పిల్లలను చంపి.. కారు డిక్కీలో దాచి.. ఏడాది తిరిగింది

పిల్లలను చంపి.. కారు డిక్కీలో దాచి.. ఏడాది తిరిగింది

వాషింగ్టన్: చెల్లెలు ఇంట్లో భద్రంగుంటరని ఓ అక్క తన పిల్లలను అప్పగించింది.. ఆ చెల్లె మాత్రం వారిని చంపి కారు డిక్కీలో దాచింది. అదే కారులో ఏడాది నుంచి సిటీ వీధుల్లో తిరుగుతూనే ఉంది.. అయినా ఎవరూ గుర్తించలే. అమెరికాలోని బాల్టిమోర్​లో జరిగిన ఈ దారుణం బుధవారం వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన నికోల్​ జాన్సన్​ కారులో వెళుతుంటే పోలీసులు ఆపారు. కారు పేపర్లు చూపకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాన్సన్ వివరాలు అడుగుతుంటే.. మరో ఐదు రోజుల్లో మీడియాకు తానో సంచలనంగా మారుతానని చెప్పింది. అనుమానం వచ్చి పోలీసులు ఆ కారును చెక్​ చేశారు. కారులో దాచిన సూట్​కేసులో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో చిన్న పిల్లల డెడ్​బాడీలు బయటపడ్డయి. జాన్సన్​ను విచారించగా.. ఆ డెడ్​ బాడీలు తన అక్క పిల్లలవని చెప్పింది. ఏడేండ్ల పాప, ఐదేళ్ల బాబును 2019లో అక్క తనకు అప్పగించిందని పేర్కొంది. పాప తలను నేలకేసి కొడితే చనిపోయిందని, డెడ్​బాడీని కారులో దాచానని చెప్పింది. తర్వాత బాబును కూడా చంపానని వివరించింది. అయితే, పిల్లలను ఎందుకు చంపిందని కానీ మిగతా వివరాలు కానీ చెప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.