దేశానికి పెను‘సవాల్’ గా ఖలిస్తాన్ 2.0 : డా. పి. భాస్కరయోగి

దేశానికి పెను‘సవాల్’ గా ఖలిస్తాన్ 2.0 : డా. పి. భాస్కరయోగి

ఇందిర హయాంలో భింద్రన్‌‌వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్‌‌’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్‌‌’ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్‌‌లో ఆమ్‌‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాలు లేకుండా పోయిన భారత వ్యతిరేక శక్తులు అక్కడ హల్‌‌చల్‌‌ చేస్తుంటే మరోవైపు విదేశాల్లో వీరు చాలా యాక్టివ్‌‌గా ఉన్నారు. ఖలిస్తానీల పేరుతో ఈ వారం పదిరోజుల్లో బ్రిటన్‌‌, ఫ్రాన్స్‌‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాదశక్తులు ‘భారత వ్యతిరేకత’ను ప్రదర్శిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ముగిసిన రైతు ఉద్యమం తర్వాత తొండముందిరి ఊసరవెల్లిగా మారినట్లు అమృతపాల్‌‌ అనే సరికొత్త వేషగాడు జర్నైల్‌‌ సింగ్‌‌ భింద్రన్‌‌వాలే లాగ ప్రవరిస్తున్నాడు. ఇటీవల పంజాబ్‌‌లోని ఓ పోలీస్‌‌ స్టేషన్‌‌పై దాడి చేసిన ఘటన తర్వాత ఇతను వార్తల్లోకి ఎక్కాడు. తన బంధువుల సహకారంతో అరబ్‌‌ దేశాలకు వెళ్లి భారీ వాహనాల డ్రైవర్‌‌గా పనిచేసిన అమృత్‌‌పాల్‌‌ ఇటీవల ఇండియాలో ఖలిస్తానీ ఉద్యమనేతగా కనిపించడం వెనుక ‘బ్రేకింగ్‌‌ ఇండియా’ ఫోర్సెస్‌‌ పాత్ర ఎంత అనేది పరిశోధించాలి. ఖలిస్తాన్‌‌ 2.0ను విస్తరించేందుకు పోలీసులపై దాడి, ఏడు క్రిమినల్‌‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత్​పాల్‌‌ తనను తాను భింద్రన్‌‌వాలేలా ఊహించుకుంటున్నాడు.

‘వారిస్‌‌ పంజాబ్‌‌ దే’ అన్న సంస్థను నడిపిస్తున్న ఈ యువకుడు ఒక్కసారిగా ఈ నెలలో దేశంలోని అన్ని ఛానళ్లలో మాట్లాడేటంత ప్రాచుర్యం పొందాడు. ఇందిరగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం 1984లో స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్‌‌ బ్లూ స్టార్‌‌’ చేపట్టింది. ఆ చర్యలో భాగంగా భింద్రన్‌‌వాలే అంతమయ్యాడు. ఆ తర్వాతి కాలంలో ప్రధాని ఇందిరను, పంజాబ్‌‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌‌ సింగ్‌‌లను ఖలిస్తానీలు హతమార్చారు. ఇప్పుడు ఈ అమృతపాల్‌‌ ‘ఇందిరకు పట్టిన గతే కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాకూ పడుతుంద’ని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్‌‌ చేసేందుకు ప్రయత్నిస్తే అతను దొరికినట్టే దొరికి తప్పించుకోవడం, ఆ వెనువెంటనే లండన్‌‌లోని భారత్‌‌ హైకమిషనర్‌‌ కార్యాలయంపై త్రివర్ణపతాకం తొలగించి ఖలిస్తానీ పతాకావిష్కరణ చేయడం కొత్త ఆందోళనకు తెరతీస్తున్నది.

ఖలిస్తానీ వేర్పాటుకు బీజం ఎప్పుడు పడింది ?

చరిత్రలోకి వెళితే 1857లో నాటి బ్రిటీష్‌‌ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్‌‌ భారతంలోని అన్ని వర్గాలు ప్రజలు పాల్గొన్నారు. ఆ ఉద్యమ సునామీ బ్రిటీషర్ల వెన్నులో వణుకు పుట్టించింది. అంతకుముందు తమకు సునాయాసంగా లొంగిపోయిన ఇక్కడి స్వదేశీ సంస్థానాధీశులు, ప్రజల్లో ప్రాంతాలు, మతాలకతీతంగా ఏర్పడిన ఐకమత్యం చూసి ఖంగుతిన్నారు. అందుకే మన మోకాళ్లను విరవాలనుకున్నారు. ఈసారి శక్తితో కాకుండా యుక్తికి పదునుపెట్టారు. అనుకున్నదే తడవుగా మాక్స్‌‌ ఆర్థర్‌‌ మెకాలిఫ్‌‌ అనే ఐర్లాండ్‌‌ దేశంలో పుట్టిన బ్రిటీష్ తైనాతీని ఆగమేఘాల మీద భారత్‌‌కు రప్పించారు. గురుగోవింద్‌‌ సింగ్‌‌, రంజిత్‌‌సింగ్‌‌, ఫతేసింగ్‌‌, జొరావర్‌‌సింగ్‌‌, అర్జున్‌‌దేవ్‌‌ వంటి సిక్కు గురువుల స్ఫూర్తితో దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ‘సిక్కు’ మతస్తులను హిందువుల నుంచి వేరుచేసే కుట్రకు తెరలేపారు.

