- బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన
- తమకేం సంబంధం లేదన్న ఎల్అండ్ టీ సంస్థ
- మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్
- ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేటతెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజీ నిర్మించిన ఎల్అండ్టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని.. అధికారులు, ఇంజినీర్లతో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది.
బ్యారేజీలోని ఏడో బ్లాక్ లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్అండ్ టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.
బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ఐదేండ్లు కాదని రెండేండ్లేనని.. ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్అండ్టీ బయటపెట్టింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, ఇందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది. కాగా, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందని తెలిసినా ఎన్నికల్లో గెలుపు కోసమే అప్పటి కేసీఆర్ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టించిందనే విషయం ఎల్అండ్ టీ లేఖతో బయటపడింది.
ముందే ముగిసిన గడువు..
ఈ ఏడాది అక్టోబర్21న మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసులకు కంప్లయింట్ చేయగా, సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తేలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ టీమ్ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.
అయితే, ఎన్డీఎస్ఏ రిపోర్టును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్నర్చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై ఎన్డీఎస్ఏకు స్టేట్డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కు మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల రెండో తేదీన ఎల్అండ్టీ సంస్థ రామగుండం ఈఎన్సీకి లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లతో తమకు సంబంధం లేదని అందులో స్పష్టం చేసింది. పలు ఆసక్తికర విషయాలను లేఖలో బయటపెట్టింది. ‘‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2018, ఆగస్టు 25 వరకు పూర్తి చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాం. వివిధ కారణాలతో 2020, జూన్ 29 నాటికి నిర్మాణం పూర్తి చేశాం. 2021, మార్చి 15వ తేదీతో బ్యారేజీ పనులు పూర్తయినట్టుగా సంబంధిత ఎస్ఈ మాకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.
అగ్రిమెంట్ ప్రకారం సివిల్పనులకు ఏదైనా నష్టం జరిగితే బ్యారేజీ హ్యాండోవర్ చేసిన 24 నెలల వరకు మేం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్2020, జూన్29 నుంచి 2022, జూన్29 వరకు ఉంటుందని మేం పేర్కొన్నాం. ప్రాజెక్ట్ ఎస్ఈ కూడా 2021, మార్చి 15న పని పూర్తయిందని, తాము హ్యాండోవర్ చేసుకున్నామని ధ్రువీకరించారు. ఈ తేదీని పరిగణనలోకి తీసుకున్నా.. ఈ ఏడాది మార్చి 15తోనే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయింది..” అని ఎల్అండ్ టీ స్పష్టం చేసింది. అక్టోబర్21న బ్యారేజీ కుంగింది కాబట్టి సివిల్వర్క్స్డ్యామేజీని పునరుద్ధరించాల్సిన బాధ్యత తమపై లేదని తేల్చి చెప్పింది.
బ్యారేజీ దెబ్బతిన్న తర్వాత ఈఎన్సీ (రామగుండం) అక్టోబర్25, నవంబర్25న తమ సంస్థకు రాసిన లేఖల ఆధారంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలంటే.. తమ సంస్థతో నాన్ ఈపీసీ అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపింది. ఏడో బ్లాక్ వద్ద కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట) కట్టడానికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని.. దీనికి జీఎస్టీ, సీనరేజీ చార్జీలు అదనమని స్పష్టం చేసింది. అదే సమయంలో మెటీరియల్లభ్యత, పెరిగిన ధరలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఆ ప్రకటన ఎల్అండ్టీ చెయ్యలేదా?
అక్టోబర్21న మేడిగడ్డ బ్యారేజీ కుంగగా 22న ప్రాజెక్టు ఇంజినీర్లతో పాటు ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు కుంగిన బ్యారేజీని పరిశీలించారు. అదే రోజు ఆ సంస్థ జీఎం సురేశ్కుమార్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. టెక్నికల్ టీమ్ను ఏర్పాటు చేసి సమస్యకు కారణాలేమిటో పరిశీలిస్తామని, అవసరమైన పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అదే రోజు మేడిగడ్డ ఈఈ తిరుపతి రావు కూడా మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
బ్యారేజీ.. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆధీనంలో ఉంది కాబట్టి పునరుద్ధరణ పనుల పూర్తి బాధ్యత ఆ సంస్థనే తీసుకుంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో నవంబర్4న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ను తామే పునరుద్ధరిస్తామని చెప్తూ ఎల్అండ్టీ సంస్థ పేరుతో ఒక ప్రకటన మీడియాకు రిలీజ్ చేశారు. ఇప్పుడా ప్రకటన అసలు ఎల్అండ్టీ సంస్థనే ఇచ్చిందా? లేక అప్పటి ప్రభుత్వమే ఎల్అండ్టీ పేరుతో ప్రచారంలోకి తెచ్చిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రిపేర్లకు రూ.600 కోట్లు..
మేడిగడ్డ ఏడో బ్లాక్లోని 11 పిల్లర్లను కొత్తగా నిర్మించాల్సిందేనని ఎన్డీఎస్ఏ ప్రాథమికంగా అంచనా వేసింది. బ్యారేజీకి ఎంత మేరకు నష్టం జరిగింది? పునరుద్ధరణ పనులు ఎంత మేరకు చేయాల్సి ఉంటుందనే దానిపై ఇరిగేషన్ ఇంజినీర్లతో పాటు ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు ఇన్వెస్టిగేషన్చేస్తున్నారు. బ్యారేజీ పునరుద్ధరణకు కనీసం రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పుడా భారమంతా ప్రజలే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణంపై మొదట్లోనే జాగ్రత్తలు తీసుకొని ఉంటే, పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదని ఇరిగేషన్ ఇంజినీర్లలో చర్చ జరుగుతోంది.