
- అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్తో కథ నడిపిన కేసీఆర్
- ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బీఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్
- ప్లాన్ ఫెయిలవడంతో పోలీసులపై సీరియస్
- ప్రశ్నించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతల ఫోన్లు ట్యాప్
- రేవంత్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల, బండి సంజయ్, అర్వింద్ ఫోన్లు కూడా..!
- మీడియా యజమానులు, సొంత పార్టీ నేతలనూ వదలలేదు
- ఆర్ఎస్ ప్రవీణ్, శంభీపూర్ రాజు, కడియం, పట్నం మహేందర్రెడ్డి, జువ్వాడి నర్సింగరావుపైనా నిఘా
- స్నాప్ చాట్లో మాట్లాడినా రికార్డింగ్
- రాధాకిషన్రావు కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను కాపాడేందుకు ఏకంగా మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కథను ఆయన నడిపించినట్లు తేలింది. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ను ఇందులో ఇరికిస్తే.. ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి తన బిడ్డ బయట పడుతుందని కేసీఆర్ ప్లాన్ వేశారు.
ప్లాన్ ఫెయిలవడంతో పోలీసులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కవితను తప్పించేందుకు దారులన్నీ మూసుకుపోయాయని మండిపడ్డారు. ఇక, ఉప ఎన్నికల టైమ్లో ప్రతిపక్ష నేతల కదలికలను తెలుసుకునేందుకు వాళ్లందరి ఫోన్లను ట్యాప్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి.
వీటిని రాధాకిషన్రావు కస్టడీ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.
కేసీఆర్ డైరెక్షన్లోనే..
నాడు దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్స్తో పాటు మునుగోడు బై ఎలక్షన్ను కేసీఆర్ అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఎలాగైనా బీజేపీ గెలుపును అడ్డుకోవాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే 2022 అక్టోబర్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి.. పైలట్ రోహిత్రెడ్డి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో భాగంగా నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో కేసీఆర్ పలుమార్లు మీటింగ్స్ జరిపారు. అక్టోబర్ చివరి వారంలో నాటి టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో ప్రభాకర్ రావు భేటీ అయ్యారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలను ట్రాప్ చేయాలని రాధాకిషన్రావుకు ప్రభాకర్రావు సూచించారు. ఇందుకు తగ్గట్టుగా నాటి ఎస్ఐబీ ఎస్ఓటీ చీఫ్ ప్రణీత్రావు టీమ్ నిఘా పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రైవేట్ వ్యక్తులను ఆ టీమ్ పూర్తిగా తమ సర్వెలైన్స్లోకి తీసుకుంది. ఫోన్ట్యాపింగ్ ద్వారా ఆడియో క్లిప్ సేకరించింది. ఆ ఆడియో క్లిప్ను కేసీఆర్కు చేరవేసింది. ఆ తర్వాత నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పటిష్టంగా ట్రాప్ స్కెచ్ వేయాలని సూచించారు.
ఇందులో భాగంగా నందుకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీతో రోహిత్రెడ్డి పలుమార్లు మాట్లాడారు. వీరి సంభాషణలు అన్నీ రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో మొయినాబాద్ అజీజ్నగర్లోని రోహిత్రెడ్డి ఫామ్హౌస్ను ట్రాపింగ్కు కేంద్రంగా ఎంచుకున్నారు.
ఢిల్లీ నుంచి స్పై కెమెరాలు
‘ఆపరేషన్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్’ కోసం నాటి టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శ్రీనాథ్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని ఢిల్లీకి పంపించారు. హై క్వాలిటీ స్పై కెమెరాలు కొనుగోలు చేయించారు. వీటిని రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో ఫిక్స్ చేశారు. ఫామ్హౌస్పై టాస్క్ఫోర్స్ ఎస్ఐలు అశోక్రెడ్డి, మల్లికార్జున్, శ్రీకాంత్ మరికొంత మంది పోలీసులు నిఘాపెట్టారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2022 అక్టోబర్ 26న కొల్లాపూర్, అచ్చంపేట, తాండూరు, పినపాక నియోజకవర్గాల నాటి ఎమ్మెల్యేలు(బీఆర్ఎస్) హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావును ఫామ్హౌస్లో ఉంచారు.
స్పై కెమెరాలు సీసీటీవీ కెమెరాలకు స్పష్టంగా కనిపించే విధంగా సీటింగ్ అరెంజ్ చేశారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్ అక్కడికి రాగానే పోలీసులతో రెయిడ్స్ చేయించారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్ను అరెస్ట్ చేసి.. ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రిజిస్టర్ చేశారు. కొనుగోలు వ్యవహారం వెనుక బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ఉన్నట్లు ప్రచారం చేశారు.
