
వాషింగ్టన్: చెల్లెలు ఇంట్లో భద్రంగుంటరని ఓ అక్క తన పిల్లలను అప్పగించింది.. ఆ చెల్లె మాత్రం వారిని చంపి కారు డిక్కీలో దాచింది. అదే కారులో ఏడాది నుంచి సిటీ వీధుల్లో తిరుగుతూనే ఉంది.. అయినా ఎవరూ గుర్తించలే. అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన ఈ దారుణం బుధవారం వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన నికోల్ జాన్సన్ కారులో వెళుతుంటే పోలీసులు ఆపారు. కారు పేపర్లు చూపకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాన్సన్ వివరాలు అడుగుతుంటే.. మరో ఐదు రోజుల్లో మీడియాకు తానో సంచలనంగా మారుతానని చెప్పింది. అనుమానం వచ్చి పోలీసులు ఆ కారును చెక్ చేశారు. కారులో దాచిన సూట్కేసులో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో చిన్న పిల్లల డెడ్బాడీలు బయటపడ్డయి. జాన్సన్ను విచారించగా.. ఆ డెడ్ బాడీలు తన అక్క పిల్లలవని చెప్పింది. ఏడేండ్ల పాప, ఐదేళ్ల బాబును 2019లో అక్క తనకు అప్పగించిందని పేర్కొంది. పాప తలను నేలకేసి కొడితే చనిపోయిందని, డెడ్బాడీని కారులో దాచానని చెప్పింది. తర్వాత బాబును కూడా చంపానని వివరించింది. అయితే, పిల్లలను ఎందుకు చంపిందని కానీ మిగతా వివరాలు కానీ చెప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.