మెకాలిఫ్‌‌ ఐర్లాండ్‌‌లో పుట్టినా ఆంగ్లేయ మనస్తత్వం జీర్ణించుకున్న తెల్లతోలు గుంట నక్క. అతడు అమృత్​సర్‌‌లో అడుగుపెట్టి సిక్కుగా మతం మార్చుకున్నాడు. ఆ కాలంలో ఒక ఆంగ్లేయుడు సిక్కుగా మారడం భారత సిక్కులకు ఆశ్చర్యం కలిగించింది. కానీ అందులోని కుట్రను వారు గ్రహించలేకపోయారు. మెకాలిఫ్‌‌ తన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఉపయోగించి భాయ్‌‌ కహ్న్​సింగ్‌‌ నాభా అనే సిక్కును ప్రభావితం చేశాడు. 1897 నాటికి ఈ సిక్కు సూడో మేధావి కలంతో ‘హమ్‌‌ హిందూ నహీ’ అన్న పుస్తకం రాయించాడు. ఆనాడే ఖలిస్తాన్‌‌కు బీజం పడింది. హిందూ ధర్మానికి బాహువుల్లా ఉన్న సిక్కుల్లో ‘మేం వేరు’ అనే భావన కలిగించారు. 1 మే 1905 నాడు అమృత్​సర్‌‌ సరోవరంపై ఉన్న హిందూ దేవీదేవతల విగ్రహాలు తొలగించబడ్డాయి. 1901 జనాభా లెక్కల నాటికి 10 లక్షలు ఉన్న సిక్కు జనాభా1911 జనాభా లెక్కల నాటికి 300 రెట్లు పెరిగింది.

అంతకుముందు సిక్కులు తమను హిందువుల్లో అంతర్భాగంగానే భావించేవారు. దీంతో హిందూ– సిక్కుల మధ్య బ్రిటీష్‌‌ వాడి పన్నాగం అమలైంది. ఆర్థర్‌‌ మెకాలిఫ్‌‌ అన్నంతపనీ చేసి తనకు అప్పగించిన ఆపరేషన్‌‌ పూర్తి చేశాడు. సిక్కుల గురుగ్రంథ సాహెబ్‌‌లో 8346 సార్లు ‘హరి’ పేరు, 2533 సార్లు రాముని పేరు,17 సార్లు వాహే గురు పేరు స్మరింపబడింది. అలాంటి సిక్కులను హిందూ ధర్మం నుంచి వేరుచేసే కుట్ర మెకాలిఫ్‌‌ రూపంలో జరిగింది. ధర్మరక్షణలో వీరులైన సిక్కులను హిందువులను వేరు చేస్తే స్వాతంత్య్రోద్యమం పలచనవుతుందనుకున్న తెల్లవాడి మెదడులో పుట్టిన ఆలోచన ఆచరణలోకి వచ్చింది.

ఆప్ ​ప్రభుత్వం ఏం చేస్తుంది?

ఖలిస్తానీలు రైతు చట్టాలను వ్యతిరేకించే పేరుతో రైతుల ముసుగులో ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. మోడీ పర్యటనను పంజాబ్‌‌లో అడ్డుకున్న రైతులను నాటి చన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లే ఖలిస్తానీ వేర్పాటువాదులకు ప్రస్తుత పంజాబ్‌‌ సీఎం ఆప్‌‌ పార్టీకి చెందిన భగవంత్‌‌ మాన్‌‌ అలాగే పరోక్ష మద్దతు ఇస్తున్నారని సర్వత్రా వినిపిస్తున్న మాట. గన్‌‌ లైసెన్స్‌‌లపై అందరినీ నిర్బంధిస్తున్న పంజాబ్‌‌ ప్రభుత్వం బాహాటంగా ఆయుధాలు ధరించి తిరుగుతున్న ఖలిస్తానీలను ఏమీ అనడం లేదని ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పంజాబ్‌‌లో మిలిటెంట్‌‌ ఉద్యమాలు నడిపి జైలులో ఉన్న బంధీసింగ్‌‌ను విడిపించేందుకు రోడ్డెక్కేవారిని కూడా ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోంది. అమృత్​పాల్‌‌ అనుచరుడు లవ్‌‌ప్రీత్‌‌సింగ్‌‌ను పోలీసులు ఓ కిడ్నాప్‌‌ కేసులో అరెస్టు చేసి పోలీస్‌‌ స్టేషన్‌‌లో బంధిస్తే వందలాదిమంది ఖలిస్తానీలు చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. ఈ గొడవ మోడీ, అమిత్‌‌షాలను నిలువరిస్తుందని ‘టుక్డే టుక్డే గ్యాంగ్‌‌’లు ఆనందపడుతూ పరోక్షంగా సహకరిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్లు జరుగుతున్న ఈ సరికొత్త వేర్పాటువాద ధోరణి దేశానికి మంచిదికాదు. తస్మాత్‌‌ జాగ్రత్త.