కవితను కాపాడలేదని గరం గరం
ఫామ్హౌస్ కేసు రిజిస్టర్ అయిన వెంటనే కేసీఆర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కేసు తీవ్రతను పెంచాలని పోలీసులకు చెప్పారు. బీఎల్ సంతోష్, తుషార్, నడ్డా సహా బీజేపీ కీలక నేతలను అరెస్ట్ చేసి, లిక్కర్ స్కామ్లో కవితను తప్పించేలా బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. కీలక నేతల అరెస్టుల కోసం సిట్ అధికారులు రెమా రాజేశ్వరి, గట్టుమల్లు, మరికొంత మంది పోలీసులు చార్టెడ్ ఫ్లైట్లో కేరళకు వెళ్లారు. కానీ.. బీఎస్ సంతోష్, తుషార్ సహా ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు.
నోటీసులు కూడా అందించలేకపోయారు. ఈ క్రమంలోనే ఫామ్హౌస్ కేసును సీబీఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఎల్ సంతోష్ సహా బీజేపీ నేతల అరెస్టులో ఫెయిలవడంతో పోలీస్ అధికారులపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో కవితను కాపాడేందుకు అన్ని దారులు మూతపడ్డాయని మండిపడ్డారు. ఆ తర్వాత సిట్లో భారీ మార్పులు చేశారు. ఈ వివరాలన్నిటినీ పోలీసు కస్టడీలో రాధాకిషన్రావు ఒప్పుకున్నాడు.
మునుగోడు బై పోల్ టైమ్లో..
మునుగోడు ఉప ఎన్నిక టైమ్లో ఎమెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామితోపాటు వాళ్ల బంధువులు, అనుచరులను ఫోన్లను గత సర్కార్ ట్యాప్ చేయించింది. నాటి సీఎంవో ఆఫీస్ నుంచి వచ్చిన పేర్లు, ఫోన్ నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల కదలికలు, ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్రావు అంగీకరించాడు.
సొంత పార్టీ నేతలపైనా..!
ఫోన్ ట్యాపింగ్ను సొంత పార్టీ(బీఆర్ఎస్) నేతలపైనా కేసీఆర్ ప్రయోగించారు. పార్టీకి ఇబ్బందికరంగా అనిపించిన సొంత పార్టీ నేతలను కూడా ఆయన వదలలేదని రాధాకిషన్రావు వెల్లడించాడు. ఇందుకోసం ప్రణీత్రావు ఆధ్వర్యంలో స్పెషల్ సర్వెలైన్స్ నడిచిందన్నాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజుపై, అదేవిధంగా ఇతర సందర్భాల్లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్రెడ్డి, ఆయన భార్య సునీత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డిపైనా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టినట్లు తేలింది.
రేవంత్రెడ్డి,బండి సంజయ్పైనా..
అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులపై కేసీఆర్ డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ నడిచిందని రాధాకిషన్రావు వెల్లడించాడు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి, ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపైనా గత సర్కార్ ఫోన్ ట్యాపింగ్ను ప్రయోగించిందన్నాడు. ప్రభుత్వంలోని తప్పులను ప్రశ్నించినందుకు 2021 ఆగస్టులో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇదంతా నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు, ప్రణీత్రావు ఆధ్వర్యంలోనే చేసినట్లు వెల్లడించాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలిసి కొందరు స్నాప్చాట్లో మాట్లాడితే.. ఆ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్టు తెలింది. ఎలక్షన్స్ టైమ్లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును రాజ్పుష్ప సంస్థ నుంచి తరలించామని, ఇలా అధికార పార్టీకి చెందిన డబ్బును ట్రాన్స్పోర్ట్ చేసేందుకు పోలీస్ వెహికల్స్ వాడినట్టు కూడా రాధాకిషన్రావు వెల్లడించాడు.
శ్రవణ్ రావు నుంచి ఫోన్ నంబర్లు తీస్కొని..
ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుతో కాంటాక్ట్స్ ఉన్నాయి. దీంతో శ్రవణ్ రావు నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును డైరెక్ట్ గా కలిసేవాడు. ప్రణీత్ రావు, ఎస్ఐబీ టీమ్ మెంబర్స్తో శ్రవణ్ రావుకు మంచి సంబంధాలు ఉండేవి. ప్రతిపక్ష నేతలకు ఫైనాన్షియల్గాసపోర్ట్ చేసే వాళ్ల ఫోన్ నంబర్లు, అనుచరుల ఫోన్ నంబర్లను ప్రణీత్ రావుకు శ్రవణ్ రావు పంపించేవాడు. అట్లా వాళ్లపై కూడా నిఘా పెట్టి, డబ్బులు సీజ్ చేసేవాళ్లమని రాధాకిషన్ రావు వెల్లడించాడు.