దుబాయ్లో 'మట్టి మేధావి సత్తయ్య' పుస్తకావిష్కరణ

దుబాయ్లో 'మట్టి మేధావి సత్తయ్య' పుస్తకావిష్కరణ
  • మహనీయుల జయంతి వేడుకలకు హాజరైన కొల్లూరి భరత్​

రామచంద్రాపురం, వెలుగు: కార్మికుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి దశాబ్ధాల పాటు పాటుపడిన శ్రమ శక్తి అవార్డు గ్రహాత తెల్లాపూర్​కు చెందిన కొల్లూరి సత్తయ్య జీవిత చరిత్ర 'మట్టి మేధావి  సత్తయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం దుబాయ్​లో సోమవారం ఘనంగా జరిగింది. గల్ఫ్​లో జరిగిన మహనీయుల జయంతి వేడుకల్లో భాగంగా ఈ పుస్తకావిష్కరణ చేశారు. పూలే అంబేద్కర్​ సెంటర్​ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ ఫౌండర్, తెల్లాపూర్​ మాజీ కౌన్సిలర్​ కొల్లూరి భరత్​ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుబాయ్​లోని గల్ఫ్​ అంబేద్కర్​ రైట్స్​ మూమెంట్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ మహనీయులైన ఛత్రపతి శివాజీ, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్​ అంబేద్కర్​ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జాతీయ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్​ రచించిన మట్టి మేధావి సత్తయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా భరత్​ మాట్లాడుతూ.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంబేద్కర్​ చూపిన మార్గంలోనే కొల్లూరి సత్తయ్య నడిచారన్నారు. ఆస్క్​ ఎడ్యుకేషనల్​ సొసైటీని స్థాపించి వేల మంది పేద విద్యార్థులకు, వారి భవిష్యత్​కు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. సత్తయ్య వారసుడిగా తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆయన మార్గంలోనే నడుస్తామని ఉన్నంత కాలం అంబేద్కర్​ ఆశయ సాధన కోసం పాటుపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పూలే అంబేద్కర్ సెంటర్​ ఫర్​ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ డైరెక్టర్​ బాలబోయిన సుదర్శన్​, గల్ఫ్​ అంబేద్కర్​ రైట్స్​మూమెంట్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.