అసలు గుట్టు తేల్చాలే..

దీప్‌‌సిద్ధూ అనే నటుడు 2022 ఫిబ్రవరిలో మరణించాడు. ‘వారిస్‌‌ పంజాబ్‌‌ దే’ అనే సంస్థను ఇతడు స్థాపిస్తే ఇపుడు అమృత్​పాల్‌‌ దాన్ని నడిపిస్తున్నాడు. కేంద్రప్రభుత్వం రైతులకు మేలుచేయాలని ‘రైతు చట్టాలు తెచ్చింది. కానీ పంజాబ్‌‌, హర్యానా, యూపీలోని కొంతమంది రైతులు వీటిని వ్యతిరేకించారు. వారి వెనుక ఉన్న శక్తులు మెల్లగా బయటకు వస్తున్నాయి. దశాబ్దాలుగా బీజేపీతో కలిసి ఉన్న అకాలీదళ్‌‌ పార్టీ రైతు ఉద్యమం కారణంగా విడిపోయింది. పంజాబ్‌‌ సీనియర్‌‌ కాంగ్రెస్‌‌ నేత అమరీందర్‌‌సింగ్‌‌ సొంత కుంపటి పెట్టుకుని, తర్వాత బీజేపీలో కలిసిపోయాడు. కాంగ్రెస్‌‌ చరణ్‌‌జిత్‌‌సింగ్‌‌ చన్నీని ముఖ్యమంత్రిగా చేస్తే అతను జనవరి 2022లో పంజాబ్‌‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీకి సరైన భద్రత కల్పించకుండా 20 నిమిషాల పాటు అత్యంత ప్రమాదకర పరిస్థితి కల్పించాడు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ ఘోర పరాజయం పాలైంది. కానీ ఆప్‌‌ అక్కడ అధికారంలోకి వచ్చింది. అయితే అక్కడ ఆప్‌‌ డబ్బు ఎంత ఖర్చుపెట్టిందనే డొంక లాగితేనే ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చ జరుగుతున్న మద్యం కుంభకోణం బయటకు వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా పంజాబ్‌‌ లాగానే ‘డ్రగ్స్‌‌’ వ్యాపారం విస్తరిస్తోంది. ఈ ఆదాన ప్రదానాలు ఎలా జరుగుతున్నాయో దర్యాప్తు సంస్థలే తేల్చాలి.

నాటి వేర్పాటువాదం ఇప్పుడు..

‘‘సిద్ధాంతానికి చావు లేదు. మాదీ అంతే’’ అంటూ బరితెగించి మాట్లాడుతున్న అమృత్​పాల్‌‌ భారత్‌‌ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సవాల్‌‌ విసరడం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ‘ఖల్సా’ ఉద్యమం గురుగోవింద్‌‌ సింగ్‌‌ వంటి దేశభక్తులు నడిపారు. ఖలిస్తాన్‌‌ ఉద్యమాన్ని ఇప్పుడు తీవ్రవాద ధోరణులున్న వ్యక్తులు నడుపుతున్నారు. ఖలిస్తాన్‌‌ అంటే పంజాబీ భాషలో ‘పవిత్రమైన స్థానం’ అని అర్థం. ఆర్థర్‌‌ మెకాలిఫ్‌‌ పెట్టిన చిచ్చు 1940 వరకూ మండింది. మధ్యలో స్వాతంత్య్ర పోరాటం, దేశవిభజన సమస్య వల్ల తడారిన ఈ ఉద్యమం1940ల్లో మళ్లీ పుంజుకుంది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని కోరే శక్తులు పాకిస్తాన్‌‌లోని ‘పంజాబ్‌‌’ భాగాన్ని వదిలేశారు. కానీ భారత్‌‌లో మాత్రం కొనసాగించారు. 1970–1980 తర్వాత మళ్లీ రాజుకున్న ఈ ‘ఖలిస్తానీ ఉద్యమం’ ఇందిర, భింద్రన్‌‌వాలేల మరణంతో ఆగిపోయింది. ఈ ఉద్యమం వెనుక ఐఎస్‌‌ఐ శక్తులు ఉండేవని చెబుతారు. ఇపుడు సరికొత్తగా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌‌లోని కొందరు ఖలిస్తానీ అభిమానులు ఈ ఉద్యమానికి అండదండలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. బ్రిటన్‌‌లోని ప్రతిపక్ష పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాశ్మీర్‌‌లో 370 ఆర్టికల్‌‌ పునరుద్ధరణకు డిమాండ్‌‌ చేస్తామని అక్కడ హామీ ఇవ్వడం వెనుక ఏ శక్తులున్నాయో ఈ ఉద్యమం వెనుక అవే శక్తులున్నాయి. 

- డా. పి. భాస్కరయోగి, సోషల్​ ఎనలిస్ట్​