ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టు ఇవాళ ఉదయం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూపీ సర్కారు, ఆ రాష్ట్ర పోలీసులు తమ అఫిడవిట్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.
బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
గత ఏడాది అక్టోబర్లో లఖీంపూర్ ఖేరీలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను వ్యతిరేకిస్తూ నాడు రైతులు చేపట్టిన నిరసనలపైకి ఒక కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతుల మరణించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు, రైతులు తిరగబడడంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ అల్లర్లలో మరో నలుగురు మరణించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన దర్యాప్తు నివేదికలో రైతులపైకి దూసుకెళ్లిన కారులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నారని, ఈ ఘటనలో ఆయనే ప్రధాన నిందితుడని పేర్కొంది. ఈ కేసులో అజయ్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ను ఆశ్రయించడంతో గత నెల చివరిలో బెయిల్ మంజూరైంది. దీనిపై లఖీంపూర్ ఘటన బాధిత కుటుంబాలు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి.
సాక్షులకు రక్షణ కల్పించండి
ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు పిటిషన్పై ఈ రోజు ఉదయం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ల తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. నిందితుడు బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే మార్చి 12న సాక్షులపై దాడి జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ సీరియస్ అయ్యారు. యూపీ ప్రభుత్వం సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. సాక్షులపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ వేయాలని చెప్పారు.