
అవినీతి నిరోదకశాఖకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజ్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తెలంగాణకు చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ను కోరాయి.
భూ పట్టా విషయంలో రూ. 2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటుండగా ఇటీవలే తహసీల్దార్ బాలరాజు పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వ ఉద్యోగి భారీ మొత్తంలో ఇలా లంచం తీసుకోవడం ప్రపంచంలోనే తొలిసారి అని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్ అన్నారు.
రాజేందర్ తో పాటు వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యకలాపాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ లు..అవినీతికి పాల్పడ్డ బాలరాజు పేరును గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఎంట్రీ చేసేందుకు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
అయితే స్వచ్ఛంద సంస్థ ధరఖాస్తుపై గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించి తమవద్ద ఎలాంటి కేటగిరీ లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది.