
- మహనీయుల జయంతి వేడుకలకు హాజరైన కొల్లూరి భరత్
రామచంద్రాపురం, వెలుగు: కార్మికుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి దశాబ్ధాల పాటు పాటుపడిన శ్రమ శక్తి అవార్డు గ్రహాత తెల్లాపూర్కు చెందిన కొల్లూరి సత్తయ్య జీవిత చరిత్ర 'మట్టి మేధావి సత్తయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం దుబాయ్లో సోమవారం ఘనంగా జరిగింది. గల్ఫ్లో జరిగిన మహనీయుల జయంతి వేడుకల్లో భాగంగా ఈ పుస్తకావిష్కరణ చేశారు. పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ ఫౌండర్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుబాయ్లోని గల్ఫ్ అంబేద్కర్ రైట్స్ మూమెంట్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ మహనీయులైన ఛత్రపతి శివాజీ, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జాతీయ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ రచించిన మట్టి మేధావి సత్తయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంబేద్కర్ చూపిన మార్గంలోనే కొల్లూరి సత్తయ్య నడిచారన్నారు. ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి వేల మంది పేద విద్యార్థులకు, వారి భవిష్యత్కు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. సత్తయ్య వారసుడిగా తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆయన మార్గంలోనే నడుస్తామని ఉన్నంత కాలం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ డైరెక్టర్ బాలబోయిన సుదర్శన్, గల్ఫ్ అంబేద్కర్ రైట్స్మూమెంట్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.