనీయాంశంగా మారింది.
అలాగే హైదరాబాద్ స్టయిలిష్ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్ కెరీర్ను కూడా ఓసారి గుర్తు చేసింది. 1999 డొమెస్టిక్ సీజన్లో లక్ష్మణ్ అద్భుతంగా ఆడాడు. కానీ టీమిండియాకు ఎంపిక కాలేదు. ఆ వెంటనే వీవీఎస్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్ల్లో 108.8 సగటుతో 1415 రన్స్ చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉండటం విశేషం.
అప్పట్నించి లక్ష్మణ్ కెరీర్ ఓ దశాబ్దం పాటు ‘వెరీ వెరీ స్పెషల్’ మలుపు తీసుకుంది. ఇప్పుడు నాయర్ కోరినట్టే క్రికెట్ అతనికి మరో చాన్స్ ఇచ్చింది. మరి అతను పాత ట్రిపుల్ సెంచరీ తరహా ఆటను కొత్తగా చూపెడతాడా..? మళ్లీ ఆ స్థాయిలో ఆడి అందర్ని మెప్పిస్తాడా? ఇంగ్లండ్ టూర్లో జవాబు దొరుకుతుందేమో చూడాలి.
కౌంటీల్లో పరుగుల వరద..
టీమిండియాలోకి తిరిగి రావడానికి నాయర్ చేసిన గొప్ప అన్వేషణల్లో ఒకటి కౌంటీల్లో ఆడటం. ఆలోచన వచ్చిన మరు క్షణమే నార్తాంప్టన్షైర్లో చేరి తెలివైన మొదటి అడుగు వేశాడు. 2023లో అతను నార్తాంప్టన్షైర్ తరఫున మూడు మ్యాచ్ల్లో 83 సగటుతో 249 రన్స్ చేశాడు. సర్రేతో జరిగిన మ్యాచ్లో సెంచరీ కూడా సాధించాడు. ఓ ఏడాది తర్వాత తన కౌంటీ టీమ్ తరఫున గ్లామోర్గాన్పై సెంచరీతో సహా ఏడు మ్యాచ్ల్లో 49 సగటుతో 487 రన్స్ చేశాడు.
అయితే ఇండియా టీమ్లో చోటు దక్కించుకునేందుకు ఈ రన్స్ సరిపోలేదు. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం రెట్టింపైంది. ‘ఇంగ్లండ్లో ఇండియా బ్యాటర్లు రన్స్ చేయడం చాలా కష్టమని అందరికీ తెలుసు. కదిలే బాల్ను ఎదుర్కోవడం చాలా ఇబ్బంది. కానీ ఓ బ్యాటర్గా నా గురించి చాలా నేర్చుకున్నా. రన్స్ చేయడానికి చాలా మార్గాలను వెతికా. అందులో సక్సెస్ అయ్యా’ అని అప్పట్లో నాయర్ వ్యాఖ్యానించాడు.